IAS Keerthy Jally | అసోంలోని చెస్రీ పంచాయతీ. బురదతో నిండిపోయింది. పక్కనే ఉన్న చుత్రసంగం పరిస్థితి మరీ దారుణం. ఒక మహిళ ఇంటింటికీ తిరుగుతున్నారు. గడప గడపనూ తడుతున్నారు. ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా ఇస్తున్నారు. ఆ మహిళ కచార్ జిల్లా ( Cachar District ) కలెక్టర్ కీర్తి జల్లి. వరంగల్ జిల్లా తరిగొప్పులలో ప్రారంభమైన తన ప్రయాణం గురించి కీర్తి ఐఏఎస్ వివరిస్తున్నారిలా..
‘అయ్యో! అమ్మాయా?’ అన్నారట ఎవరో నేను పుట్టినప్పుడు. ‘అమ్మాయైతే ఏంది? బాగా చదివించి ఇందిరాగాంధీని చేస్తా’ అని ధీమాగా చెప్పారట నాన్న. చిన్నప్పటి నుంచీ అంతే. నాన్న ఎప్పుడూ సమాజం గురించే మాట్లాడేవారు. నాన్నలా నడుచుకోవడం, అమ్మలా ఆలోచించడం బాల్యంలోనే అలవాటైంది. నాన్నకు చాలా విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉండేది. ‘మనం బాగున్నాం కదా. అంతే చాలు’ అనే ధోరణి మాకెప్పుడూ లేదు. ఒకవేళ నేను ఐఏఎస్ కాకపోయి ఉంటే, కచ్చితంగా ఒక ఎన్జీవో స్థాపించేదాన్ని. మొదటి ప్రయత్నంలోనే నేను ఐఏఎస్కు ఎంపిక కావడానికి కారణం నాలోని సామాజిక స్పృహే. మిగతా పేరెంట్స్ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కొనిస్తే, మావాళ్లు మాత్రం మాకోసం పుస్తకాలు తెచ్చేవారు. చిన్నప్పటి నుంచీ నేను పుస్తకాల పురుగునే.
అమ్మ గృహిణి. కానీ తనకు ఎన్నో ఆలోచనలు ఉండేవి. మేం గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆమె ఆశ. నా విజయంలో అమ్మ పాత్ర చాలా ఉంది. అమ్మ తపన, నాన్న శ్రమ, నా కృషి.. అన్నీ ఫలించి 2013లో ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యాను. 2015లో శిక్షణ పూర్తయ్యింది. అసోం కేడర్ కేటాయించారు. ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్గా. అప్పుడు తరుణ్ గొగోయ్ సీఎం. ఆయన నియోజకవర్గంలో పనిచేసే అవకాశం వచ్చింది. సమర్థంగా వ్యవహరించి ‘యంగెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు అందుకున్నాను. తర్వాత హైలకండి కలెక్టర్గా బదిలీ అయ్యాను. 2020లో కచార్కు వచ్చాను. జిల్లాలో కొవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయం అది. రాత్రికి రాత్రే పోస్టింగ్ ఇచ్చారు. ‘మీరైతేనే పరిస్థితిని చక్కదిద్దగలరు’ అని చెప్పారు ఉన్నతాధికారులు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేశాను. కొద్ది రోజుల్లోనే కరోనాను కట్టడి చేయగలిగాను. కలెక్టర్గా నా ఫోకస్ అంతా విద్య, వైద్యం మీదే.. అందులోనూ మహిళల విద్య, ఆరోగ్యం, సంక్షేమం. పబ్లిక్ సర్వెంట్గా ప్రజలకు మంచి చేయాలని అనుకున్నప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయి. మనకెందుకులే అని వదిలేసుకుంటే.. ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు. కానీ, సేఫ్ గేమ్ ఆడటానికేనా మనం ఐఏఎస్ చదివింది? అంత కష్టపడింది? డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే పెద్ద మత ఘర్షణ చెలరేగింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాను. ఒకసారి మిజోరంలో సరిహద్దు గొడవ జరిగింది. ఆందోళనకారులు కాల్పులు జరిపారు. బుల్లెట్ నా వైపే దూసుకొచ్చింది. రెప్పపాటులో గురితప్పింది. నా వెనకాలే ఉన్న గార్డ్ చనిపోయాడు. నా ధైర్యానికి మెచ్చి ఆ సంవత్సరం రాష్ట్రపతి పురస్కారం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు. ఓటేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా చూడలేదు నేను. ఓట్ల కోసం నాయకులు వెళ్తే వెంటబడి తరిమేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించాను. భారీ ఓటింగ్ నమోదైంది.
నేను పెరిగింది హైదరాబాద్లోనే అయినా, తరచూ మా ఊరు తరిగొప్పుల వెళ్తుండేదాన్ని. పొలాల్లో తిరిగేదాన్ని. ప్రజల సమస్యలు, వ్యవసాయ పథకాలు.. వీటన్నిటి గురించి వింటుంటే నేనే కలెక్టర్ అయితే ఇలా చేసేదాన్ని, అలా చేసేదాన్ని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నా. చేసి చూపిస్తున్నా. నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చిన నా తెలంగాణకు, తరిగొప్పులకు సేవ చేసే అవకాశం రావాలని రోజూ దేవుణ్ని కోరుకుంటున్నాను. నేను వరద ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలుసుకొని తెలంగాణ నుంచి చాలామంది కాల్ చేశారు. ఎమ్మెల్సీ కవితగారు కూడా ‘బాగా చేస్తున్నారు. మన దగ్గరికి వచ్చేయండీ’ అన్నారు. అవకాశం ఇస్తే.. తప్పకుండా అంగీకరిస్తాను. తెలంగాణలో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలఅయ్యాయి. ఎంతోమంది శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక ఐఏఎస్ విజేతగా నా సలహా ఒకటే.. కష్టపడితే కచ్చితంగా కొలువు సాధించవచ్చు.
… దాయి శ్రీశైలం
“అమ్మ కోసమే ఐఏఎస్.. ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిచ్చే నిజామాబాద్ అమ్మాయి కథ”
“Neeta Patel | ఈమె గుజరాత్లోని 300 గ్రామాల దాహం తీర్చింది”
“నాన్న ఆశయం కోసం తన కలను, గమ్యాన్నే పక్కనబెట్టింది !!”
“పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే మహిళలకు ఇన్స్పిరేషన్ ఈమె..
“అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆపదలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న తెలంగాణ బిడ్డ”