మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
ఆదిలాబాద్లోని రిమ్స్, జిల్లా జైలు సందర్శన
ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా
ఎదులాపురం,జూలై17 : మానవ హక్కులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. మానవ హక్కుల కమిషన్ బృందం శనివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో చైర్మన్తో పాటు కమిషన్ సభ్యుడు ఆనందరావు, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర మొక్కలు నాటి నీరుపోశారు. రిమ్స్ను సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతో సమావేశమై మాట్లాడారు. మానవ హక్కులు ఏ విధంగా అమలవుతున్నా యో తెలుసుకునేందుకు జిల్లా పర్యటన చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, స్థితిగతులు, అవసరాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాలు అభివృద్ధి చెందాలన్నారు. వైద్యులు దైవంతో సమానమన్నారు. వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలు విధినిర్వహణకు అడ్డురాకూడదన్నారు. 40 శాతం అర్జీలను కలెక్టర్ పరిష్కరిస్తున్నట్లు కమిషన్ సభ్యుడు ఆనంద్రావు తెలిపారు. మానవ హక్కులకు ఎలాంటి భంగం కలుగకుండా పని చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు నటరాజ్, ఎం డేవిడ్, రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఆర్డీవో జాడే రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వైద్యులు తొడసం చందు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. వారితో మొక్కలు నాటించారు.
చైర్మన్కు వినతి
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్నాయక్, జిల్లా కార్యదర్శి ప్రవీన్కుమార్, నసీరొద్దీన్, గోపాల్, గితీశ్ తదితరులు పాల్గొన్నారు.