Millet Mantra | రాగి సంకటి, జొన్నరొట్టె, అంబలి, జొన్నముద్ద, సామలు, అరికెల జావ.. బువ్వ దొరకని రోజుల్లో తాత ముత్తాతలను బతికించింది బలవర్ధకమైన ‘సిరి’ధాన్యాల ఆహారమే. ఆధునిక జీవన విధానంలో పోషకాహారాన్ని దూరం చేసుకున్నాం. కంటికి ఇంపుగా కనిపించి.. ఒంటిని రోగాల కంపుగా మార్చే జంక్ఫుడ్ వైపు పరుగులు పెడుతున్నాం. ఆ యాంత్రిక జీవితం నుంచి మంచి వైపు మళ్లించేందుకే ‘మిల్లెట్ మంత్ర’ స్టార్టప్కు ప్రాణం పోశామని చెబుతున్నారు పూజితారెడ్డి, కీర్తి.
హైదరాబాద్ యువతులు పూజితారెడ్డి, కీర్తి డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరూ వ్యవసాయంలో బీఎస్సీ చేశారు. తర్వాత గుజరాత్ వెళ్లి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు. ఇద్దరికీ సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల గురించి అధ్యయనం చేశారు. చివరికి చిరుధాన్యాలపై గురిపెట్టారు. చిరుధాన్యాల సాగులో క్రిమిసంహారకాల అవసరం ఉండదు. చీడపీడల బాధ తక్కువ. ఎలాంటి భూమిలోనైనా పండించవచ్చు. నీటి అవసరం ఉండదు. ఇక పోషకాలు అపారం. ఫైబర్, ప్రొటీన్స్ సమృద్ధం. ఓ రకంగా ఇద్దరూ చిరుధాన్యాలతో ప్రేమలో పడ్డారు. అలా ‘మిల్లెట్ మంత్ర ( Millet Mantra )’ ప్రాణంపోసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎమ్ఆర్) నిర్వహించిన ఓ ప్రాజెక్టుకు ‘మిల్లెట్ మంత్ర’ ఎంపికైంది. శిక్షణ అనంతరం రూ. 5 లక్షల నిధులు అందడంతో తమ ఆలోచనలకు పూర్తి రూపం ఇచ్చారు పూజిత, కీర్తి.
ఐఐఎమ్ఆర్ అందించిన పెట్టుబడికి అదనంగా, కుటుంబం నుంచి కూడా కొంత సేకరించారు ఇద్దరూ. బెంగళూరులో ఆర్గానిక్ మిల్లెట్స్ పుష్కలంగా దొరుకుతాయి. దీంతో కర్ణాటక రాజధానినే తయారీ కేంద్రంగా ఎంచుకున్నారు. పోషకాల డైట్, డార్క్ చాక్లెట్, క్రంచీ నట్టీ, బెర్రీ బ్లాస్ట్.. పేర్లతో నాలుగు రకాల ఉత్పత్తులకు ఓ రూపం ఇచ్చారు. అయితే చిరుధాన్యాలను నేరుగా తినడం చాలామందికి ఇష్టం ఉండదు. పిజ్జా బర్గర్లను నమిలిన నోళ్లకు అవి చప్పచప్పగా అనిపిస్తాయి. దీంతో, న్యూట్రిషనిస్టుల పర్యవేక్షణలో రుచి కోసం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, కాన్బెర్రీ, బొప్పాయి, పైనాపిల్, ఆపిల్ తదితర పండ్లు.. డ్రైఫ్రూట్స్, బాదం, ఓట్స్ మొదలైన పోషకాహారం కలగలిపిన వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఏ దశలోనూ చక్కెర వాడలేదు. తీపి కోసం స్వచ్ఛమైన తాటిబెల్లాన్నే వినియోగించారు.
‘మిల్లెట్ మంత్ర’ స్టార్టప్ను మరింత విస్తరించాలన్నది పూజిత, కీర్తి ఆలోచన. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్స్లో, బాలాజీ గ్రాండ్ బజార్, క్యూమార్ట్ వంటి ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేసుకుంటూనే, milletmantra.co.in వెబ్సైట్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. రాగి చిప్స్, చిరుధాన్యాల బిస్కెట్లను ఐదు ఫ్లేవర్లలో తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోచనల్లో స్పష్టతతో పాటు, మార్కెటింగ్ బలంగా ఉంటేనే ఏ స్టార్టప్ అయినా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో వీహబ్ సహకారం తీసుకున్నారు. ‘వీహబ్ ఇన్క్యుబేషన్’ కార్యక్రమంలో పాల్గొని తమ వ్యాపార నైపుణ్యానికి మెరుగులు పెట్టుకున్నారు. ఆ శిక్షణ పూర్తయితే.. మరింత పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘మిల్లెట్ మంత్ర ఆలోచన దశ నుంచి నేటి వరకూ మేమిద్దరం పని విభజన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆన్లైన్ అమ్మకాలు, డిజైనింగ్, తయారీ బాధ్యతలు ఒకరు చూసుకుంటే.. మార్కెటింగ్, ఆఫీస్ వ్యవహారాలన్నీ ఇంకొకరు చూసుకుంటాం. ముగ్గురు బిడ్డలకు తల్లులమైన మేం.. ఒకవైపు ఇంటిని చూసుకుంటూనే కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటున్నాం’ అంటారు ఆ ఇద్దరూ. ‘వ్యాపారం అంటే పరోక్షంగా సామాజిక బాధ్యత కూడా. కాబట్టే, ప్రత్యేకించి మిల్లెట్స్ మీదే దృష్టిసారించాం’ అంటున్నప్పుడు వారి గొంతులో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం.
… డప్పు రవి, ఫొటోలు : గడసంతల శ్రీనివాస్
“Millet Bank | చిరు ధాన్యాలతో నూడిల్స్, కుకీస్.. ఈ ఇద్దరు గృహిణుల ఆలోచన అదుర్స్”
“మోదుగ ఆకుల్లో మిల్లెట్స్ ఇడ్లీ.. తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలండీ..!!”
“మిల్లెట్స్ను ఎవరైనా తినొచ్చా..? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి..?”
Health tips : ఈ సూపర్ ఫుడ్తో కొలెస్ట్రాల్కు చెక్!”