Vangipuram Prashanthi | వివాహం జరిగిందంటే.. లక్ష్యం సగానికి సగం కుదించుకున్నట్టే! పిల్లలు కలిగారంటే.. గమ్యం కనుమరుగైనట్టే! అయినా, అన్ని అవరోధాలనూ అధిగమించి గెలుపు జెండా ఎగురవేశారు వంగీపురం ప్రశాంతి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, అనుకున్న లక్ష్యాన్నిఅందుకున్నారామె. ఇద్దరు పిల్లలను భుజానికెత్తుకొని, పోటీపరీక్షల రేసులో దూసుకుపోయారు. 2011 గ్రూప్-1లోటాప్ వన్గా, 2016 పరీక్షల్లో టాప్టెన్లో నిలిచారు ప్రశాంతి. ఈ విజేత అనుభవ పాఠాలు ఆమె మాటల్లోనే..
మాది మహబూబ్నగర్ జిల్లా. అమ్మ జయలక్ష్మి అధ్యాపకురాలు. నాన్న రామాచారి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మేం నలుగురం. ముగ్గురు అమ్మాయిలు. ఒక అన్నయ్య. చిన్నప్పటి నుంచీ చదువుల్లో ఫస్ట్ వస్తుండేదాన్ని. డాక్టర్ కావాలన్నది నా కల. ఎంసెట్లో 2,100వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఉచిత సీటు దొరకలేదు. డాక్టర్ కావాలన్న నా కల కలగానే మిగిలిపోయింది. అప్పుడు నాకు 18 ఏండ్లు. మంచి సంబంధం వచ్చింది. అమ్మానాన్నలకు బాగా నచ్చింది. ‘పెండ్లయ్యాక చదువుకోవచ్చు’ అని అత్తింటివారు హామీ ఇవ్వడంతో నేనూ సరేనన్నాను. అదే ఏడాది నా వివాహం అయ్యింది. చిన్నవయసులోనే కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. అయినా, చదువులో వెనకడుగు వేయలేదు. ఎల్ఎల్బీ చేయాలని అనుకున్నా. లాసెట్లో ఐదో ర్యాంక్ సాధించాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐదేండ్ల లా కోర్సు చేశాను.
పెండ్లయిన ఏడాదికే బాబు పుట్టాడు. బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే కష్టపడి చదివాను. లా చివరి సంవత్సరంలో రెండో బాబు కడుపులో పడ్డాడు. నెలలు నిండిన తర్వాత పరీక్షలు వచ్చాయి. చివరి పరీక్ష సమయంలో నాకు పెద్ద సవాలు ఎదురైంది. పరీక్ష కేంద్రం నాలుగో అంతస్తులో ఉంది. లిఫ్ట్లేదు. మా ఆయన రవిప్రకాశ్ వద్దని వారించారు. డాక్టర్ కూడా ఇబ్బంది అవుతుందన్నారు. అయినా, పాస్ మార్కుల వరకు పరీక్ష రాసి, అట్నుంచి అటే దవాఖానకు వెళ్లాను. రెండో బాబు పుట్టాడు. లా పట్టా కూడా చేతికి వచ్చింది. ఏడాదిన్నర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను. రూపాయి ఫీజు తీసుకోకుండా వాదించిన సందర్భాలు అనేకం. కొన్నాళ్లు అరోరా బిజినెస్ సూల్, ఆంధ్ర మహిళా సభలో లెక్చరర్గా పనిచేశాను.
మా పెద్దబ్బాయి పదో తరగతిలో ఉండగా, వాడిని చదివించడానికి ఉద్యోగానికి విరామం ఇచ్చాను. అప్పుడే 2011 ఎపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. డాక్టర్గా పేదలకు సేవ చేయాలనుకున్న నా కలను.. ఒక అధికారిగా నెరవేర్చుకోవచ్చని భావించాను. చివరి నిమిషంలో దరఖాస్తు చేశాను. పరీక్షకు మిగిలింది 85 రోజులే! ఏ కోచింగూ తీసుకోలేదు. చక్కని ప్రణాళికతో సొంతంగా సన్నద్ధమయ్యాను. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకున్నాను. మెయిన్స్లో మొదటిర్యాంక్ సాధించాను. నా సంతోషానికి అవధుల్లేవు. సబ్ కలెక్టర్ కావడమే తరువాయి అనుకున్న తరుణంలో.. విధి వెక్కిరించింది. కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఆ ఫలితాలు నిలుపుదల చేశారు. 2016లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని తీర్పు వచ్చింది. తిరిగి గ్రూప్-1కు సిద్ధమయ్యాను. ఈసారి 9వ ర్యాంక్ సాధించాను. పోస్టులు, రిజర్వేషన్లు తదితర కారణాలతో సబ్ కలెక్టర్ పోస్టు రాలేదు. మున్సిపల్ కమిషనర్గా
బాధ్యతలు చేపట్టాను. ఏ ఉద్యోగం అయితేనేం, ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కలిగింది. ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదురైనా సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చడంలో నేను రాజీ పడను. ఇది ప్రజలతో మమేకమై, వారికి సేవచేయడానికి ఆ దేవుడు నాకిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను.
ప్రస్తుతం కూకట్పల్లి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. అయినా మనసులో ఎక్కడో అసంతృప్తి. సమాజానికి మరింత సేవ చేయాలనే తపన. తాజాగా టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చాలామంది అభ్యర్థులంతా ఏం చదవాలో, ఎలా చదవాలో తెలియక హైరానా పడుతున్నారు. వాళ్లకు సరైన మార్గనిర్దేశం అవసరమని అనిపించింది. మనసు పెట్టి చదవడం, మానసికంగా సన్నద్ధం కావడం కీలకం. వీలైనంత మందికి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా. మిత్రుడు, నా గ్రూప్-1 సహచరుడు రజనీకాంత్రెడ్డికి నా ఆలోచనలు చెప్పాను. ఆయన సరేననడంతో 60 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఉదయాన్నే ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నాం. ప్రతీ ఆదివారం జూమ్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాం. మా దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో ఒక్కరు విజయం సాధించినా మా ప్రయత్నం ఫలించినట్టే.
… సూర్యకిరణ్ తోగటి
“అమ్మ కోసమే ఐఏఎస్.. ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిచ్చే నిజామాబాద్ అమ్మాయి కథ”
Bala latha | సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి అండగా మారిన బాలలత స్టోరీ ఇదీ..”
“అమెరికా నుంచి ఆఫ్రికా దాకా ఆపదలో ఉన్నవారికి చేయూత అందిస్తున్న తెలంగాణ బిడ్డ”