కోదాడ, మే 27 : బక్రీద్ పర్వదినం సందర్భంగా ఖుర్బానీలో గోవులను కోయవద్దని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. బుధవారం కోదాడ పెద్ద మసీదులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవులను వధించవద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ముస్లింలందరూ పాటించాలని పిలుపునిచ్చారు. జాతీయస్థాయిలో మత పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని, వారి నిర్ణయం మేరకు గోవులను కుర్బానీ ఇవ్వవద్దన్నారు. ఆవును జాతీయ జంతువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సర్వ మతాలను గౌరవించాలని, ఎవరి మనోభావాలను దెబ్బతీయ వద్దన్నారు. భారతదేశం లౌకిక దేశం అని, దేశంలో అందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండాలన్నారు. బక్రీద్ పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించ వద్దన్నారు. ఈ సమావేశంలో మత పెద్దలు ఎస్ కే ముఫ్టీ అతహర్, మౌలానా అహమ్మద్ నాద్వి, మౌలనా అయూబ్, మౌలానా హామీద్, మౌలానా అతహార్, ఆఫీస్ సిరాజ్, ముక్తి అబ్దుల్ ఖాదిర్, షమ్మీ, జహీర్,కాజా, బాబు సాహెబ్ పాల్గొన్నారు.