పెట్టుబడి సాయం చూసి మురిసిపోతున్న అన్నదాతలు
కరోనా కాలంలోనూ డబ్బులు ఇవ్వడంపై ఆనందం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
ఆదిలాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసలు సిసలు ‘రైతుబంధు’వు సీఎం కేసీఆర్.. రైతన్నకు ఏంకావాల్నో అదే చేస్తున్నడు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి పుష్కలమైన నీరు నిల్వ ఉండేట్టు చేశాడు. రైతన్నలు ప్రమాదాలు, ఇబ్బందులు పడొద్దని నిరంతర ఉచిత కరంటు ఇస్తున్నడు. సబ్సిడీపై వాహనాలు అందిస్తున్నడు. ఇంకా.. నాటి బాధలు చూసి పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దని రైతుబంధు అందిస్తున్నడు. యేడాదికి రెండు విడుతలుగా అందిస్తూ రైతుబాంధవుడిగా మారాడు. ఇప్పటికే ఆరు విడుతలుగా డబ్బులు రైతులకు అందించి రైతు పక్షపాతిగా నిలిచాడు. ఏడో విడుత రైతుబంధు డబ్బులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కరోనా కష్టకాలంలోనూ డబ్బులు ఇవ్వడంపై కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా రైతుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. యేటా వానకాలం ప్రారంభమైందంటే సాగు పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి జిల్లాలో పేద రైతు లు అధిక సంఖ్యలో ఉండడంతో పెట్టుబడి డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులు, దళారులు, బ్యాంకు చుట్టూ తిరుగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు రుణాల పంపిణీలో తీవ్రజాప్యం చేసేవారు. వివిధ పంటలు వేసే రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పద్ధతి పాటించకుండా తక్కువ రుణాలు ఇచ్చేవారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనా విత్తనాలు, ఎరువులకు డబ్బులు లేక బ్యాంకు అధికారులు చుట్టూ తిరుగాల్సి వచ్చేది. పట్టా పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు తేవాలంటూ బ్యాంకు అధికారులు సూచించేవారు. బ్యాంకు రుణాలు లభించక పోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. వ్యాపారులు బంగారం, పట్టాపాసు పుస్తకాలు, ఇతర వస్తువులు తనాఖా పెట్టుకొని రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవారు. రోజులు గడుస్తున్నా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయని రైతులు చివరకు దళారులను ఆశ్రయించేవారు. దళారులు నకిలీ విత్తనాలు, ఎరువులను రైతులకు అంటగట్టి దిగుబడి రాగానే తమకు మాత్రమే పంటలు విక్రయించాలని షరతు విధించేవారు. విత్తనాలు, ఎరువులకు అసలు, వడ్డీ జమ కట్టి పంట విక్రయించగా వచ్చిన డబ్బులు దళారులే తీసుకునే వారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది.
రైతుబంధుతో తొలగిన కష్టాలు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతుబంధు పథకం ద్వారా అన్నదాతలకు రెండు సీజన్లకు ఎకరాకు రూ.10 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది. యేటా వానకాలం ప్రారంభంలో ఎకరాకు రూ.5 వేలు, యాసంగిలో రూ.5 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న ది. సమైక్య రాష్ట్రంలో సాగు కోసం ఇబ్బందులు పడే రైతులు ప్రస్తుతం సీజన్రాగానే సంతోషంగా సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో 5,73,352 మంది రైతు లు ప్రభుత్వం రూ.858.88 కోట్లను పంపిణీ చేస్తున్నది. మంగళవారం నుంచి రైతులు బ్యాంకు ఖాతా ల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమవుతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే సర్కారు అందిస్తున్న సాయం చేతికి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుని తమకు నచ్చిన దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. యేటా రెండు సీజన్లలో సాగుకు తమకు సాయం చేస్తున్న తెలంగాణ సర్కారును ఎప్పటికీ మరువ లేమని రైతులు పేర్కొంటున్నారు.
