CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి కొరత సమస్య ఉన్న మాట నిజమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంగీకరించారు. అయితే ఈ పాపం పూర్తిగా గత ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఆదివారంతో వంద రోజులు పూర్తి కానున్నది. ఈ నేపథ్యంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్కుమార్ యాదవ్తో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రేవంత్రెడ్డి బదులిస్తూ రాష్ట్రంలో సాగునీటి కొరత సహా అనేక సమస్యలున్నాయని.. గత ప్రభుత్వం చేసిన పాపాలింకా కొనసాగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా వ్యవహరించిన కారణంగానే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. వందరోజుల పాలన సంపూర్ణమైన సంతృప్తినిచ్చిందని అన్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండమని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ వంద రోజుల పాలనను చూసి ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. తాము 11 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలు తేల్చాయని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ -2025ను రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని అన్నారు. తామెవరిపైనా కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడబోమని, అలాగని అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లపై జ్యుడీషియల్ విచారణ చేయిస్తున్నామని, ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని తెలిపారు. రాష్ట్రంలో మిగతా సీట్లకు అభ్యర్థులను 19న ప్రకటిస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఎన్నికల స్టంట్ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ఒకరోజు ముందు అరెస్టు చేయడం దేనికి సంకేతమో ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు.ముందు ఈడీ వస్తుం ది.. ఆ తర్వాత మోదీ వస్తారని ఇది వరకు అనుకునే వారిమని కానీ శుక్రవారం మోదీ, ఈడీ కలిసే రాష్ర్టానికి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ను దొంగదెబ్బ దెబ్బతీసేందుకే ఈ డ్రామాలని, ఈ డ్రామాలను కట్టిపెట్టి తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. కవిత అరెస్టు విషయంలో మోదీ, కేసీఆర్ల మౌనం వెనుక వ్యూహామేంటని సీఎం ప్రశ్నించారు.
మాజీ కేంద్రమంత్రి చిదంబరంతో సీఎం రేవంత్రెడ్డి శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం.
కా్రంగెస్లో ఉన్న వారిని వదిలి.. బీజేపీ నుంచి వచ్చి చేరిన జితేందర్రెడ్డికి రెండు పదవులివ్వడంపై అడిగిన ప్రశ్నకు రేవంత్రెడ్డి స్పందిస్తూ ‘అడ్వెంచర్లు చేస్తే పదవులిస్తాం. అవసరాలను బట్టి క్రమక్రమంగా పదవులిస్తాం’ అని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లపై మాట్లాడుతూ.. మన రాష్ర్టానికి చెందిన కొన్ని సంస్థలు తమ పేర్లు వెల్లడించకుండా మీడియాకు ప్రకటనలిచ్చాయని ఆరోపించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, కాంగ్రెస్ నేత రోహిన్రెడ్డి పాల్గొన్నారు.