పరిస్థితులు మారుతున్నాయి. గ్లాస్ సీలింగ్ తొలగిపోతున్నది. సంతకాలకే పరిమితమైన స్థానం నుంచి, రబ్బరు స్టాంపు ముద్ర నుంచి మహిళ బయటపడుతున్నది. కార్పొరేట్ ఆఫీసుల్లో కీలక స్థానంలో కూర్చుంటున్నది.
భారతీయ కార్పొరేట్ కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మహిళల ప్రాతినిధ్యం బాగానే మెరుగుపడిందని ‘డైవర్సిటీ ఇన్ ద బోర్డ్ రూమ్: ప్రోగ్రెస్ అండ్ ద వే ఫార్వార్డ్’ అనే తాజా నివేదిక స్పష్టం చేసింది. భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల బోర్డులలో 2013లో 6 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం 2017 నాటికి 13 శాతానికి, ప్రస్తుతం 18 శాతానికి చేరుకుంది. నిఫ్టీ 500 కంపెనీలలో దాదాపు 95 శాతం బోర్డుల్లో కనీసం ఒక్క మహిళ అయినా కనిపిస్తారని ఈ నివేదిక వెల్లడించింది. అయితే కంపెనీల ఎగ్జిక్యూటివ్ బోర్డులతో పోలిస్తే, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లోనే మహిళల పాత్ర ఎక్కువ. అంటే ఉన్నత స్థానాల్లో మగువ మరింత కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
జీవశాస్త్ర రంగంలో 2017లో 16 శాతం ప్రాతినిధ్యం ఉండగా, 2022 నాటికి అది 24 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో మీడియా-వినోద రంగంలో 14 శాతం నుంచి 23 శాతానికి, రిటైల్ రంగంలో 14 శాతం నుంచి 20 శాతానికి, సాంకేతిక రంగంలో 15 శాతం నుంచి 20 శాతానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఇవన్నీ మార్పునకు సంకేతాలే. ఆశావాద చిహ్నాలే.