పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలను నెరవేర్చే మహత్తర ‘గృహలక్ష్మి’ పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టు కోవాలనుకునే వారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,14,780 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. దాదాపు 80 శాతం పూర్తి కాగా.. ఈనెల 25తో ముగియనుంది. ఆ వెంటనే లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందనుంది. ప్రతి నియోజకవర్గానికి తొలి విడుతలో మూడు వేల ఇండ్లు ఇవ్వనుండగా..
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు 30 వేల మందికి సాయం అందనుంది. రూ.3 లక్షలు ఒకేసారి ఇవ్వకుండా విడుతలవారీగా ఇస్తారు. ఒక్కో దశలో నిబంధనల మేరకు ఇంటి పనులు పూర్తి చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇతర పథకాల్లో లబ్ధిపొందిన వారు కాకుండా మిగిలిన వారికి ప్రాధాన్యం ఇస్తూ ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. పేదలు ఎలాంటి మధ్య వర్తులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారం అర్హులకు తప్పకుండా ఇంటి నిర్మాణ సాయం అందుతుందని స్పష్టం చేశారు.
– మంచిర్యాల, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి)