సింగరేణిలో చారిత్రాత్మాక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వం 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన వేతన బకాయిలను ఒకేదఫాలో చెల్లించి రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 39 వేల మంది కార్మికులు, ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమ చేయగా, ఇందులో మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లోగల 14,884 మందికి రూ. 336.12 కోట్లు అందించింది. ఇక దసరా, దీపావళి పండుగలకు సంబంధించిన బోనస్ను సైతం సకాలంలో చెల్లించేందుకు సిద్ధమవుతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మంచిర్యాల, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణిలో కనీవినీ ఎరుగని చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకున్నది. 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన వేతన బకాయిలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫాలో చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 వేల మంది కార్మికులకు రూ.1,450 కోట్లు బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి బకాయిలు చెల్లించడం గొప్ప విషయమని కార్మికవర్గాలు అంటున్నాయి. దసరా పండుగకు నెల ముందుగానే డబ్బులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు ఏరియాల్లో 14,884 మంది కార్మికులు ఉండగా, వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.336.12 కోట్లు జమ అయ్యాయి. యాజమాన్యం మొదట రెండు దఫాల్లో ఈ డబ్బులు చెల్లించాలనుకున్నది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో ఒకే దఫాలో విడుదల చేసింది. కోల్ ఇండియా కంటే ముందే సింగరేణి సంస్థ కార్మికులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించడం గమనార్హం. దీనితో పాటు దసరా, దీపావళి పండుగలకు సంబంధించిన బోనస్ను సైతం సకాలంలో చెల్లిస్తామని ప్రకటించడంపై సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ సంఘాల వైఫల్యంతో వేజ్బోర్డు 23 నెలల ఆలస్యమైనా, జూన్ 20వ తేదీన సంతకాలైన వెంటనే అదే నెల కొత్త జీతాలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత సింగరేణికే దక్కుతుందంటున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్తోనే సింగరేణి కార్మికుల అనేక హక్కులు సాధ్యమయ్యాని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి అనానరు. సీఎం కేసీఆర్ కృషితో గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులకు ఒకే దఫా ఏరియర్స్ చెల్లించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా సీసీసీ నస్పూర్లోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే దఫా ఏరియర్స్ చెల్లింపులపై సింగరేణిలో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. జాతీయ కార్మిక సంఘాల నిర్లక్ష్యంతోనే వేజ్బోర్డు ఆలస్యమైందని ఆరోపించారు. ఏరియర్స్ చెల్లింపుల విషయంలో ఏఐటీయూసీ తప్పుడు ప్రచారం చేసిందని, సింగరేణి కార్మికులకు ఒకే దఫా ఏరియర్స్ చెల్లించాలని తమ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కోరడంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చెల్లించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కవిత, యూనియన్ నేతలు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఇన్కం ట్యాక్స్ వల్ల కార్మికుల ఏరియర్స్లో దాదాపు 50 శాతం కోత పడిందన్నారు. దీంతో కార్మికులు నిరుత్సాహానికి గురయ్యారని, పార్లమెంట్లో అప్పటి ఎంపీలు బాల్క సుమన్, కల్వకుంట్ల కవిత ఐటీ మినహాయింపుపై కేంద్రాన్ని నిలదీశారని గుర్తుచేశారు. కార్మికులకు ఐటీ నుంచి మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు సింగరేణి కార్మికులంటే ప్రేమ ఎక్కువని, అడగకుండానే అన్ని హక్కులు కల్పిస్తున్నారని చెప్పారు. లాభాల వాటాను 30శాతం పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతేడాది వచ్చిన లాభాల్లో నుంచి రూ.700 కోట్లను దసరాలోగా చెల్లించనున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి వాటా పెంచలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ కల్పించిన హక్కులను వివరించారు. ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శులు రామిడి మహేందర్రెడ్డి, రిక్కుల గోపాల్రెడ్డి, మెండె వెంకటి, శ్రీనివాస్చారి, వెంకటేశ్వర్లు, ఎంబడి తిరుపతి, ఇప్ప భూమయ్య, పుప్పాల సదానందం, ప్యాగ మల్లేశ్, నాయకులు నీలం సదయ్య, బ్రహ్మచారి, ప్రేమ్, సారయ్య, కుర్స దుర్గయ్య, అన్వేష్రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్కు ప్రత్యేకాభిమానం..
రెబ్బెన, సెప్టెంబర్ 22 : ఎరియార్స్ డబ్బులు ఓకే సారి బ్యాంక్ ఖాతాలో జమ కావడం అనందంగా ఉంది. సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక అభిమానం, ప్రేమ ఉన్నాయి. అందుకే ఏరియర్స్ డబ్బులు ఓకేసారి చెల్లించేలా ఆదేశాలు ఇచ్చి జమ చేయడంపై కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు కార్మికుల పరిస్థితి బాగుండేది కాదు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి తర్వాత కార్మికుల బతుకులు బాగుపడ్డాయి. ఆయన వల్లే సింగరేణిలో అనేక హక్కులు వచ్చాయి. కోల్ ఇండియాలో లేని విధంగా ఎన్నో హకుకలు సింగరేణి కార్మికులకు అమలు చేస్తున్నారు. ఒకప్పుడు ఏరియార్స్ డబ్బులు కానీ, బోనస్ కానీ, అడ్వాన్స్ కానీ చాలా తక్కువగా వచ్చేవి. సీఎం కేసీఆర్ పుణ్యామా అని పెరిగి వస్తునాయి. ఇంత మంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. – గోలెం గట్టయ్య, ఎంవీ డ్రైవర్(గోలేటి సీహెచ్పీ)
బీఆర్ఎస్తోనే కార్మికులకు లాభాలు..
