ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 15 : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని, తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల ద్వారా మెరుగైన విద్య అందించాలని అన్ని జిల్లా ల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ రాధా రెడ్డితో కలిసి జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్ల ల్లో విద్యా సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర వ్యా ప్తంగా ఒకటి నుంచి ఐదో తరగతి వారికి ‘తొలిమెట్టు’, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వారికి ‘ఉన్నతి’, పదో తరగతి వారికి ‘లక్ష్య’ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల్లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తద్వా రా పిల్లలు ప్రతీ సబ్జెక్టులో ప్రతిభ చూపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఈ నెల 12 నుంచి 2024 జనవరి 12వ తేదీ వరకు ‘అకాడమిక్ బబుల్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో ధారాళంగా చదవడం, రాయడం, వి షయాల వారి పూర్వ భావనల జ్ఞాన అభ్యాసన ఫలితాలను సాధించవచ్చని వివరించారు. పాఠశా ల విద్యాశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వా రా స్కూల్ వివరాలను తెలుసుకొని తనిఖీలు ని ర్వహించాలని కలెక్టర్లు, డీఈవోలకు సూచించా రు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు ‘తొలిమెట్టు’, ‘లక్ష్య’, ‘ఉన్నతి’ కార్యక్రమాల ద్వారా పిల్లలకు అత్యుత్తమమైన విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్త, జిల్లా విద్యాశాఖ అధికారి టీ ప్రణీత, అధికారులు పాల్గొన్నారు.