రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రూ.200 కమిషన్ను రూ.900లు చేయడం, ఇప్పుడు మళ్లీ రూ.1,400లకు పెంచడంతో ఖుషీ ఖుషీ అవుతున్నారు. ఏకంగా 700 శాతం(7 రెట్లు) కమీషన్ పెంచిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణగా నిలుస్తోందని, వీటికితోడు 13 రకాల డిమాండ్లను పరిష్కరించడం శుభపరిణామమ ని డీలర్లు పేర్కొంటున్నారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,492 మందికి ప్రయోజనం చేకూరనుంది. మంచిర్యాలలో 423, నిర్మల్లో 412, ఆదిలాబాద్లో 356, ఆసిఫాబాద్లో 301 మంది రేషన్ డీలర్లు లబ్ధిపొందనున్నారు. దాదాపు 10-15 మంది వరకు డీలర్షిప్ రానుంది. పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
– మంచిర్యాల, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కమీషన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలనలో టన్నుకు రూ.200 ఉండగా.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రూ.900లు చేశారని, ఇప్పుడు మరోసారి రూ.1400 లకు పెంచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక రెండు విడుతల్లో 700 శాతం కమీషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, డీలర్ల కష్టాలను గుర్తించి సంక్షేమంలో తగిన ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కమీషన్ పెంచడంతోపాటు కరోనా సమయంలో మరణించిన డీలర్ల వారసులకు డీలర్షిప్ ఇవ్వడం, రూ.5 లక్షల బీమా అమలు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయడం, రెన్యువల్ కాలపరిమితిని ఐదేండ్లకు పెంచడం, రేషన్ డీలర్ వయో పరిమితిని 40 నుంచి 50 ఏండ్లకు పెంచడం, చనిపోయిన డీలర్ల అంత్యక్రియలకు రూ.10 వేల తక్షణసాయం, హైదరాబాద్లో రేషన్ భవన నిర్మాణానికి భూమి కేటాయించడం ఇలా దాదాపు 13 సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1,492 మంది రేషన్ డీలర్లకు ప్రయోజనం కలుగనుంది. మంచిర్యాలలో 423, నిర్మల్లో 412, ఆదిలాబాద్లో 356, ఆసిఫాబాద్లో 301 మంది రేషన్ డీలర్లు లబ్ధిపొందనున్నారు. కరోనా సమయంలో మృతి చెందిన వారి వారసులకు దాదాపు 10 నుంచి 15 మంది వరకు డీలర్షిప్ రానుందని ఆ డీలర్ల సంఘం నాయకులు తెలిపారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సంబురాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, మిగిలిన మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లోనూ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లు ‘నమస్తే’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 9 : తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లకు తీపి కబురు అందించింది. మాకు ఎలాంటి గౌరవ వేతనం లేదు. క్వింటాలు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తే రూ. 70 కమీషన్ ఇచ్చేవారు. మాకు ఈ కమీషన్ ఏ మాత్రం సరిపోకపోవడంతో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుపోయాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏకంగా క్వింటాలుకు రూ. 140 చెల్లించేందుకు ఒప్పుకోవడం హర్షనీయం. కొంత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే రేషన్ డీలర్ల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు, బీమా కల్పించడం చాలా బాగుంది.
– ఎండీ గౌసొద్దీన్, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు, మంచిర్యాల
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు దారి చూపినట్లే మా కష్టానికి కూడా తగిన ప్రతిఫలం ఇచ్చారు. టన్నుకు రూ. 700 ఇవ్వడం వల్ల ఇంటి అద్దె, హమాలీ చార్జీలు, నెట్, కరెంటు బిల్లులకు సరిపోక ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం కమీషన్ను ఒకేసారి టన్నుకు రూ. 1400 పెంచడం గొప్ప విషయం. అలాగే రూ.5 లక్షల బీమా కల్పించి.. హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి డీలర్షిప్ ఇస్తామని కూడా చెప్పారు. మా సమస్యలు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– సల్లం రవి కుమార్, రేషన్ డీలర్ తీగల్పహాడ్, నస్పూర్
చింతలమానేపల్లి, ఆగస్టు 9 : సెక్రేటరియేట్లో రేషన్ డీలర్ల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు సఫలం కావడం సంతోషంగా ఉంది. రేషన్ డీలర్ల కమీషన్ క్వింటాలుకు రూ. 70 నుంచి రూ. 140 పెంచడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నే మా డీలర్లకు మేలు జరుగుతుంది. డీలర్ చనిపోతే అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున రూ. 10 వేలు. రూ. 5 లక్షల బీమా కూడా ప్రకటించారు. రాష్ట్రంలోని డీలర్ల కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాయి.
