కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సర్కారు తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. జిల్లాలోని పది గ్రామాలకు ఒక సమ్మేళనాన్ని నిర్వహించి ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టడానికి కార్యచరణ రూపొందించింది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా నియోజకర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలని, ఈ సమావేశానికి 3 వేల నుంచి 5 వేల మంది పాల్గొనేలా చూడాలన్నారు. ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత మార్పుని, చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం. మరో 6-7 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు.
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది..
పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నాటికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ 14న హైద్రాబాద్లోని సచివాలయం ఎదుట అంబేద్కర్ జయంత్యుత్సవాలు జరుగుతాయని, జిల్లాలోని ప్రతి గ్రామంలో జయంతిని నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం, 30న సెక్రెటరేట్ ప్రారంభమవుతుందన్నారు. మే 1 మేడే ఉత్సవాలను కూడా నిర్వహించాలని సూచించారు. ఏమైనా మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త శాయశక్తులా కృషి చేయాలి. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, రైతు సమన్వయ అధ్యక్షులు, మున్సిపాలిటీ చైర్మన్ హుస్సేన్, పార్టీ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, సింగిల్ విండో చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యకార్యర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సక్సెస్ చేద్దాం..
ఆసిఫాబాద్ నియోజవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తాం. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లతోపాటు వార్డు సభ్యులతో కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేద్దాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘనమైన విజయాన్ని అందించేందుకు కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి సిద్ధం కావాలి. ఆసిఫాబాద్ నియోకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను ఘనంగా నిర్వహించి, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేద్దాం.
– ఆత్రం సక్కు, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్.
అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలి..
ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి. యువజన, మహిళా, సోషల్ మీడియా విభాగం ఇన్చార్జిలను నియమించాలి. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత బలం మరే ఇతర పార్టీకి లేదు.
– కనక యాదవ్రావు, చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ.
కార్యకర్తలే పార్టీకి ప్రాణం..
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణం. ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించాలి. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అడ్రస్ లేదు. మన బలం మందు ఆ పార్టీలు నిలువలేవు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఐకమత్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో పార్టీని భారీ మెజర్టీతో గెలిపించాలి. త్వరలోనే కాగజ్నగర్లో ఆత్మీయ సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం.
– కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే, సిర్పూర్.
బీజేపీ, కాంగ్రెస్ల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల వారు అభినంది స్తున్నారు. తమకు కూడా కేసీఆర్ వంటి నేత కావాలని కోరుకుంటున్నారు.
– అరిగెల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి,జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు
అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని శ్రేణులు తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు అసత్య ప్రచారాలపై ఎదురుదాడి చేయాలి. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలి. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి, సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలి. ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి బాధ్యత తీసుకొని పని చేయాలి.
– కోవ లక్ష్మి, జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్.