Swara barathi | ఎవరికీ ఎంబీఏ పట్టాలు లేవు. ఎవరూ మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకోలేదు. అందరూ గ్రామీణ మహిళలే. అయితేనేం, పట్టుదలే పెట్టుబడిగా రంగంలో దిగారు. తలా పది రూపాయలతో పొదుపు ప్రారంభించారు. కొన్నేండ్లు తిరిగేసరికి రూ.4 కోట్లు కూడబెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గ్రామంలోని ‘స్వరభారతి’ పొదుపు సంఘం.. జీవితాలను మార్చిన తీరు స్ఫూర్తిదాయకం.
గుండ్ల లక్ష్మి ఓ ఇరవై ఏండ్ల క్రితం సాధారణ గృహిణి. టీవీఎస్ బండిపై వెళ్లి రాత్రి బడులు చెప్పేది. సరిగ్గా ఆ సమయంలోనే ‘స్వరభారతి మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం’ ఏర్పాటైంది. అప్పటినుంచీ లక్ష్మి ఆ సంఘానికి మేనేజర్గా వ్యవహరిస్తున్నది. మహిళలను చైతన్యపరిచి ఐదు గ్రామాలలో 250 మంది సభ్యులతో సంఘాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సభ్యుల సంఖ్య 2,301. వీళ్లంతా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు ‘పిలుపు’ అనే సంస్థ తోడ్పాటు అందించింది. మొదట పొదుపుతోనే ప్రారంభమైన ఈ సంఘాలు క్రమంగా వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. సామాజిక కార్యక్రమాలను చేపట్టాయి. ఆ సంఘాలకు ఆదరణ పెరగడంతో మరికొందరు భాగస్వాములు అయ్యారు. శాఖోపశాఖలుగా విస్తరించిన స్వరభారతి నేడు 183 సంఘాలతో విజయ వంతంగా ముందుకు వెళ్తున్నది.
మొదట్లో రూ.10తో పొదుపు ప్రారంభించిన మహిళలు నెమ్మదిగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చారు. కొందరు రూ.500 వరకూ పొదుపు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సొమ్ము రూ.4 కోట్లకు చేరింది. అదే డబ్బుతో సంఘంలోని మహిళలకు రుణాలు ఇస్తున్నారు. సభ్యులు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. మార్కెట్తో పోలిస్తే వడ్డీ తక్కువే. మహిళలు పొదుపు చేసుకున్న నిధికి సైతం వడ్డీ ఇస్తారు. కుటుంబ సభ్యుల్లో ఎవరు మరణించినా తక్షణం ఆర్థికసాయం అందుతుంది. తమ నిధులతో తుర్కపల్లిలోని సంఘం ప్రధాన కార్యాలయ భవనాన్ని ఆధునికీకరించారు. ఈ స్థిరాస్తి విలువ రూ.కోటి పైమాటే. సభ్యులు కూడా సంఘం నుంచి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తీరుస్తున్నారు. రుస్తాపూర్ గ్రామానికి చెందిన వలందాసు లావణ్య సంఘం నుంచి పొందిన రూ.70 వేలతో జెరాక్స్ యంత్రాన్ని కొనుగోలు చేసింది. దత్తాయిపల్లికి చెందిన సురబోయిన నర్సమ్మ రూ.లక్ష అప్పుతో పాడి ఆవులు బేరం చేసింది. పాల వ్యాపారంతో ఆదాయాన్ని పెంచుకున్నది. ఇదే గ్రామానికి చెందిన గిద్దె ఆండాలు ఆటో యజమానిగా మారి తన కుమారునికి జీవనోపాధిని కల్పించింది. ఫొటో స్టూడియోలు, బార్బర్ షాపులు.. ప్రారంభించినవారు ఉన్నారు. ఆ పైసలతో పిల్లలను చదివించినవారు, పెండ్లిళ్లు చేసినవారు ఎంతోమంది.
వ్యాపార రంగంలోనూ స్వరభారతి రాణిస్తున్నది. సుస్థిర వ్యవసాయం దిశగా రైతులతో అడుగులు వేయిస్తున్నది. చిరుధాన్యాల సాగుపై మహిళా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటికే అనేక రైతు కుటుంబాలు చిరుధాన్యాలను పండించడం మొదలుపెట్టాయి. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున తలా రూ.3 వేల పెట్టుబడి సాయాన్ని కూడా అందించారు. రైతులు పండించిన కొర్ర, అండుకొర్రలు, సామలను సంఘం తరఫున కొనుగోలు చేయడంతోపాటు, స్వరభారతి ఆధ్వర్యంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్నూ ఏర్పాటు
చేశారు. విత్తనాలు, ఎరువులు, గానుగ నూనె తక్కువ ధరకే అందిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో వివిధ సంస్థల సహకారంతో ఆరొందల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి సేవా స్ఫూర్తిని చాటుకున్నది స్వరభారతి.
స్వరభారతిలో ఆర్థిక లావాదేవీలన్నీ కచ్చితంగా జరుగుతాయి. చార్టర్డ్ అకౌంటెంట్తో ఏటా ఆడిటింగ్ జరిపిస్తారు. తొమ్మిది మంది సభ్యులతో కూడిన బోర్డు ప్రతి నెలా సమావేశం అవుతుంది. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. స్వరభారతి విజయగాథ ఎల్లలు దాటడంతో.. జర్మనీలోని ఓ విశ్వవిద్యాలయ బృందం ఇక్కడి మహిళల సాధికారతపై అధ్యయనం చేసేందుకు సంకల్పించింది.
…? గంజి ప్రదీప్ కుమార్, ఫొటోలు : గుజ్జ నరేష్
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”