– భీంకరి నారాయణ, డీలర్ల మండల అధ్యక్షుడు
చింతలమానేపల్లి, ఆగస్టు 9 : గతం లో ఏ ప్రభుత్వం కూడా రేషన్ డీలర్లని గుర్తించలేదు. స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్ చొరవతోనే బుధవారం రాష్ట్ర డీలర్ల సం ఘం నాయకుల చర్చలు సఫలం అయ్యాయి. సీఎం కేసీ ఆర్ కృషి వల్ల మాకు న్యాయం జరిగింది. రూ. 5 లక్షల బీమా, ఆథరైజేషన్ రెన్యూవల్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పెంపు, ప్రతీ ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గరే వే బ్రిడ్జిల ఏర్పాటు, రూ. 5 లక్షల విలువైన హెల్త్ కార్డు. కమీషన్ క్వింటాలుకు రూ. 70 నుంచి రూ. 140 పెంచడంవంటివి చేశారు. ఇందుకు చాలా ఆనందంగా ఉంది.
– కవ్వాల సాగర్, రేషన్ డీలర్, రుద్రాపూర్
ఖానాపూర్ రూరల్, ఆగస్టు 9 : నాపేరు కాలేరి సుమలత. ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోగల నం.36 రేషన్ దుకాణం డీలర్ను. రేషన్ డీలర్ల కమీషన్ పెంచడంతో పాటు సమస్యలను సైతం పరిష్కరించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. డీలర్లు అనుకున్నంత కమీషన్ను పెంచి ఆదుకున్న ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కమీషన్ టన్నుకు రూ.200ల కంటే తక్కువగా ఉండేది. రాష్ట్రం వచ్చాక రూ.200 నుంచి రూ. 900 వరకు పెంచారు. ఇప్పుడు దీనిని 7 రెట్లు పెంచి రూ.1400 వరకు ఇవ్వడంపై డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా డీలర్లును ఆదుకున్నది ఒక తెలంగాణ ప్రభుత్వమే.
తాంసి, ఆగస్టు 9 : రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ను దాదాపు డబుల్ చేశారు. దేశ వ్యాప్తంగా ఒకే రేషన్ ఒకే విధానంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమకు కమీషన్ పెంచాలని సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నాం. సీఎం కేసీఆర్తో పాటు మంత్రి గంగుల కమలాకర్తో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. సర్కారు నిర్ణయంతో మాకు మేలు జరిగింది.
– సూరం భూమన్న, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు
తాంసి, ఆగస్టు 9 : రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని గత ప్రభుత్వా లకు విజ్ఞప్తి చేశాం. బీఆర్ఎస్ సర్కారుతో మా కల నెరవేరింది. కమీషన్ పెంచడంతో పాటు అనేక సమస్యలు కూడా పరిష్కరించారు. మా కుటుంబాలకు భరోసా వచ్చింది. అనారోగ్యం బారిన పడితే సర్కారే వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– టీ.రుద్రాదేవి, రేషన్ డీలర్, పొన్నారి.
ముథోల్, ఆగస్టు 9 : తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్ల కమీషన్ పెంచడంతోపాటు అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. గొప్ప నిర్ణయం తీసుకున్న సర్కారుకు రుణపడి ఉంటం. గత ప్రభుత్వాలు డీలర్ల సమస్యలను పట్టించుకున్నది లేదు. అనేక సార్లు మా సమస్యలను దృష్టికి తీసుకు పోయాం. చేద్దాం.. చూద్దాం అంటూ కాలయాపన చేశారు. కానీ బీఆర్ఎస్ సర్కారు మా ఇబ్బందులను గుర్తించి న్యాయం చేసింది. సంతోషంగా ఉంది.
– శంకర్, రేషన్ డీలర్, ముథోల్