IAS Anwesha Reddy | ఒడిశా.. కలహండి జిల్లా. ఆకలిచావుల రేవు.. పేదరికానికి సాక్షి సంతకం. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గానేఉన్నాయి. కలహండి ( Kalahandi ) తనకంటూ ఓ అభివృద్ధి నమూనాను సిద్ధం చేసుకుంటున్నది. కానీ, సమర్థ నాయకత్వం లేకపోతే పాత అనుభవాలు పునరావృతం కావచ్చన్న భయం వెంటాడుతూనేఉంది. కాబట్టే, ప్రభుత్వం ఆచితూచి ఓ యువ ఐఏఎస్ను కలెక్టరుగా నియమించింది.
ఆమె పేరు.. అన్వేషా రెడ్డి, తెలంగాణ ఆడబిడ్డ. అన్వేష.. నిత్యాన్వేషి, సత్యాన్వేషి. బాల్యంలో ఆ అన్వేషణ.. జిజ్ఞాసను పెంచింది. నేర్చుకోవాలనే తత్వాన్ని, తెలుసుకోవాలనే కుతూహలాన్ని, సాధించాలనే పట్టుదలను బోధించింది. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని అన్నారం ఆమె స్వగ్రామం. ఐదేండ్ల క్రితం, సివిల్ సర్వీసు పరీక్షల్లో జాతీయ స్థాయిలో 80వ ర్యాంకు తెచ్చుకుని ఐఏఎస్ సాధించింది అన్వేష. తన విజయం ఇక్కడి బాలికలకు ఓ స్ఫూర్తి పాఠం. ‘పెద్దయ్యాక ఏం అవుతావ్?’ అని ఏ హైస్కూలు విద్యార్థిని అడిగినా ‘అన్వేష మేడమ్లా కలెక్టర్ అవుతా’ అనే సమాధానమే వినిపిస్తుంది. పదో తరగతి వరకు మహబూబ్నగర్లో, ఇంటర్మీడియట్ ఐఐటీ రామయ్య అకాడమీలో చదివింది అన్వేష. జార్ఖండ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకుంది. కొంతకాలం టాటా స్టీల్స్లో ఉద్యోగం చేసింది. లక్షల జీతాన్ని కాదనుకొని సివిల్ సర్వీసుల వైపు అడుగులు వేసింది. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకూ వెళ్లింది. రెండో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. తల్లిదండ్రులు.. సుగుణమ్మ, యుగంధర్ రెడ్డి ఉపాధ్యాయులు. ‘శ్రమించు. శ్రమిస్తేనే విజయం సాధ్యం’ అని నాన్న చెప్పిన మాటలే తన గెలుపు మంత్రాలని అంటున్నది అన్వేష.
ఇంటర్మీడియట్ రోజుల్లోనే ఐఏఎస్ను లక్ష్యంగా పెట్టుకుంది అన్వేష. ధన్బాద్లో చదువుతున్నప్పుడు.. ఐపీఎస్ అధికారి అంబరీశ్ మిశ్రా సారథ్యంలో నడుస్తున్న కర్తవ్య అనే ఎన్జీవోలో కొద్దికాలం వలంటీర్గా పనిచేసింది. మిశ్రా ఆలోచనలు ఆమెను అపారంగా ప్రభావితం చేశాయి. నలుగురి కోసం పనిచేయాలని అనుకునేవారికి ఐఏఎస్ను మించిన కెరీర్ లేదని అర్థమైపోయింది. ఉద్యోగానికి రాజీనామా చేసి, సివిల్స్ సమరశంఖం పూరించింది. పిల్లల ఆశయాలు పిల్లలవి, కన్నవారి కలలు కన్నవారివి. ఆ దశలోనే, పెండ్లి చేసుకోమంటూ తల్లివైపు నుంచి కొంత ఒత్తిడి వచ్చింది. ‘సివిల్స్ నా లక్ష్యం. అనుకున్నది సాధించేందుకు కొంత సమయం ఇవ్వండి’ అంటూ అమ్మానాన్నలను ఒప్పించింది. ఆ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.
‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే నాకు ర్యాంకు వచ్చింది. కాబట్టి, తెలంగాణ నుంచి ఎంపికైన ఐఏఎస్ అధికారినని గర్వంగా చెప్పగలను. నేను పాలమూరు బిడ్డను. ఇక్కడ ప్రజల కష్టాలు, కరువులు చూస్తూ పెరిగాను. ప్రాజెక్టులు వస్తేనే వలసలు ఆగుతాయని నా నమ్మకం. అక్షరాలా ఆ మాట రుజువైంది. పుష్కలమైన సాగునీటితో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వలసలు తగ్గాయి. పచ్చగా కళకళలాడుతున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రాజధానిలోనూ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా దూసుకుపోవడం గర్వకారణం’ అంటూ సొంత జిల్లా గురించి, మాతృరాష్ట్రం గురించి మురిసిపోతూ చెబుతున్నది అన్వేషా రెడ్డి.
‘కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. చాలా ప్రాంతాలు పర్యటించాను. సమస్యల పట్ల అవగాహన వచ్చింది. కలహండి జిల్లా అభివృద్ధి పైనే నా ఫోకస్ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తాను. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తాను. పాదచారులు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఫుట్పాత్పై నడిచేలా రహదారులను తీర్చిదిద్దుతాను. ఈ జిల్లాలో గిరిజన ప్రాంతాలు ఎక్కువ. విద్య ప్రాధాన్యాన్ని వివరించి అక్షరాస్యత పెంచుతాను. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాను. నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. స్వయం ఉపాధి ద్వారా యువతకు ఎదిగే అవకాశాలు కల్పిస్తాను. దీనికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను’ అని చెబుతున్నప్పుడు అన్వేష స్వరంలో అపారమైన ఆత్మవిశ్వాసం.
ప్రోత్సాహం, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అగ్రస్థానం సాధ్యమే. సివిల్ సర్వెంట్గా ప్రజలకు సేవ చేయాలన్న బలమైన సంకల్పం అవరోధాలను అధిగమించే శక్తిని ఇస్తుంది. ఐఏఎస్ కోసం నేను రెండేళ్లు కష్టపడి చదివాను. చదువుకునే సమయంలో అమ్మానాన్న ప్రోత్సాహం, సర్వీస్లోకి వచ్చాక భర్త సహకారం మరువలేనిది. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష లేకుండా చదివిస్తున్నారు. కష్టపడి కలలు నెరవేర్చుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. విస్తృతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది.
సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా ఏ గణాంకాన్ని అయినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. లక్ష్యంపైనే గురిపెడితే ఏదైనా సాధించవచ్చు.. అది సివిల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు.
– అన్వేషా రెడ్డి, ఐఏఎస్
…? రాందేని చంద్రమౌళి
“Roman Saini | డాక్టర్ చదివినా.. ఐఏఎస్ అయినా రాని కిక్.. ఇలా వస్తుందట !!”
“IAS Keerthy Jally | అవకాశం ఇస్తే తెలంగాణకు వస్తా.. కచార్ జిల్లా కలెక్టర్ కీర్తి జల్లి”