నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 24: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్వయం ఉపాధి యూనిట్లు, వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు విడుదలయ్యాయి. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తెలిపారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ. 10.04 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 35.28 కోట్లు విడుదల చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఈ రెండేళ్లకు గాను వివిధ పథకాల కోసం ఆన్లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వీకరించగా, మొత్తం 16958 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 8804, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4155, మంచిర్యాల జిల్లాలో 2072, నిర్మల్ జిల్లాలో 1927 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే నిరుద్యోగ యువతీయువకులతో పాటు రైతులకు పారిశ్రామిక వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గిరిజన కార్పొరేషన్ ద్వారా రుణాలను పొందేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో రూ. 50 వేలు, రూ. లక్ష, రూ. 2 లక్షలు, రూ. 4 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 9 లక్షలు, రూ. 10లక్షల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా స్వయం ఉపాధి కోసం నర్సరీల పెంపకం, టైలరింగ్, వస్త్ర దుకాణాలు, కిరాణా దుకాణాలు, క్రీడా సామగ్రి, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, కుటీర పరిశ్రమలు, మహిళలకు గ్రామాల్లోనే స్వయం ఉపాధి కల్పించే పథకాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా రైతులు వ్యవసాయ అనుబంధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎడ్లబండ్లు, పాడి గేదెలు, వ్యవసాయ పంపుసెట్లు, పండ్ల తోటల సాగు, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. త్వరలోనే ఎంపిక పూర్తి చేసి నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
ప్రారంభమైన గ్రామసభలు..
నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గిరిజన కార్పొరేషన్ ద్వారా రుణసాయం పొందేందుకు వివిధ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1705 గ్రామపంచాయతీల్లో స్థానిక ఎంపీడీవో నేతృత్వంలో మండలస్థాయి అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల ఆధారంగా ఇందులో అర్హులను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కులాల్లో ఇది వరకు ప్రభుత్వం ద్వారా సాయం పొందని వారిని గుర్తించి మొదటి ప్రాధాన్యత కింద ఎంపిక చేస్తున్నట్లు మండలస్థాయి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సుమారు 900 గ్రామపంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేసినట్లు మండలస్థాయి అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం రెండేళ్లకు కలిపి ఒకేసారి నిధులు విడుదల చేయడంతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైకార్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నా
దండేపల్లి, సెప్టెంబర్24 : నా పేరు కుడిమెత రవీందర్. మాది దండేపల్లి మండలం జైతుగూడ గిరిజన గ్రామం. కూలీ పనులు చేస్తుంటా. ట్రైకార్ పథకంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసుకున్నా. రూ.2 లక్షల రుణం కోసం అన్ని పత్రాలు అందించిన. రుణం మంజూరైతే కిరాణం పెట్టుకుంటా. నాతో పాటు మా గూడెంలో 30 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. రుణం అందితే గిరిజనులకు స్వయం ఉపాధితో పాటు, ఆర్థిక పరిస్థితులు మెరగుపడుతాయి. ఐటీడీఏ అధికారులు త్వరగా రుణాలు మంజూరు చేస్తే మేలు జరుగుతుంది.
గిరిజన బిడ్డలకు ఉపాధి అవకాశాలు..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. మొన్ననే దళితులందరికీ రూ. 10 లక్షల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు గిరిజనులకు కూడా స్వయం ఉపాధి యూనిట్ల కోసం నిధులను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండేళ్లుగా వివిధ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న గిరిజన యువతకు సంబంధించిన బడ్జెట్ను ఒకేసారి విడుదల చేసి, ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉంది. – భూక్యా అమర్సింగ్, తాటిగూడ, పెంబి మండలం
చాలా సంతోషంగా ఉంది..
ఈ ఏడాది మా పంట చేనులో బిందు సేద్యం కోసం రూ. 2లక్షల రుణం అందించాలని దరఖాస్తు చేసుకున్నా. మొన్ననే గ్రామసభ నిర్వహించారు. మా గ్రామంలో ఒకే ఒక దరఖాస్తు నాదే కావడంతో, వెంటనే ఎంపిక చేశారు. వారం రోజుల్లోగా బ్యాంకు ఖాతాలో రుణం వేస్తామని అధికారులు చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. ప్రభుత్వం ఇలా అండగా నిలిచినందుకు సంతోషంగా ఉంది.
-శేసాబాయి, వెంకూర్, కుంటాల మండలం
రూ. 2 లక్షల యూనిట్ మంజూరైంది..
2021లో గిరిజన కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా. మా గ్రామంలో టెంట్హౌస్ కోసం దరఖాస్తు చేసుకున్న. ఇటీవల గ్రామసభలు నిర్వహించి యూనిట్ మంజూరు చేశారు. రూ.2 లక్షల యూనిట్ మంజూరైంది. త్వరలోనే టెంట్హౌస్ను ప్రారంభిస్తా. నా కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.