వానకాలంలో అప్రమత్తతే రక్ష
ఏటా విద్యుత్ ప్రమాదాలతో రైతులు, మూగ జీవుల మృత్యువాత
దస్తురాబాద్, జూన్ 23 : వెలుగులు విరజిమ్మే విద్యుత్తే..ప్రాణాలు తీసే యమపాశంగా మారుతున్నది. విద్యుత్ ప్రమాదాలతో రైతులు, పశువులు మృత్యువాత పడుతున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సొంతంగా మరమ్మతులు తదితర కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వానకాలంలో వ్యవసాయ మోటర్ల వద్ద రైతులు సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. కరెంట్ విషయంలో కనీస అవగాహన ఉండి, అప్రమత్తంగా ఉంటే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని, వానకాలం ప్రారంభమైన సందర్భంగా కరెంట్ మోటర్ల వద్ద కనీస జాగ్రత్తలు పాటించాలని ట్రాన్స్కో అధికారులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో ప్రమాదాలు
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు లేక, ఎర్తింగ్ తీగలు, విద్యుత్ తీగలు మీద పడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్ తీగలకు తగిలి పంట పొలాల్లో రైతులు కూడా మృత్యువాత పడుతున్నారు. నాణ్యతా లోపంతో తీగలు, తెగి కింద పడడం, గాలి దూమారాలకు చెట్లు, కొమ్మలు తెగి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ముందస్తు చర్యలతో అడ్డుకట్ట
ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చు. వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే మోటర్లకు మరమ్మతులు చేయించుకోవాలి. అవగాహన లేనప్పుడు సొంతంగా ప్రయత్నించవద్దు. ట్రాన్స్ఫార్మర్ పై ఫ్యూజులు వేయవద్దు.సమస్య ఉంటే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకవెళ్తే పరిష్కరిస్తారు. మోటార్ దగ్గరకు వెళ్లగానే స్టార్టర్ను టెస్టర్తో పరీక్షించి, కరెంట్ సరఫరా అవుతుందో లేదో చూసుకోవాలి. ఐఎస్ఐ పంపు సెట్లు, సర్వీసు తీగలను మాత్రమే వాడాలి.మోటర్లు వర్షంలో తడువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ స్తంభం నుంచి మోటర్ మధ్య ఎక్కువ దూరం లేకుండా చూసుకోవాలి. మధ్యలో ఫ్యూజ్ బాక్స్, స్టార్టర్ తప్పనిసరిగా ఉండాలి. మూడు నెలలకోసారి ఫ్యూజ్ క్యారియర్ను శుభ్రం చేయాలి. విద్యుత్ పనులు చేస్తున్నప్పుడు మేకులు లేని బూట్లు, తడి తగలని రబ్బరు లేదా ప్లాస్టిక్ చెప్పులను వేసుకోవాలి. ఫ్యూజులు, ఇండికేటర్ బల్బు, స్టార్టర్ను ఒక చెక్కపై బిగించి, ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే బిగించాలి. ఎట్టి పరిస్థితుల్లో తేమ లేకుండా చూడాలి. విద్యుత్ తీగలు తెగి ఉంటే వెంటనే ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇచ్చి, సరి చేయించుకోవాలి. గాలి దూమారాలు వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు విద్యుత్ వైర్ల కింద పశువులను ఉంచవద్దు. వేరే చోటుకు తరలిస్తే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు.
చర్యలు తీసుకుంటున్నాం
విద్యుత్ సమస్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.అవసరం ఉన్న చోట, ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేశాం. విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రైతులు సొంతంగా విద్యుత్ తీగలను సవరించే పనులు చేసుకోవద్దు. పంట రక్షణ కోసం విద్యుత్ వైర్లను వాడి తమ ప్రాణాలను పోగొట్టుకోవద్దు. స్టార్టర్లు, మోటర్లకు ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాల నివారణకు అవకాశాలు ఉన్నాయి. మోటార్లు, విద్యుత్ వైర్ల వద్ద ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ట్రాన్స్కో సిబ్బందికి సమాచారం అందించాలి.