ఎన్నో సంప్రదాయ పండుగలకు నెలవు తెలంగాణ. వాటిలో మన రాష్ట్ర సంస్కృతికి బోనాలు దర్పణం పడతాయి. ఆషాఢం రాకతో హైదరాబాద్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వారం, వారం ఈ ఉత్సాహం ఇనుమడిస్తుంది. అమ్మోరు తల్లి జాతరతో జంటనగరాలు భక్తజన సంద్రంగా మారిపోతాయి. గోల్కొండ కోట నుంచి మొదలయ్యే బోనాల సందడి లష్కర్ ఉజ్జయనీ మహాంకాళి కోవెలలో రెట్టింపవుతుంది. లాల్దర్వాజ అమ్మవారి సన్నిధిలో వైభవంగా సాగుతుంది.
ఈ వేడుకలో భాగంగా ఆడపడుచులు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. కొత్తకుండలో బియ్యం, పాలు, నెయ్యి, చక్కెర కలిపి నైవేద్యం తయారుచేస్తారు. కుండకు సున్నం రాసి, చుట్టూ పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. దాని పైభాగంలో వేపాకు మండలు ఉంచుతారు. కుండపై గండదీపం పేరిట జ్యోతిని వెలిగిస్తారు. ఇలా పవిత్రంగా తయారు చేసుకున్న బోనాన్ని తలపై ధరించి డప్పుల వాయిద్యాలతో పాటలు పాడుకొంటూ, లయబద్ధంగా నృత్యం చేస్తూ, దేవాలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. బోనాల మరుసటి రోజు ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు.
పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ వేడుకలను చూసేందుకు జంటనగరవాసులతోపాటు పక్క రాష్ర్టాల నుంచీ భక్తులు తరలివస్తారు. విదేశీ పర్యాటకులు సైతం ఈ తంతునంతా ఆసక్తికరంగా తిలకిస్తుంటారు. బోనాల వేడుక హైదరాబాద్లో ఆషాఢంలో చేసుకుంటే, తెలంగాణ పల్లెల్లో మఖ కార్తె వచ్చాక (శ్రావణ మాసంలో) నిర్వహిస్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈసారి బోనాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం విశేషం. ఈ జనజాతర వెనుక ఆరోగ్య సూత్రమూ కనిపిస్తుంది. సాధారణంగా, ఆషాఢంలో వానలు జోరందుకుంటాయి. వివిధ రకాల అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. వాటినుంచి రక్షణ కల్పించాలని అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం మొదలైంది. అంటువ్యాధులకు అడ్డుకట్టవేసే పసుపు, వేప మండలను బోనాల సందర్భంగా విరివిగా వాడటం గమనించవచ్చు.