బేల, అక్టోబర్ 19 : రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా బేలలోని శ్రీ గణేశ్ గార్డెన్లో దారుల్-ఉలూమ్-అజీజియా ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముస్లింలకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగల వేళ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని చెప్పారు. జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్లోని బాధితులకు రిమ్స్ వైద్యశాలలో రక్తం అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ చారిటబుల్ ట్రస్ట్ల ద్వారా శిబిరాలు నిర్వహిస్తూ రక్తం సేకరిస్తున్నట్లు చెప్పారు. బేల మండలంలో 98.5 శాతం మందికి కొవిడ్ టీకాలు ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. ఆదర్శ మండలంగా ప్రకటించేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. మిగతా వారు కూడా వ్యాక్సినేషన్ తీసుకొని వందశాతం చేరుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో సేవలందించిన వారిని సన్మానించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు.
ముస్లిం యువత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. సమావేశంలో అందించిన మెమోరాండంపై సమస్యల పరిష్కారానికి శాసన సభ్యులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వంద శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కోరారు. అంతకుముందు వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు వారి సమస్యలపై మెమోరాండం అందజేశారు. శిబిరంలో దాదాపు 150 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, జడ్పీటీసీ అక్షిత పవర్, సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, వాడ్కర్ తేజ్రావు, మస్కేతేజ్రావు, దేవన్న, దారుల్-ఉలూమ్-అజీజియా మౌలానా అక్బరొద్దీన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మైనార్టీ నాయకులు ఖాలిక్ ఖురేషి, సమద్, సమీర్, షెహజాద్, షాహిద్, సిరాజ్, జమీల్ మౌలానా ఇర్షాన్, ఇంతియాజ్, మైనార్టీ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.