Mehtab Sohrab Banji | తనకు ఓ ఉద్యోగం కావాలంటూ ఆమె లేఖ రాసింది. అది చదివి ఇంటర్వ్యూకు రావాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ నుంచి సమాధానం వచ్చింది. ‘ప్రస్తుతం రాలేను’ అంటూ జవాబు ఇచ్చిందామె. ‘అయితే కుదిరినప్పుడు వచ్చి చేరండి’ అంటూ డైరెక్టర్ ముక్తాయించారు. ఆ అసాధారణ మహిళ పేరు.. మెహ్తాబ్ సోహ్రాబ్ బాంజీ. పార్సీ కుటుంబంలో పుట్టింది. గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకుంది. తెలంగాణ పల్లెల్లో పేద మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న ఆ తొమ్మిది పదుల నిత్య చైతన్యశీలితో మాట్లాడదాం..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో సైంటిస్ట్గా నా ఉద్యోగ జీవితం మొదలైంది. ఆ సమయంలో బి-కాంప్లెక్స్ విటమిన్ల గురించి పరిశోధన చేసేందుకు మారుమూల గ్రామాలకు వెళ్లేదాన్ని. అప్పుడే గ్రామీణ సమస్యల గురించి అవగాహన వచ్చింది. మన దేశం ఎంతో ఆర్థిక ప్రగతిని సాధించింది. అయినా ఆకలి సూచీలో మన ర్యాంక్ ఘోరంగా ఉంటుంది. గుజరాత్లో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి జరిగింది. కానీ దానివల్ల పేదరికం ఏమాత్రం తగ్గలేదు. అభివృద్ధి అంటే జీడీపీ పెరగడమేనా? కానేకాదు. దేశాన్ని మార్చే శక్తి నాకు లేదు. అందుకే, నా చుట్టూ ఉన్న పేదల ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. మా ఇంటికి దగ్గర్లో ఒక హాస్పిటల్ ఉంది. అందులో పనిచేసే ఓ డాక్టర్ పేదల కోసం నర్సాపూర్ (మెదక్ జిల్లా)లో చాలా సంవత్సరాల నుంచి దవాఖాన నడుపుతున్నది. డంగోరియా చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నది. ఈ వేదిక ద్వారానే నా ఆలోచనలు ఆచరణలో పెట్టాను. నర్సాపూర్ పరిసరాల్లోని గ్రామీణ మహిళలు, పిల్లల కోసం పనిచేయడం మొదలు పెట్టాను. ఆహార అలవాట్లను మార్చడం ద్వారా, ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా పోషకాహార సమస్యను నిర్మూలించవచ్చని భావించాను.
తరచూ బొప్పాయి తింటే విటమిన్-ఎ లోపమే ఉండదు. బొప్పాయి చెట్లను మన పెరట్లోనూ పెంచుకోవచ్చు. కానీ ‘బొప్పాయి వల్ల గర్భస్రావం అవుతుంది’ అనే అపోహ ఉంది. ఈ మూఢ నమ్మకాన్ని వైద్యులు సైతం మార్చలేకపోయారు. ఇదంతా తప్పని చెప్పి బొప్పాయి తినేలా ప్రోత్సహించాం. గుడ్లు ఎక్కువ పెట్టే కోళ్ల జాతులను పెంచేలా సహకరించాం. అలా, మందుల అవసరం లేకుండానే రక్తహీనతను దూరంచేశాం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇండ్లకు పెరడు ఉంటుంది. లేనివాళ్లు పొలంలో అయినా కూరగాయలు పండించుకోవచ్చు. పొట్లకాయ, సొరకాయలాంటివి కాకుండా.. ఎక్కువ పోషకాలున్న ఆకుకూరలు, చిక్కుడు వగైరా పండించడం అలవాటు చేశాం. మా శ్రమ వృథాగా పోలేదు. చాలా మార్పు వచ్చింది. త్వరలో మరో అయిదు కొత్త గ్రామాలకు వెళ్తున్నాం.
