మనసులో ఎంత బాధ ఉన్నా.. స్నేహితుల సమక్షంలో అది మంత్రమేసినట్టు మాయమైపోతుంది. జీవితంలోని అన్ని దశల్లో వెన్నంటి ఉండేది స్నేహమే. ఇటీవల కొందరు పరిశోధకులు ‘స్నేహ చికిత్స’ మీద అధ్యయనం చేశారు. దాని ప్రకారం, అమ్మాయిలు తోటి అమ్మాయిల స్నేహంతోనే ఒత్తిడికి దూరమవుతారట. అమెరికాలోని బెక్మన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. స్నేహితులతో తమ అనుబంధం గురించి చెప్పమని, వివిధ వయసులవారిని అడిగారు.
‘జీవితంలో
సమస్యలు ఎదురైనప్పుడు స్నేహితులు ఎలా ఆదుకొన్నారు? ఎంత మనోధైర్యాన్ని అందించారు?’ అన్నది అధ్యయనం ముఖ్యాంశం. “ఇప్పటి
వరకు నేను వివిధ అంశాలపై రకరకాల గ్రూపులతో పని చేశాను. అవన్నీ యుక్త వయసు స్నేహాలపైనే. ఈసారి పెద్ద వయసు మహిళలతో కూడా మాట్లాడాను” అని చెబుతున్నారు పరిశోధకుల్లో ఒకరైన రోడ్రిగ్స్. యుక్త వయసు అమ్మాయిలు ఎక్కువగా తమ ఈడు అమ్మాయిలతోనే స్నేహం చేస్తారని, వాళ్లతోనే సాధకబాధకాలు చెప్పుకొంటారని అధ్యయనంలో తెలిసింది. వివాహిత మహిళల విషయానికొస్తే.. తమ బాల్య స్నేహితురాళ్లతో మాట్లాడినప్పుడు, వారితో కలిసి భోజనం చేసినప్పుడు మనసులోని ఒత్తిడి దూరం అవుతున్నట్టు తెలిపారు. ఇలా ఏ వయసువాళ్లను చూసుకున్నా, స్నేహం మహిళల్లోని ఒత్తిడిని పోగొడుతుందన్నది సుస్పష్టం. కానీ, పురుషుల్లో ఈ స్థాయి ప్రభావం కనిపించకపోవడం కొసమెరుపు.