మందమర్రి, సెప్టెంబర్ 22 : తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వపరిపాలనలో కార్మికులకు అనేక హక్కులు వచ్చాయి. గతంలో వేజ్బోర్డుల కోసం నెలల తరబడి సమ్మెలు చేసే పరిస్థితి ఉండేది. నేడు సమ్మెల సంస్కృతి లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ పాలనలో సింగరేణికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గతంలో జాతీయ సంఘాలు రద్దు చేసిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని పునరుద్ధరించిన ఘనత ఆయనకే దక్కింది. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపును కలిగి ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం వల్ల కార్మికులకు అనేక హక్కులు ఏర్పడడంతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. 11వ వేతన ఒప్పందం కూడా అనతి కాలంలోనే జరిగింది. అందుకు సంబంధించిన ఏరియర్స్ ప్రభుత్వ ప్రోద్బలంతో ముందస్తుగా చెల్లింపులు జరిగాయి. ఊహించిన దానికంటే రెట్టింపు ఏరియర్స్ రావడం కార్మిక కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.
– ఈశ్వర్, టీబీజీకేఎస్ నాయకుడు, మందమర్రి
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు..
రెబ్బెన, సెప్టెంబర్ 22 : 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన ఏరియార్స్ 1450 కోట్లు ఒకే దఫా చెల్లించేందుకు ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీబీజీకేస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆ డబ్బులు గురువారం ఒకే సారి చెల్లించింది. జాతీయ కార్మిక సంఘాల నిర్లక్ష్యంతో 11వ వేజ్ బోర్డు చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగింది. 23 నెలలు పట్టించుకోకుండా తాత్సారం చేసింది. వేతన ఒప్పందంలో కూడా వివక్ష చూపింది. కార్మికులకు అనుకున్న స్థాయిలో డబ్బులు కూడా రాలేదు. జాతీయ కార్మిక సంఘాలు ఇంత కంటే మెరుగైన వేతన ఒప్పందం చేసి ఉంటే బాగుండేది. ఇన్ని నెలల ఏరియర్స్కు సంబంధించిన డబ్బులను కూడా యాజమాన్యం రెండు దఫాలుగా చెల్లించేందుకు నిర్ణయించింది. కానీ, సీఎం కేసీఆర్, గౌరవాధ్యక్షురాలు చొరవ చూపడంతో యాజమాన్యం స్పందించింది. ఈ రోజులు కార్మికులు లాభపడ్డారు.
– మల్రాజు శ్రీనివాసరావు, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్
ప్రత్యేక కృషితో ఒకే దఫా చెల్లింపు..
జాతీయ సంఘాల వైఫల్యంతో 11వ వేజ్బోర్డు 23 నెలలు ఆలస్యమైంది. జూన్ 20వ తేదీన సంతకాలైన వెంటనే అదే నెల కొత్త జీతాలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికే దక్కుతుంది. ఏరియర్స్ చెల్లింపు ఇప్పట్లో కాదని మూడు, నాలుగు దఫాలుగా చేస్తారని జాతీయ సంఘాలు చేసిన అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడుతూ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఎమ్మెల్యేలు దివాకర్రావు, బాల్క సుమన్, సంఘం నాయకుల కృషితో ఒకే దఫాలో చెల్లించారు. సీఎం కేసీఆర్ నస్పూర్ వచ్చిన సందర్భంగా సంస్థకు రూ.2,200 కోట్ల లాభాలు వచ్చాయని, అందులో రూ.700 కోట్లు అతి త్వరలో చెల్లిస్తామని చెప్పారు. కార్మికుల హక్కులను ఎలాంటి ధరానలు, రాస్తారోకోలు లేకుండానే నెరవేరుస్తూ, కోల్ ఇండియాలో లేని విధంగా సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది.
– సురేందర్రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్
ఏరియర్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది..
మందమర్రి, సెప్టెంబర్ 22 : పండుగల సమయంలో 11వ వేజ్బోర్డు ఏరియర్స్ చెల్లింపులు జరగడంపై కార్మికవర్గం హర్షం వ్యక్తం చేస్తున్నది. పండుగలతో పాటు విద్యా సంస్థలు ప్రారంభ సమయం కావడంతో కొంత ఇబ్బంది ఏర్పడేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సింగరేణిలో అనేక హక్కలు కల్పించబడ్డాయి. గతంలో వేజ్బోర్డుల సాధన, ఏరియర్స్ చెల్లింపుల కోసం నెలల తరబడి సమ్మెలు, పోరాటాలు చేస్తే గానీ వచ్చేవి కావు. స్వపరిపాలనలో సింగరేణి ప్రగతిని సాధించడంతో పాటు కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం త్వరిగతిన జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సింగరేణి కార్మిక బిడ్డలను తెలంగాణ ప్రభుత్వం కడుపున పెట్టుకొని కాపాడుకుంటున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏరియర్స్ చెల్లించడం సంతోషంగా ఉంది.
– మద్దెల శంకర్, టీబీజీకేఎస్ నాయకుడు, మందమర్రి