నిర్మల్ జిల్లాను ముంచెత్తిన వాన.. కాలనీలు జలమయం..
నర్సాపూర్(జీ)లో అత్యధికంగా 245 మిల్లీమీటర్ల వర్షపాతం
పరిస్థితిని ఫోన్లో సీఎం కేసీఆర్కు వివరించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ పట్టణంలో పది గంటలపాటు పర్యటించిన మంత్రి అల్లోల
300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ టీం సభ్యులు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మల్కు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
నిర్మల్ రోడ్డుపైకి చేపలు కొట్టుకురావడంతో వలలతో పట్టుకున్న ప్రజలు
ఆదిలాబాద్ప్రతినిధి/ కుమ్రం భీం ఆసిఫాబాద్/ మంచిర్యా ల (నమస్తే తెలంగాణ), జూలై 22:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అధికార యంత్రాంగం పలు సహాయక చర్యలు తీసుకుంటున్నది. వర్షంతో ఇండ్లు నేలమట్టం కాగా.. పంటలు నీటమునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి వరద చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు కాపాడారు. కాగా.. నిర్మల్లోని పలు కాలనీలు నీట మునగడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వర్షంలో పది గంటల పాటు పర్యటించారు. సీఎం కేసీఆర్కు పరిస్థితి వివరించడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న 300 మందిని కాపాడారు. మంచిర్యాల జిల్లాలోని భూగర్భ గనులు, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో మంగళవారం నుంచి ముసురు ఉండగా.. గురువారం భారీవర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలో సగటు వర్షపాతం 150 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో 70.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. వర్షం కారణంగా జనజీవనం అతలాకుతలం అ యింది. చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించడం తో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లోకి నీరు చేరడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి మంజులాపూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్ధాపూ ర్, సోఫీనగర్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన మం త్రి వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. జిల్లాలోని పలు గ్రామాల్లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. నిర్మల్ జిల్లా బాబాపూర్ వద్ద వంతెన నిర్మాణం లో భాగంగా వేసిన మట్టిరోడ్డు కొట్టుకు పోగా ఆదిలాబాద్ జి ల్లాకు రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. బాసర గోదావరిలోకి భారీగా నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాలతోపాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.
వరదలో చిక్కుకున్న వారిని రక్షించిన స్థానికులు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ మహాలక్ష్మీ ఆలయానికి పెయింట్ వేసేందుకు వచ్చిన ముగ్గురు కార్మికులు వరద నీటిలో చిక్కుకోగా అధికారులు రక్షించేందుకు చర్యలు చేపట్టారు. కుంటాల మండలం వెంకుర్లో వాగు పొంగడంతో వ్యవసాయ పనులకు వెళ్లిన దంపతులు రెస్క్యూ సిబ్బంది సా యంతో వరద నీటి నుంచి బయటకు వచ్చారు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయగా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు పరివాహక ప్రాంతాల్లోని చెరువుల్లో చేరింది. మంజులాపూర్ చెరువు, సిద్ధాపూర్ వాగులోని చేపలు వరద నీటికి కొట్టుకొచ్చాయి. రోడ్డుపైనే మత్స్యకారులు, యువకులు, స్థానికులు వలలు, చేతులతో చేపలు పట్టుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సీఎం కేసీఆర్కు వివరించారు. నిర్మల్ జిల్లాకు తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్కు కేసీఆర్ ఆదేశించారు. నేరడిగొండ మండలంలో 20 ఏండ్లుగా ఇటువంటి వర్షం పడలేదని స్థానికులు పేర్కొన్నారు. బోరిగాం రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. రాజులతండా గ్రామానికి చెందిన అనితకు పురిటినొప్పులు రావడంతో ఆటోలో దవాఖానకు తరలిస్తుండగా వాగులో చి క్కుకున్నారు. వరద ఉధృతికి ఆటో కొట్టుకుపోగా గర్భిణిని స్థా నికులు కాపాడారు.
