లక్షెట్టిపేట పట్టణంలో రూ. 3.90 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తికాగా, వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కూరగాయలతో పాటు మటన్, ఫిష్ తదితర వ్యాపారాలన్నీ ఒకేచోట సాగేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఎండనకా.. వాననకా కవర్లు కప్పుకొని వ్యాపారం చేస్తూ అష్టకష్టాలు పడుతున్న వ్యాపారుల కల త్వరలోనే నెరవేరబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
లక్షెట్టిపేట, మే 14 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3.90 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నది. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో ఇక్కడ తహసీల్దార్ల నివాసానికి ఏర్పాటు చేసిన బంగ్లాతోపాటు పాత పోలీస్స్టేషన్ ఉండేది. అవి శిథిలావస్థకు చేరడంతో ఆ చోట మార్కెట్ నిర్మించేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పటి కలెక్టర్ భారతీ హోళికేరి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆమె స్పందించి సర్కారుకు నివేదిక పంపించారు. ప్రభుత్వం ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించాలని అధికారులను ఆదేశించింది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసింది. దీంతో బంగ్లాలను కూల్చివేసి ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. వ్యాపారుల ఇబ్బందులు చూడలేక టీఆర్ఎస్ నాయకులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి చొరవచూపితే.. ఓర్వలేని ప్రతిపక్ష నేతలు అడ్డుపడే ప్రయత్నం కూడా చేశారు. చివరకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, అప్పటి కలెక్టర్ భారతీ హోళీకేరి చేతుల మీదుగా పనులు ప్రారంభించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలతోపాటు మటన్, ఫిష్ దుకాణాలు కూడా ఉండనున్నాయి. అధికారులు, మున్సిపల్ సిబ్బంది పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక ఎండకు.. వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు మార్కెట్ ఎప్పుడు పూర్తవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
20 ఏండ్ల సంది రోడ్డు పక్కన కూరగాయలు పెట్టుకొని వ్యాపారం చేస్తున్న. ఎండకు, వానకు మస్తు తిప్పలైతంది. మా బాధలను చూసి కొత్త మార్కెట్ను కడుతున్రు. ఇన్నేండ్లకు మాకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. తొందరగా పనులు పూర్తి చేసి మాకు దుకాణం పెట్టుకునేటట్లు చేయాలి.
నా చిన్నతనం నుంచి ఇక్కడే పుట్టి పెరిగా. నా ఊహ తెలిసినప్పటి నుంచి వ్యాపారులంతా రోడ్డు పక్కనే కూరగాయలు అమ్మడం చూస్తున్న. ఎండ, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చైర్మన్ అయ్యాక మొట్టమొదలు మార్కెట్ నిర్మాణం చేయాలనుకున్న. ఎమ్మెల్యే దివాకర్రావు చొరవతో నిధులు మంజూరయ్యాయి. వెంటనే పనులు మొదలు పెట్టినం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అందుబాటులోకి తెస్తాం. – నలుమాసు కాంతయ్య, మున్సిపల్ చైర్మన్, లక్షెట్టిపేట
గతంలో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా పనిచేసిన. రోడ్డుపై వ్యాపారులు కష్టాలను చూసిన. అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే చిన్నపాటి షెడ్లు నిర్మించింది. అవి ఎటూ సరిపోక వ్యాపారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దివాకర్రావు, చైర్మన్ కాంతయ్య దృష్టికి తీసుకెళ్లాం. వారు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. ఇక వ్యాపారులకు మంచి రోజులు రాబోతున్నాయి. – పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్, లక్షెట్టిపేట