ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధ్యక్షురాలు సెవ్వలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నెలకోసారి నిర్వహించే సమావేశానికి అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదన్నారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు తమ ప్రగతిని వివరిస్తుండగా వైస్ఎంపీపీ రమేశ్ సీడీపీవో ఇప్పటి వరకు సమావేశాలకు ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నించారు. వచ్చే సమావేశంలో సీడీపీవో ఉండేలా చూడాలన్నారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో 325 డెలివరీలు, 393 చిన్నారులకు టీకాలు వేసినట్లు వైద్యారోగ్యాధికారి రోజారాణి తెలిపారు. పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్డోస్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
గ్రామాల వారీగా టీకాలు వేయాలని సభ్యులు కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శిబిరాలు నిర్వహిస్తామని డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం మండలంలో 26 రేషన్ దుకాణాలు ఉన్నాయని, ఎమ్మెల్యే జోగు రామన్న సూచనమేరకు మరో 13 అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఆర్ఐ తెలిపారు. హరితహారం కింద ఇప్పటి వరకు 75వేల మొక్కలు నాటినట్లు ఈజీఎస్ పీవో తెలిపారు. మరో 55వేల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశామని, వాటిని నాటి కాపాడేలా చూస్తున్నామని తెలిపారు. ఎంపీడీవో భూక్యా శివ్లాల్, ఎంపీవో ఆనంద్, మండల పశువైద్యాధికారి దూద్రాం రాథోడ్, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.