ఇంద్రవెల్లి/ఉట్నూర్ రూరల్/సోన్/దస్తురాబాద్, మే 7 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్, దస్నాపూర్ గూడ, కోయల్ పాండ్రి, అనంతపూర్, గౌరాపూర్, దోబిగూడ, మోహన్గూడ, ధర్మసాగర్, మల్కుగూడ గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. ఈదురుగాలులతో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జొన్నతోపాటు కూరగాయలు, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. ఉట్నూర్ మండలంలో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అక్కడక్కడ రాళ్లు పడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలు ఉపశమనం పొందారు. సోన్ మండలంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు గంటపాటు బలమైన గాలులు వీచాయి. రైతన్న వర్షం నుంచి తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లను కప్పారు. మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దస్తురాబాద్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.