ఉద్యమమే ఊరిపిరిగా.. తెలంగాణవాసుల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా.. స్వరాష్ట్రమే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రూపాంతరం చెంది భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ఆవిర్భవించడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. గూడేలు, తండాలు, పల్లె, పట్టణాల్లో రెండు రోజులుగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ.. పటాకులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రవాసులు కూడా బాణాసంచా కాల్చి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రత్యేక సంచికను వెలువరించడంతో ఆసక్తిగా కథనాలు చదివారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపులు బీఆర్ఎస్గా మారాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామ పింఛన్దారులు 50 మంది రూ.1000 చొప్పున రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. కాగా.. బీఆర్ఎస్పై తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేలు ‘నమస్తే’తో పంచుకున్నారు.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయం లిఖించారని సంబురాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావడం, ప్రగతి పథంలో దూసుకెళ్తుండడం, ఇతర రాష్ర్టాల ప్రతినిధులు అధ్యయనం చేసి భేష్ అని మెచ్చుకోవడం, కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా మిషన్ భగీరథ, రైతుబంధు పథకాలను కాపీ కొట్టడం కలిసొస్తుందని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ పేరు మర్మోగుతుండడం పార్టీకి మంచిదని చెబుతున్నారు. దీనికి తోడు సరిహద్దున గల మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నట్లు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండడం, బీ(టీ)ఆర్ఎస్ తొలి కార్యక్రమం మహారాష్ట్రలో ఉంటుందని సీఎం చెప్పడం ఉమ్మడి జిల్లాల్లో పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర వాసులు వ్యాపారాలు, మెరుగైన వైద్యానికి జిల్లాలకు వస్తున్నారని, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులు అవుతున్నారని చెబుతున్నారు. బీ(టీ)ఆర్ఎస్తో ఇంకా చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని స్పష్టం చేస్తున్నారు. కాగా.. మహారాష్ట్రవాసులతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు మంచి సంబంధాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూరు కోనేరు కోనప్ప, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్లకు మహారాష్ట్రలో ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీలో మన నాయకులు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో మాట్లాడగా.. దేశాన్ని తెలంగాణ తరహాలో తయారు చేసేందుకు కేసీఆర్ చేస్తున్న క్రతువులో తాము భాగస్వాములం అవుతామని, ఆయన వెంటే ఉంటామని చెబుతున్నారు. బీ(టీ)ఆర్ఎస్ను విస్తరించేందుకు అధినేత మార్గదర్శకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్పై జోరుగా చర్చ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీపై జోరుగా చర్చించుకోవడం కనిపించింది. బుధవారం టీవీల్లో ఆసక్తిగా తిలకించిన జనం.. గురువారం నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రత్యేక సంచికను వెలువరించింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను కండ్లకు కట్టినట్టు ముద్రించడంతో వేకువజామునే పార్టీ విశేషాలను దినపత్రికలో చదివారు. పల్లె, పట్టణవాసులు ప్రత్యేక కథనాలను గమనించారు. హోటళ్లు, దుకాణాలు, ఇతర జనసమ్మర్థమైన ప్రాంతాల్లో చర్చించుకోవటం కనిపించింది. గూడేలు, తండాల్లో కూడా బీఆర్ఎస్ వార్తలను చదువుతూ.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఆదరణ లభిస్తుందని చర్చించుకోవడం కనిపించింది. టీఆర్ఎస్ పార్టీ కాస్తా బీఆర్ఎస్గా మారడంతో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల గ్రూపులన్నీ బీఆర్ఎస్గా మారాయి. కాగా.. పార్టీ ఏర్పడిన రోజు బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)కు చెందిన దళితబస్తీ లబ్ధిదారులు బీ(టీ)ఆర్ఎస్కు తమ సోయా పంటను అమ్మి రూ.66 వేల విరాళం ప్రకటించగా, గురువారం అదే గ్రామానికి చెందిన ఆసరా పింఛన్ లబ్ధిదారులు 50 మంది తలా రూ.1000 చొప్పున రూ.50 వేల విరాళాన్ని అందించారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లాలోని మరికొన్ని గ్రామాల ప్రజలు బీ(టీ)ఆర్ఎస్కు విరాళాలు ప్రకటించాడానికి సిద్ధమవుతున్నారు.
