ఎస్సారెస్పీ నీరు చెరువుల్లోకి..
కాలువల ద్వారా విడుదల
పంటలకు పుష్కలంగా జలం
ఆదిలాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. చెక్డ్యాంల నిర్మాణంతో రైతులకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేసింది. రైతులకు రెండు సీజన్లలో సాగునీటి సౌకర్యం కల్పిస్తుండడంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు 90 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతేడాది కంటే ఈ సారి 12 వేల ఎకరాల్లో విస్తీర్ణం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా పంటలకు అవసరమైన సమయంలో నీరు విడుదల అవుతున్నది. యాసంగిలో జనవరి-మార్చి వరకు ప్రాజెక్టుల్లోని నీటిని వదులుతారు. జిల్లాలోని కడెం, ఖానాపూర్, లక్ష్మణచాంద, సోన్, మామడ మండలాల రైతుల పొలాలకు ప్రాజెక్టు నీటితో ప్రయోజనం చేకూరుతుంది. ఈ నీటితో రైతులు తమ గ్రామాల్లోని చెరువులను నింపుకుంటారు. విడుతలవారీగా నీటిని విడుదల చేస్తుండగా ఏటా జనవరిలో మొదటి విడుత ఐదు మండలాల్లోని చెరువులకు నీరు చేరుతుంది. చెరువుల్లోకి చేరిన నీటిని రైతులకు పొదుపుగా వాడుకుంటారు. పంటలకు అవసరమైన సమయంలో నీటిని అందిస్తుండగా ఐదు మండలాల్లోని 36 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో మత్స్యకారుల ఉపాధి మెరుగుపడడంతోపాటు వేసవిలో పశువులకు తాగునీటిని ఇబ్బందులు ఉండవని రైతులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మాజీ ముఖ్యమంత్రికి, ఆయన భార్యకు కరోనా..!
కరోనా టైంలో ఇమ్యూనిటీ పెరగాలా? దీన్ని తినండి