అనంతరం అనితను పొచ్చెర వరకు ఎడ్లబండిలో.. అక్కడి నుంచి అంబులెన్స్లో నేరడిగొండకు దవాఖానకు తరలించారు. వరదలో వాగ్దారి శ్మశానవాటిక మునిగింది. బోథ్ మండలంలోని దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వరదతో రహదారులు కొట్టుకుపోయాయి. ఇండ్లలోకి నీరు చేరింది.వేలాది ఎకరాలల్లో వర్షపు నీరు నిలిచి తీవ్ర నష్టం వాటిల్లింది. బజార్హత్నూర్ మండలంలో జాతర్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా.. స్థానిక ఎస్సై తన వాహనంలో వాగు దా టించి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. ఉట్నూర్ మండలం చెర్వుగూడ జీపీ పరిధిలోని జెండగూడ కొలాంగ గ్రామంలో గల పాఠశాలకు ఉపాధ్యాయుడు చౌహాన్ రవీందర్ వెళ్తుండగా వాగులో చిక్కుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఆయనను కాపాడారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్-శంకర్గూడ గ్రా మాల మధ్య గల త్రివేణి సంగమం ప్రాజెక్టు మత్తడి ఉధృతంగా పారడంతో చేపలు బయటకు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఆదివాసీలు వలలతో చేపలు పట్టారు. భైంసా పట్టణంలోని ఆటోనగర్, భట్టిగల్లి, రాహుల్ నగర్లోని ప్రాంతాల్లో వరద చేరింది. ఆటోనగర్లో గల ఎన్ఆర్ గార్డెన్లో బక్రీద్ పండుగకు వచ్చిన పోలీస్ సిబ్బంది 14 మంది, ఇద్ద రు పనిచేసే వారు చిక్కుకోవడంతో వారిని స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, ఏఎస్పీ కిరణ్ ఖారే, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే దగ్గరుండి తీసుకురావడానికి ప్రయత్నించారు. రంగారావ్ పల్సికర్ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో వరద బ్రిడ్జిపై నుంచి పా రుతూ ఇండ్లలోకి చేరింది. నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో జలదిగ్బంధం కావడంతో అక్కడ మంత్రి పర్యటించారు. ఓ బాలింత జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం మంత్రి దృష్టికి రాగా.. అక్క డికి చేరుకున్న ఆయన దగ్గరుండి సహాయక చర్యలు చేయించడంతో బాలింత, 11 రోజుల వయస్సున్న బాబును, యువకుడిని రె స్క్యూ టీం సహాయంతో రక్షించారు. నిర్మల్ జిల్లాలో దాదాపు 300 మందిని గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం సభ్యులు కాపాడారని మంత్రి తెలిపారు. కాగా, వరద సహాయక చర్యలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృం దాలు సాయంత్రానికి నిర్మల్కు చేరుకున్నాయి. 10 మంది సభ్యులు స్థానిక జీఎన్ఆర్ కాలనీలో సాయంత్రం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
నిండిన ప్రాజెక్టులు.. గేట్లు ఎత్తివేత..
వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. భారీగా వస్తున్న ఇన్ఫ్లో కారణంగా నీ టిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో అధికారులు గే ట్లు ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695. 875 అడుగులకు చేరింది. 16 గేట్లు ఎత్తిన అధికారులు 1,93,140 క్యూ సెక్కులు నీటిని బయటకు వదులుతున్నారు. గడ్డెన్న వాగు ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా 358.6 మీటర్ల నీరు నిల్వ ఉంది. ఐదు గేట్లు ఎత్తిన అధికారులు 69, 656 క్యూసెక్కులు నీటిని వదిలారు. ఆదిలాబాద్ జిల్లా సా త్నాల ప్రాజెక్టు గరిష్ఠ నీటమట్టం 286.50 మీట ర్లు కాగా ప్ర స్తుతం 285.50 మీటర్ల నీరు నిల్వ ఉంది. 846 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా రెండు గేట్లను ఎత్తిన అధికారులు 487 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. మత్తడివాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు 277 మీటర్ల వరకు నీరు చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తివేసి 145 క్యూసెక్కులను వదిలారు. కాగా.. ఎగువ ప్రాం తాల నుంచి వస్తున్న వరదతో నేరడిగొండ మండలంలో ని కుంటాల, కొరిటికల్.. బోథ్ మండలంలోని పొచ్చెర.. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల.. నార్నూర్ మండలం పారేఖాతి వాటర్ఫాల్స్కు ప్రవాహం బాగా పెరిగింది.