డబ్బులు పడ్డట్లు మెస్సేజ్ వచ్చింది
లక్షెట్టిపేట రూరల్, జూన్ 15 : రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇది సీఎం కేసీఆర్ సార్కు తెలుసు. అందుకే అన్నితీర్ల ఆదుకుంటున్నడు. ఒకప్పుడు వ్యవసాయం చేసేందుకు మస్తు ఇబ్బంది పడేటోళ్లం. సరైన సమయానికి విత్తనాలు, ఎరువులు దొరికేవి కావు. ఎట్లనో అట్ల పంట వేసినా కరంట్ లేక పొలాలన్నీ ఎండిపోయేవి. నీళ్లు కూడా సరిగా ఉండేటివి కావు. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయిన తర్వాత మా బతుకులు మార్చేసిండు. ఇగ ఇంత గొప్ప మనసున్న సీఎం ఎవ్వరుంటారు. నాకు మా ఊరిలో 30 గుంటల భూమి ఉంది. మంగళవారం రైతు బంధు డబ్బులు పడ్డట్లు సెల్కు మెస్సేజ్ వచ్చింది.
అప్పుల తిప్పలు తప్పినయ్
కోటపల్లి, జూన్ 15 : ఇది వరకైతే వర్షాలు పడుతుంటే పెట్టుబడి కోసం వ్యాపారుల చుట్టూ తిరిగేటోళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అయిన తర్వాత మాకు ఆ తిప్పలు తప్పినయ్. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రంది లేకుంట పంట తీస్తున్నం. నాకు 20 గుంటల పొలం ఉంది. యేటా రెండు సార్లు రూ.5 వేలు ఇస్తున్నరు. మంగళవారం నాడు బ్యాంకుల డబ్బులు జమ చేస్తే డ్రా చేసిన. అప్పుల జోలికి పోకుండా మంచిగ సాగు చేసుకుంటున్న. ఇదంతా టీఆర్ఎస్ సర్కారోళ్ల పుణ్యమే.
-దుర్గం నానయ్య, మల్లంపేట
ఎవుసాన్ని పండుగలా మార్చిన గొప్పోడు కేసీఆర్
దండేపల్లి, జూన్15 : మాది దండేపల్లి మండల కేంద్రం. వ్యవసాయాన్ని నమ్ముకొని మా కుటుంబం బతుకుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నడూ రైతుల కోసం ఆలోచించింది లేదు. అప్పుడైతే విత్తనాలు, ఎరువుల కోసం దుకాణాల వద్ద లైన్లు కట్టేటోళ్లం. టీఆర్ఎస్ సర్కారు వచ్చినంక పరిస్థితులు మారిపోయినయ్. సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేస్తున్నడు. ఎవుసానికి ఉచితంగా 24 గంటల కరంటు ఇస్తున్నడు. సమయానికి ఎరువులు అందిస్తున్నడు. రైతుబందు పేరిట ఎకరానికి రూ.5 వేలు పెట్టుబడి ఇస్తున్నడు. నాకు ఎకరం పొలం ఉంది. ఈ రోజు డబ్బులు తీసుకున్న. పంట పెట్టుబడికి సాయం జేస్తరని కలలో కూడా అనుకోలేదు. ఎనుకట పంట పెట్టుబడికి పాసుపుస్తకం కుదువపెట్టి బ్యాంకులో లోను తీసుకునేవాళ్లం. పండిన పంట అమ్మినంక లోన్ కట్టేవాళ్లం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎరువులు, విత్తనాలు కొనేందుకు తిప్పలు తప్పినయ్. నాడు నారుమడి దున్నినప్పటి నుంచి విత్తనాలు, కలుపులు, పురుగుల మందులు, ఎరువుల కొరకు అప్పులు చేసిన రోజులు ఇంకా మరిచిపోలేదు. తెలంగాణ సర్కారు ఇచ్చిన భరోసాతో మాలాంటి సన్న, చిన్నకారు రైతులు గతంలోకంటే ఎక్కువ సాగు చేస్తున్నారు. ఎవుసాన్ని పండుగలా మార్చిన గొప్పోడు సీఎం కేసీఆర్.
