XYXX Innerwear | ప్రపంచ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోయేవాటిలో లోదుస్తులదే మొదటి స్థానం. ఇన్నాళ్లూ మార్కెట్లో రెండు, మూడు కంపెనీలదే రాజ్యం. వాటిలోనూ అవే రంగులు, అవే డిజైన్లు. కస్టమర్లు కూడా కష్టంగానే సర్దుకున్నారు. ఇప్పడా బాధలేదు. లోదుస్తుల మార్కెట్లోకి XYXX పేరుతో భారతీయ బ్రాండ్ దూసుకొచ్చింది. వచ్చీ రావడంతోనే సంచలనాలకు తెరతీస్తూ.. ఏటా కోట్లాది రూపాయల మార్కెట్ను పెంచుకుంటూ పోతున్నది. ఆ బ్రాండ్ వెనుకున్న జేమ్స్ బాండ్ కథ ఇది.
2017.. అప్పటికి పురుషుల అండర్వేర్ బ్రాండ్లు రెండంటే రెండు మాత్రమే! వాటికి కూడా ఒకే కుట్టు, ఒకే ఫ్యాబ్రిక్. సైజులేమో మనవారికి నప్పేవికాదు. ఊబకాయులను ఆ సంస్థలు పట్టించుకున్న పాపాన పోలేదు. ‘ఏదైనా కొత్త బ్రాండ్ వస్తే బావుండేదేమో?’ అనుకునేవారు వాడకం దారులు. సరిగ్గా అప్పుడే రంగంలో దిగాడు.. యోగేశ్ కబ్రా. అప్పటికే అమెరికాలోని హాల్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశాడు యోగేశ్. అండర్వేర్ కష్టాలు అతనూ అనుభవించాడు. తానే ఎందుకు ఓ కొత్త కంపెనీ ప్రారంభించకూడదు? అనే ఆలోచన వచ్చింది. అంతే.. యూఎస్లో ఉద్యోగాన్ని వదిలేసి భారత్లో స్థిరపడేందుకు నిశ్చయించుకున్నాడు. దాదాపు ఆరు నెలలపాటు లోదుస్తుల తయారీ, మార్కెట్, బ్రాండింగ్పై అధ్యయనం చేశాడు. అనంతరం కుటుంబీకులు, ఇన్వెస్టర్లు, స్నేహితులతో ఆలోచన పంచుకున్నాడు. అందరినీ ఓచోట చేర్చి అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమంలో తెలిసిన వ్యాపారవేత్త ‘మార్కెట్లో ఉన్నవి ప్రముఖ బ్రాండ్స్. వాటిని కాదని.. నీ ఉత్పత్తులు ఎందుకు కొంటారు?’ అంటూ ఓ ప్రశ్న సంధించారు. ఈ క్రమంలో యోగేశ్ స్నేహితుడొకరు ‘ఇది నీ జీవితంలో మొదటి మలుపు. ఇప్పుడు రిస్క్ చెయ్యకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందేమో. నాకు నీ ఆలోచన నచ్చింది. ప్రయత్నించు.. విఫలమైతే చనిపోవు కదా!’ అంటూ వెన్నుతట్టాడు. అంతే, వెనకడుగు వేయకుండా తన తండ్రిని ఒప్పించి రూ.50 లక్షల పెట్టుబడితో 2017 డిసెంబర్లో XYXX పేరుతో తన స్టార్టప్ను ప్రారంభించాడు యోగేశ్. పురుషుల ప్రీమియం ఇన్నర్వేర్, లాంజ్వేర్ బ్రాండ్లో బాక్సర్లు, బ్రీఫ్లు, ట్రంక్లు, హ్యాండ్మేడ్ పైజమాల విక్రయాలపై దృష్టి సారించాడు.
యోగేశ్ ఆలోచన జనానికి నచ్చింది. భారతీయులకు అనువైన సైజుల్లో, నాణ్యమైన ఫ్యాబ్రిక్లో అతి తక్కువ ధరకే లోదుస్తులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సొంత కార్ఖానాలో ఏటా 36 లక్షల యూనిట్ల లోదుస్తులు తయారవుతున్నాయి. మొదట తన ఆలోచనకు విరాళాల రూపంలో పెట్టుబడి సమకూరింది. ఆ తర్వాత ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్లు ఉన్న ఆదాయం, మరుసటి ఏడాదికి రూ.20 కోట్లకు పెరిగింది. 2021లో అది రూ.45 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకున్నాడు యోగేశ్. కరోనా సమయంలో నష్టాలు తప్పలేదు. కొన్ని కోట్ల నష్టాలు చవిచూసినా..
వెనకడుగు వేయలేదు.
‘నీ లోదుస్తులే ఎందుకు కొనాలి?’ అన్న విమర్శకులకు ప్రశ్నకు యోగేశ్ తిరుగులేని సమాధానం ఇస్తున్నాడు.. ఇన్నర్వేర్ తయారీలో మైక్రోమోడల్ ఫ్యాబ్రిక్ను ఉపయోగిస్తున్నాడు తను. ఆస్ట్రియాలోని పల్ప్ బీచ్వుడ్ చెట్ల నుంచి ఈ ఫ్యాబ్రిక్ను తయారుచేస్తారు. ఇది యాంటీమైక్రోబియల్తో కూడి ఉంటుంది. వేడి, తేమను తట్టుకునే గుణం ఎక్కువ. భారతీయ వాతావరణానికి అనువైన వస్త్రం కూడా. దీనివల్ల తమ బ్రాండ్ ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లిందని సగర్వంగా చెబుతున్నాడు యోగేశ్. భారత్ ఊబకాయుల దేశం. కాబట్టే, ప్లస్ సైజుల వారినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సైజులను సృష్టించాడు. ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ లోదుస్తులు అందుబాటులో ఉన్నాయి. యోగేశ్ ఇప్పటికీ 50 శాతం విక్రయాలు ఆన్లైన్ ద్వారానే జరుపుతుండటం విశేషం. ఈ మధ్యే ముంబైలో కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. 70కిపైగా నగరాల్లో 10వేల మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు ఏర్పాటు చేశాడు. తన బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్ను నియమించుకొని.. యూత్ను టార్గెట్ చేస్తున్నాడు.
అమెరికాలో డాలర్లు వద్దని.. హైదరాబాద్ వచ్చి పాల వ్యాపారం చేస్తున్నడు”