దేశ ప్రజలంతా సంతోషంగా ఉంటారు
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 6 : తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశమంతటా ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మేరకు చాలా రాష్ట్రాలనుంచి ముఖ్యమైన నాయకులు, ప్రజల నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతులు అందాయి. తెలంగాణరాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాల గురించి ఇతర రాష్ర్టాల ప్రతినిధులు వచ్చి స్టడీచేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మల్టీనేషన్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగాల కల్పన, సాగు, తాగునీటి రంగాలు, తదితర అంశాలు తెలంగాణలో అమలవుతున్న తీరు దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఇక కేంద్రంలోని బీజేపీ అన్ని రంగాల్లో విఫలం అవడంతో పాటు ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించాలని చూడడం, వ్యవసాయం రంగంలో కొత్త చట్టాలను తీసుకువచ్చి రైతులకు నష్టం చేకూర్చడం, పేద ప్రజలకు అందిస్తున్న ఉచితాలను తీసేయాలనుకోవడంలాంటి అంశాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే లక్ష్యంగా వ్యవహరించడం, ప్రభుత్వాలను కూల్చడం, అధికారులతో దాడులు చేయించడం వంటి అంశాలు బీజేపీపై ప్రజలకు వ్యతిరేకతను కల్గించాయి. ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి తీరుతుంది. – నడిపెల్లి దివాకర్రావు , ఎమ్మెల్యే, మంచిర్యాల
సీఎం కేసీఆర్ మీద దేశ ప్రజలకు నమ్మకముంది
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : విజయ దశమి నాడు తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఆసరా పథకం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, దళితబంధు, కేసీఆర్ కిట్, కేజీ టూ పీజీ ఉచిత విద్య, బీసీ, మైనారిటీ గురుకులాలు, మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. సీఎం కేసీఆర్ పాలన మీద దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశం మొత్తం కావాలని దేశ ప్రజలు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఆసక్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం. సీఎం కేసీఆర్ పట్టుదల ఉన్న వ్యక్తి. అనుకున్నది సాధించే వరకూ వెనక్కి తగ్గే మనిషి కాదు. దేశ రాజకీయాల్లో తను కోరుకున్న మార్పుని కచ్చితంగా తీసుకువస్తారు. – కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే, సిర్పూర్
ఇప్పటికే ఆలస్యమైంది..
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం ఎప్పుడో చెందాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది. అయినా కేసీఆర్ పార్టీని ప్రకటించడం దేశ ప్రజల అదృష్టం. దేశ ప్రజలు ఒక మంచి నాయకుడిని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమి లేదు. కేవలం మతపిచ్చి, మత ప్రకటనలు తప్పా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? తెలంగాణలోని గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాలు ఏ విధంగా డెవలప్ అయ్యాయి.. ఒక్కసారి బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఇతర రాష్ర్టాల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడితే వారు చాలా సమస్యలు చెప్పారు. చాలా రాష్ర్టాల్లో కనీసం తాగడానికి కూడా నీరు లేని దుస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి కోసం దేశమంతా ఎదురు చూస్తున్నది.
– అజ్మీరా రేఖానాయక్, ఎమ్మెల్యే, ఖానాపూర్
మంచి పరిణామం..
జాతీయస్థాయిలో సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ని ఏర్పాటు చేయడం మంచి పరిణామం. నూతనంగా రూపాంతరం చెందిన పార్టీని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో పార్టీని విస్తరింపజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారత దేశమంతటా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నరు. కేసీఆర్ ప్రధాని అయితే దేశమంతా బాగుపడుతది. రూపురేఖలు మార్చే సత్తా ఒక్క కేసీఆర్కే ఉంది. రైతులు, చిరు వ్యాపారులు, పేదల కష్టాలు దూరమవుతయ్. మతతత్వ బీజేపీ గద్దెదిగితే దేశానికి మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నరు..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజాదరణ పొందిన పాలసీలు దేశ ప్రజలకు చాలా అవసరం. ఇంత వరకు ఏ రాష్ట్రంలోని నాయకులు కూడా ఇలాంటి పథకాలను ఊహించలేదు. మన పథకాలను ఇతర రాష్ర్టాల పాలకులు కాపీ కొడుతున్నారు. దేశంలోని రైతులు, వెనకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, ప్రభుత్వ సాయం అందక పేదరికంలో మగ్గుతున్న వారందరు సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రాబోయే ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అత్యధిక సీట్లను గెలవాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నరు. త్వరలోనే మన జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తప్పకుండా కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధిస్తుంది. కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నరు.
– గడ్డిగారి విఠల్రెడ్డి, ఎమ్మెల్యే, ముథోల్
బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది
బీఆర్ఎస్ పార్టీ దేశంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. పోరాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో తప్పనిసరిగా సంచలనమైన మార్పులు తీసుకువస్తారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే రోల్మాడల్గా నిలిపాయి. దేశ ప్రజలందరూ తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నారు. ఇలాంటి పాలన తమకూ రావాలని కోరుకుంటున్నారు. ఇది కేవలం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని దేశ ప్రజలు నమ్ముతున్నారు. బీఆర్ఎస్ ద్వారా దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించి దేశ ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేరుస్తుందని దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ మారుతుంది.
– ఆత్రం సక్కు, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర
దేశ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కీలకపాత్ర పోషించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి ఇతర పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేస్తున్నాయి. బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. బీఆర్ఎస్ను పలు రాష్ర్టాల ప్రజలు ఆదరిస్తున్నారు. దేశంలో విజన్ ఉన్న గొప్ప నాయకుడు కేసీఆర్. ప్రధానిగా ప్రజలకు మంచి పాలన అందించగలరు.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్.