మండుతున్న ఇంధన ధరలు
కరోనా వేళ సామాన్యులపై భారం
నిత్యావసర సరుకులపై ప్రభావం
పెరిగిన వాహనాల కిరాయి
గతేడాదితో పోలిస్తే లీటరుపై రూ.36 పెరుగుదల
కేంద్ర సర్కారు తీరుపై జనాగ్రహం
ధరలు తగ్గించాలని వేడుకోలు
ఆదిలాబాద్, జూన్ 8 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు.. ధరలు పెరుగుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలను బయటకు తీయాలంటే జంకుతున్నారు. నెల రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం లీటరు పెట్రోలు ధర రూ.101.08 ఉండగా.. డీజిల్ ధర రూ.95.88 ఉంది. సామాన్యులపై పెనుభారం పడుతుండగా.. నిత్యావసర సరుకులతోపాటు కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. జనం కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
కరోనా కారణంగా ఏడాది నుంచి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సరిగా నడవడం లేదు. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వ తీరు ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు’ అన్న చందంగా మారిందని పలువురు మండిపడుతున్నారు. జిల్లాలో 1.65 లక్షల వాహనాలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో జాతీయ రహదారి 80 కిలోమీటర్లు ఉండగా, రోజు వందలాది వాహనదారులు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోసుకుంటారు. అయితే జిల్లాలో 15 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర సెంచరీ దాటగా, డీజిల్ ధర సైతం వందకు చేరువైంది. మంగళవారం పెట్రోల్ ధర రూ.101.08 ఉండగా, డీజిల్ రూ. 95.88 ఉంది. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు సైతం పెరుగుతున్నాయి.
ప్రజలపై మోయలేని భారం
పేదలు, సామాన్యులు మోటార్ సైకిళ్లు, మోపెడ్లను వినియోగిస్తున్నారు. చిరు ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు అవసరాల కోసం తమ వాహనాలను బయటకు తీయాలంటే భయపడుతున్నారు. గతంలో రూ.100 పెట్రోల్ పోసుకునే వారు ప్రస్తుతం రూ.50 పెట్రోల్ పోసుకుంటున్నారు. వైద్యం, ఇతర అత్యావసర పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు పెరిగిన డీజిల్ ధరలతో కార్లను అద్దెకు తీసుకోవాలంటే జంకుతున్నారు. కరోనా కారణంగా ఉపాధి లభించడం కష్టమైన తరుణంలో పెట్రోల్ ధరలపై కేంద్రం ప్రభుత్వం స్పందించకపోవడపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా గతేడాది ఈ సమయంలో పెట్రోల్ ధరలు బాగా తగ్గాయి. గతేడాది ధరలతో పోలిస్తే పెట్రోల్ ధర రూ. 36 వరకు పెరిగింది. కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్రం ప్రభుత్వం స్పందించి తమపై పెట్రో భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.