కుంటాల, ఏప్రిల్ 25 : వేసవికాలం దృష్ట్యా ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని అంబకంటి, అంబకంటి తండా గ్రామపంచాయతీలో ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను పరిశీలిస్తూ సమస్యలపై గ్రామస్తులను అడుగగా తాగునీటి సరఫరా సక్రమంగా లేదని, వీధిదీపాల నిర్వహణ కూడా సరిగ్గా లేదని తెలిపారు.
వాటర్ ట్యాంక్ వద్ద నాచు పేరుకుపోవడంతో శుభ్రం చేయాలని ఆదేశించారు. దీంతో గ్రామ ప్రత్యేకాధికారి అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి ఉత్తమ్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూ చించారు. అంబకంటి గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించగా గ్రామసభలు, ఉపాధిహమీ, పంచాయతీ కార్మికుల వివరాలు అస్తవ్యస్తంగా ఉండటంతో అదనపు కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పంచాయతీ కార్యదర్శి పనితీరుపై డీపీవోకు నివేదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి ముందు అంబకంటి గ్రామంలో రూర్బన్ పథకం కింద 400 టన్నుల ధాన్యం నిలువ సామర్థ్యంతో నిర్మించిన గోదామును పరిశీలించారు. త్వరగా రైతులకు అందుబాటులో తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట డీఆర్డీవో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీడీవో రహీం, ఏపీవో నవీన్ ఉన్నారు.