‘రేలారే..రేలారే.. పల్లెమట్టి వాసనలే.. స్వచ్ఛమైన మనుషులే.. బంగారు భూమి జగములో.. నా తెలంగాణ’ అంటూ గొంతెత్తిన శ్రావణి ఇప్పుడు నెట్టింట సెలబ్రెటీ అయిపోయింది. ఆమె గాత్రానికి జనం ఫిదా అవుతున్నారు. శ్రావణి పాటకు పరవశించిన మంత్రి కేటీఆర్ ఆ విషయాన్ని ట్విటర్లో పోస్టు చేయడంతో హఠా త్తుగా ట్రెండింగ్లోకి వచ్చిందీ తెలంగాణ తేజం.
తెలంగాణ యువగాయని శ్రావణి నెట్టింట్లో సంచలనంగా మారింది. ఆమె పాడిన పాటను లక్షలాదిమంది నెటిజన్లు వీక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్నూ ఆ స్వరం సమ్మోహితుడిని చేసింది. కేటీఆర్ తనకు ట్యాగ్ చేసిన ఆ ట్వీట్పై స్పందిస్తూ సంగీత దర్శకుడు తమన్, శ్రావణి గాత్రాన్ని మెచ్చుకున్నారు.‘శ్రావణి నిజంగా ప్రతిభావంతురాలు. ఆమెలో అపారమైన టాలెంట్ ఉంది. కాబట్టే, ఇలా వెలుగులోకి వచ్చింది. నేను సంగీతం సమకూర్చే సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఆమెకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అన్నారు తమన్.
మెదక్ జిల్లాలోని నారంగి గ్రామానికి చెందిన శ్రావణికి సింగర్ కావాలని కోరిక. ఆ కలను నిజం చేయడానికి తండ్రి లక్ష్మణచారి తన కూతురికి సీకే రామాచారి శాస్త్రీయ సంగీత పాఠశాలలో శిక్షణ ఇప్పిస్తున్నారు. అలా ఐదో తరగతి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నది శ్రావణి. ‘మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం, దానికి సంగీత దర్శకులు తమన్, దేవిశ్రీ ప్రసాద్లు స్పందించడం నా జీవితంలో మరచిపోలేని అనుభవాలు’ అంటున్నది శ్రావణి.
ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది శ్రావణి. ఏదో ఒకరోజు సొంతంగా ఒక పాటను స్వరపరిచి, పాడాలన్నది తన లక్ష్యం. సింగర్ కావాలనే కోరిక ఉన్నా చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. ‘నా కూతురికి సంగీతమంటే ప్రాణం. ఇంట్లోనూ నిత్యం ఏదో ఒకటి పాడుతూనే ఉంటుంది. శ్రావణి అభిరుచికి తగ్గట్లుగానే తన భవిష్యత్ను తీర్చిదిద్దాలని భావిస్తున్నా’ అన్నారు ఆమె తండ్రి లక్ష్మణచారి.