-బొమ్మెన లావణ్య, మహిళా రైతు,(దండేపల్లి)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం
దండేపల్లి, జూన్15 : 25 ఏండ్లుగా ఎవుసం చేస్తున్నా. ఎకరం ఉంది. దాని మీదనే మా బతుకు. కేసీఆ ర్ సర్కారు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడికి ఎకరానికి రూ.5 వేలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. విత్తనాలు, ఎరువులు కొనేం దుకు తిప్పలు తప్పినయ్. మాలాం టి రైతులు పెట్టుబడి కోసం పంట ప్రారం భానికి ముందు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేటోళ్లు. పంటకోసం అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతులను చూసినం. తెలంగాణ సర్కారు వచ్చినంక ఆ బాధ తప్పింది. నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఈ పథకంతో రైతు రాజుగా బతికే రోజులు వచ్చినయ్. రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ సారుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.
అడుగకుండానే సాయం
లక్షెట్టిపేట రూరల్, జూన్ 15 : ఇదివరకు వానలు పడ్డయంటే పంట పెట్టుబడి కోసం వడ్డీలోళ్ల దగ్గరికి పోయే టోళ్లు. ఇప్పుడా బాధ లేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత వ్యవసాయం మంచిగైంది. ఉచితంగా కరంట్ ఇస్తున్నరు. ఎరువులు, విత్తనాలు సమయానికి సరఫరా చేస్తున్నరు. ఇవన్నీ పోంగనే మళ్లీ పంటల సాగుకు పెట్టుబడి సాయం చేస్తున్నరు. నాకు మా ఊరిలో ఎకరం భూమి ఉంది. మంగళవారం నా బ్యాంకు ఖాతాలో రూ. 5 వేలు పడ్డయి. అందుకే ఇక్కడికి వచ్చిన. డబ్బులు తీసుకొని పోతున్న. అడుగకుండానే సాయం చేస్తున్న ముఖ్యమంత్రి సార్కు రుణపడి ఉంటం.
– గూడ రాధ, కొత్తూరు
కేసీఆర్ సీఎంగా ఉండడం మన అదృష్టం
కోటపల్లి, జూన్ 15 : రైతులు బాధపడవద్దని సీఎం కేసీఆర్ సార్ రైతు బంధు పథకం తీసుకొ చ్చిండు. ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నరు. దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులున్నా ఇసొంటి ఆలోచన ఎవ్వరి కీ రాలేదు. మనకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా అదృష్టమే. నాకు ఎకరం భూమి ఉంది. మంగళవారం నా ఖాతాలో రూ.5 వేలు జమ చేసిన్రని బ్యాంకు సార్లు చెప్పిన్రు. అందుకే డ్రా చేసుకున్న. ఈ డబ్బులతో విత్తనాలు కొంట. నాటు వేసేందుకు, ఎరువులు కొనేందుకు వాడుకుంట.
విత్తనాలు కొన్నా..
నా పేరు షేక్ అప్రోజ్. మాది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామం. నాకు 36 గుంటల భూమి ఉంది. వానకాలం పంటగా పత్తి వేయాలనుకుంటున్నా. దుక్కిదున్ని సిద్ధం చేసుకున్నా. రైతుబంధు డబ్బులు వేస్తామని పక్షం రోజుల క్రితం సీఎం సార్ చేసిన ప్రకటన చూశా. మంగళవారం ఉదయం 11.03 గంటలకు నా ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ అయినట్టు సెల్ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. ఏటీఎంకు వెళ్లి రూ.4,500 డబ్బులు తీసుకున్నా. అటునుంచే విత్తన దుకాణానికి వెళ్లి పత్తి విత్తనాలు కొన్నా. ఈ యేడాది సీఎం సార్ రైతులను సల్లగ చూస్తున్నట్లుగానే.. వానదేవుడు కూడా ముందుగానే వర్షాలు కురిపిస్తున్నడు. కూలీలను మాట్లాడుకొని బుధవారం విత్తనాలు వేస్తా.