మూడు దశాబ్దాలలో చాలా మార్పులు చూశాను. పెండ్లి చేసుకోకపోవడమే నాకు కలిసొచ్చింది. నా సమయాన్ని సమాజానికి కేటాయించే అవకాశం లభించింది. నా వయసు తొంభై చేరువకు వచ్చింది. ఒక్కదాన్నే ఉంటున్నా. అయినా ఒంటరిదాన్ననే ఆలోచనే రాదు. వృద్ధాప్యం ఓ అవరోధమే కాదు. నేనిప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
ఎమెరిటస్ మెడికల్ సైంటిస్ట్ని. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఆనరరీ సైంటిస్ట్ని. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఫెలోగా ఉన్నాను. కేరళలో
నిర్వహించబోయే ఓ కాన్ఫరెన్స్కు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలిని. రిటైర్మెంట్ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకున్నాను. ఇంటి నుంచే రోజూ జూమ్ మీటింగ్స్లో పాల్గొంటాను. పరిశోధకులను గైడ్ చేస్తున్నాను.
మాది ముంబై. అక్కడే చదువుకున్నాను. నా కాలేజీ రోజుల్లో ఓ సంఘటన జరిగింది. బొంబాయి యూనివర్సిటీలో పీజీ (బయోకెమిస్ట్రీ) ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నుంచి ఓ ప్రొఫెసర్ ఎగ్జామినర్గా వచ్చారు. ‘నువ్వు మా దగ్గర పీహెచ్డీ చేస్తే మంచి భవిష్యత్ ఉంటుంది’ అని సూచించాడు. మాది పార్సీ కుటుంబం. తొమ్మిది మంది సంతానంలో నేను చిన్నదాన్ని. మా అమ్మ నన్ను పెద్ద చదువులు చదివించడానికి భయపడింది. నాన్న తనకు ధైర్యం చెప్పారు. అనుకున్నట్టే విటమిన్-ఏ2 పనితీరుపై పరిశోధన చేశాను. పీహెచ్డీ పూర్తయిన వెంటనే అమెరికాలో ఫెలోషిప్ వచ్చింది. టఫ్ట్ యూనివర్సిటీ, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీల్లో పీడీఎఫ్ చేశాను. అమెరికాలో చదువు అయిపోవచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో? ఎక్కడికి పోవాలో తోచలేదు. ఐఐఎస్సీ ప్రొఫెసర్కు లేఖ రాశాను. ఎన్ఐఎన్లో చేరమని సలహా ఇచ్చారు. నాకు జాబ్ కావాలని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ గోపాలన్కు లేఖ రాశాను. ఇంటర్వ్యూ కోసం పిలిచారు. అప్పటికి, నా ప్రాజెక్ట్ పూర్తికాలేదు. తక్షణం రావడం కుదరదని ఉత్తరం రాశాను. కుదిరినప్పుడు వచ్చి చేరమని జవాబు ఇచ్చారు గోపాలన్. ఆ జమానా కాబట్టి ఒక్క లెటర్తో ఉద్యోగం వచ్చింది. ఎన్ఐఎన్లో చేరేందుకు 1965లో హైదరాబాద్ వచ్చాను. విటమిన్ బీ2, బీ6 లోపాల వల్ల వచ్చే వ్యాధులను నిర్ధారించడం, ఆ విటమిన్ల లోపాలను సరిదిద్దుతూ ఆహార నియమాలలో మార్పులు చేయడం నా ప్రాజెక్టులో ఓ భాగం. ఆ కృషికి జాతీయంగా, అంతర్జాతీయంగా 21 అవార్డులు వచ్చాయి. ప్రజల్లో మూఢ నమ్మకాలు పోగొట్టడానికి జన విజ్ఞాన వేదికతో కలిసి పనిచేశాను. 1994లో రిటైర్ అయ్యాను. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉండటం వల్ల.. ముంబైకి తిరిగి వెళ్లాలనే ఆలోచనే రాలేదు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చే నాటికే తెలుగు బోర్డులు చదివేదాన్ని. చిన్నప్పుడు హిందుస్థానీ నేర్చుకున్నాను. బెంగళూరులో కర్ణాటక సంగీతం పరిచయమైంది. త్యాగయ్య కృతులను అర్థం చేసుకోవడానికి తెలుగు అక్షరాలు దిద్దాను. ట్యూటర్ను పెట్టుకుని తెలుగు మాట్లాడటం అలవాటు చేసుకున్నాను.
…✍ నాగవర్ధన్ రాయల
ఫొటోలు : గడసంతల శ్రీనివాస్
“అరుదైన పక్షులకు అండగా మారింది.. అంతరించిపోకుండా కాపాడింది”