నిర్మల్ జిల్లాలో 150 మి. మీ వర్షపాతం నమోదు
నిర్మల్ జిల్లాలో గురువారం 150 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ (జీ)లో అధికంగా 245 మిల్లీమీటర్లు, దిలావర్పూర్లో 234.4, కుంటాలలో 227.6, సారంగాపూర్లో 218.2, నిర్మల్లో 170.4, నిర్మల్ రూరల్లో 165.5, భైంసాలో 147.6, మథోల్లో 146.6, తానూర్లో 129.4, కుభీర్లో 90.4, బాసరలో 111, లోకేశ్వరంలో 155.2, లక్ష్మణచాందలో 199.6, మామడలో 160.2, పెంబి లో 98.8, ఖానాపూర్లో 108, కడెంలో 108.2, దస్తురాబాద్లో 54.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 70.8 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కాగా.. బోథ్లో అధికంగా 211.4 మిల్లీ మీటర్లు నమోదైంది. నేరడిగొండలో 182, బజార్హత్నూర్ లో 148.2, గుడిహత్నూర్లో 52.4, ఇచ్చోడలో 78.8, నార్నూర్లో 40.41, ఇంద్రవెల్లిలో 43.2, ఉట్నూర్లో 63.4, తలమడుగులో 32.2, తాంసిలో 21, ఆదిలాబాద్లో 21.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
మంచిర్యాల జిల్లాలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు 35 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, రిజర్వాయర్లో 2,28,690 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. నీల్వాయి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం(ఎఫ్ఆర్ఎల్) 124 మీటర్లు, సామర్థ్యం 846 మిలియన్ క్యూబిక్ ఫీట్లు కాగా, ప్రస్తుతం 0.817 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 30.9 మి.మీల వర్షపాతంగా నమోదైంది. ప్రస్తుత నీటి మట్టం 123.900 మీటర్లుగా ఉంది. 324 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారి తెలిపారు. చెన్నూర్లో, గూడెం గుట్ట వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అన్నారం సరస్వతీ బ్యారేజీ 45 గేట్లు ఎత్తారు. చెన్నూర్, జన్నారం, కోటపల్లి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో వాగులు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నదిలో పడవలు నిలిపివేయాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీరాంపూర్, మందమర్రి డివిజన్లలోని నాలుగు ఓపెన్ కాస్టు ల్లో దాదాపు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఓపెన్ కాస్టు గనుల్లో మట్టి వెలికితీసే పనులు కూడా నిలిచిపోయాయి. గనుల్లోకి వరద నీరు చేరుతుండడంతో మోటార్లతో నీటిని బయటకు తోడేస్తున్నారు. కాసిపేట మండలం కొమటిచేను శివారులోని సల్పాలవాగు ప్రాజెక్ట్ మత్తడి కింద వరద నీటిలో గురువాపూర్కు చెందిన ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. ప్రసాద్, ప్రశాంత్, శ్రీని వాస్ మత్తడి కింద చేపలను పట్టుకునేందుకు వెళ్లగా, ఒక్క సారిగా నీటి ప్రవాహం పెరిగింది. గజ ఈతగాళ్ల సాయంతో పో లీసులు అక్కడికి వెళ్లి, రాత్రికి ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు. కా గా, వర్షాలు, వరదల తీవ్రత దృష్ట్యా చెన్నూర్ నియోజక వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విప్ బాల్క సుమన్ ఒక ప్ర కటన విడుదల చేశారు. వాగులు, వంకలు, నీటి పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్..
ఆసిఫాబాద్ జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు, పలు కాలనీలు జలమయమాయ్యాయి. ఇండ్లలోకి వరద చేరడంతో జ డ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పరిశీలించారు. సిర్పూర్- టి మం డలం లోన్వెల్లికి వెళ్లే మార్గంలో లక్ష్మీపూర్ వద్ద 33 కేవీ విద్యుత్ స్తంభం వంగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. లింగాపూర్, ఆసిఫాబాద్, చింతలమానేప ల్లి, పెంచికల్పేట్ మండలాల్లో వాగులు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాణి మండలం మందగూడ పంచాయతీలోని చింతలమాధర జలపాతంలో బుధవారం గల్లంతైన యువకుడి మృతదేహాం గురువారం లభ్యమైంది. కుమ్రం భీం ప్రాజెక్టు నీటి మట్టం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.084 టీఎంసీల నీరు ఉంది. 16769 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఐదు గేట్లు ఎత్తి 16709 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వట్టివాగులోకి 28800 క్యూసెక్కు ల ఇన్ఫ్లో ఉండగా, నాలుగు గేట్లు ఎత్తి 28800 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. మరిన్ని గేట్లు తెరిచే అవకాశమున్నదని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. అత్యవసర సేవల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ నంబర్ 18005991200 ఏర్పాటు చేశారు.