కరోనా టీకా తీసుకుంటున్న ఫొటోను స్టేటస్గా పెట్టుకుంటున్నారు చాలామంది! అలా పెట్టుకోకపోయినా టీకా పనితనం మారదు. షిల్లాంగ్ నగర వీధుల్లో పల్లీ బఠానీలు అమ్ముకునే ఓ చిరువ్యాపారి కూడా ‘వ్యాక్సినేటెడ్’ అని తన డబ్బాపై సగర్వంగా అతికించుకున్నాడు. టీకా వేయించుకున్నానని ప్రచారం చేసుకోవడం ఆయన ఉద్దేశం కాదు. ఇలా అయినా, ఓ నలుగురు వచ్చి తన దగ్గర కొంటారన్న ఆశ. కరోనాకు ముందు షిల్లాంగ్ పర్యాటకులతో కళకళలాడేది. కొవిడ్ దెబ్బతో ఏడాదిన్నరగా టూరిస్టుల జాడే లేదు. లాక్డౌన్ ప్రభావంతో కొన్ని నెలలపాటు వీధుల్లోకి వచ్చే సాహసమూ చేయలేదు. లాక్డౌన్ ఎత్తేసినా షిల్లాంగ్ వీధులు బోసిపోతున్నాయి. స్థానికులు సైతం, బయట తినడానికి సాహసించడం లేదు. ఫలితంగా చిరుతిళ్లు అమ్ముకునే చాలామందికి పూట గడవడమే కష్టమైంది. ఈ నేపథ్యంలో తన డబ్బాకు ‘వ్యాక్సినేటెడ్’ అని అతికించుకొని వీధుల్లోకి వచ్చాడు ఈ చిరువ్యాపారి. ఆ భరోసాతో ఒకరిద్దరు ధైర్యంగా వెళ్లి పల్లీబఠానీలు కొనడం విశేషం. ఎవరో ఈ చిత్రాన్ని క్లిక్మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అది కాస్తా వైరల్ కావడం కొసమెరుపు.