నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగుకు సంబంధించి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఏ గ్రామంలో ఏ పంట సాగు చేయనున్నారనేది నివేదిక తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల
ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనుండగా, అత్యధికంగా సుమారు లక్ష ఎకరాల్లో వరి వేయనున్నారు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు వరినార్లు పోయగా, వేలాది ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
– నిర్మల్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
నిర్మల్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారంతో ఈసాగు ప్రణాళికను రూపొందించారు. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అధికారులు తయారు చే సిన ప్రణాళిక ఆధారంగా నిర్మల్ జిల్లాలో ఈ యా సంగిలో 2. 70 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నారని అంచనాలు రూ పొందించారు. ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సైతం అందుబాటు లో ఉంచేందుకు అవసరమైన ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు.
వచ్చే యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా లక్ష ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా వరి తర్వాత అధికంగా 85 వేల ఎకరాల్లో మక్క, 60 వేల ఎకరాల్లో శనగ పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా చోట్ల ఇప్పటికే ఈ పంటలను వేశారు. మరో 25 వేల ఎకరాల్లో నువ్వు,, పొద్దు తిరుగుడు, ఎర్ర జొన్న, గోధుమ, వేరుశనగ తదితర పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి యాసంగి సాగు ప్రణాళికను రూపొందించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో సాగు చేయనున్న పంటల వివరాలతో ప్రణాళిక రూపొందించిన అధికారులు… విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు అవసరమవుతాయో అంచనాలు తయారు చేశారు. అన్నిరకాల పంటలకు కలిపి 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 12 వేల నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 18 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. కాగా వీటిలో ఇప్పటికే 15వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందబాటులో ఉన్నాయి. అలాగే 4 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ 6,500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
ఏ పంటకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయనేది ముందుగానే ప్రణాళిక రూపొందించిన వ్యవసాయ అధికారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలు పోను మిగతా ఎరువులు, విత్తనాలను తెప్పించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. రైతులు పంటలు వేసిన తర్వాత ఏ నెలలో ఎంత మొత్తంలో ఎరువులు అవసరమవుతాయో ఆయా నెలల వారీగా ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడనున్నారు. ఎరువులు, విత్తనాల కొరత రాకుండా అవకాశమున్న చోట ముందుగానే బఫర్ స్టాకులను కూడా ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలోని రైతులు ఈ యాసంగి సీజన్లో వరిపంట సాగును తగ్గించుకొని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలి. ఆరుతడి పంటల్లో ప్రధానంగా నూనె గింజల పంటలైన పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు, వేరుశనగ తదితర పంటలను అధికమొత్తంలో వేయాలి. అలాగే ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం ఎక్కువగా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నది. దీనిని రైతులు సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్