ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులు
ఉమ్మడి జిల్లాలో సుమారు 48 వైన్స్ షాపులు వారికే..
ఓపెన్’లో మరికొన్ని దక్కే అవకాశం
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 25: మద్యం దుకాణాలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో సంతోషం నింపింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏటా అక్టోబర్ మాసంలో వైన్స్షాపులకు టెండర్లు నిర్వహిస్తుండగా, ఈ సారి కొత్త పాలసీని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం ద్వారా గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 163 దుకాణాలు ఉండగా, వీటిలో సుమారు 48 షాపులు వారికే రిజర్వ్ కానున్నాయి. దీంతోపాటు ఓపెన్ కేటగిరీలో కూడా మరికొన్ని దక్కే అవకాశముండగా, ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో మద్యం దుకాణాలకు లక్కీడీప్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది దుకాణాల కేటాయింపులో కొత్త పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాల ఆధారంగా మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం ఈనెల 20న గెజిట్ను విడుదల చేసింది. ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాల్లో 30 శాతం వీరికి రిజర్వేషన్ ద్వారా దక్కనుండగా, మిగతా 70 శాతం ఓపెన్ టెండర్ ద్వారా కేటాయించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మొత్తం 163 వైన్షాపులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఆదిలాబాద్లో 26, మంచిర్యాలలో 69, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 31, నిర్మల్లో 37 దుకాణాల ద్వారా ప్రభుత్వం మద్యం విక్రయాలను చేపడుతున్నది. ఏటా అక్టోబర్ మాసంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరించి, ఓపెన్ టెండర్ ద్వారా షాపులను కేటాయించేవారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే గిరిజనులకు అవకాశమివ్వగా, ఇప్పుడు గిరిజనులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించనుంది. ఇందులో భాగంగా రిజర్వేషన్లు అమలైతే ఉమ్మడి జిల్లాలో గౌడ కులస్తులకు 23, ఎస్సీలకు 16, ఎస్టీలకు 9 మొత్తం 48 మద్యం దుకాణాలు రిజర్వేషన్ కోటాలో ఈ వర్గాలకు దక్కనున్నాయి. మిగతా 113 మద్యం దుకాణాలు ఓపెన్ టెండర్ విధానంలో మిగతా వర్గాల్లోని అన్ని సామాజిక వర్గాలకు దక్కనున్నాయి.
రిజర్వేషన్లపై సంబురాలు
మద్యం దుకాణాలంటేనే పెట్టుబడి వ్యాపారమని అందరూ చర్చించుకుంటారు. ఒక్కో దుకాణానికి ప్రభుత్వం రూ.2లక్షల డిపాజిట్ ముందే చెల్లిస్తేనే టెండర్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించేది. దీంతో సమాజంలో అట్టడుగు వర్గాలైన గీత కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలు, పేద సామాజిక వర్గానికి చెందిన వారు మద్యం దుకాణాలపై ఆసక్తి చూపేవారు కాదు. దీంతో మద్యం దుకాణాలను 80 శాతం ధనిక వర్గాలే దక్కించుకునేవారు. కొందరైతే ఒక గ్రూపుగా ఏర్పడి సామూహికంగా టెండర్లు వేసి అందులో ఏ ఒక్కరికీ దుకాణం వచ్చినా మిగతా వారందరూ సమష్టిగా లాభాలను తీసుకునేవారు. ఐతే ప్రభుత్వం ఈ ఏడాది నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేస్తూ గీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గౌడ కులస్తులకు 15శాతం, అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు మరో 15 శాతం రిజర్వేషన్లు ఖరారు చేయగా ఆ కుటుంబాల్లో సంతో షం వ్యక్తమవుతున్నది. వచ్చే నెలలోనే నూతన పాలసీ విధానంతో షాపులు కేటాయించనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఆయా జిల్లాలో షాపులను దక్కించుకునేందుకు గౌడ కులస్తులు, ఎస్సీలు, ఎస్టీలు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూ రు, ఖానాపూర్, భైంసా, బెల్లంపల్లి, బోథ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా మద్యం దుకాణాలు ఉండడంతో ఆ ప్రాంతంలోనే దుకాణాలను దక్కించుకునేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు.