రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. అయినా, మానవత్వం పరిమళించే మంచి మనసు ఆమె సొంతం. ఎన్ని కష్టాలున్నా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మూగజీవాలకు పట్టెడన్నం పెట్టడం మాత్రం ఆపలేదు. ప్రేమకు తాను పేదను కానని చాటిచెబుతున్నది ఖమ్మం నగరానికి చెందిన బొడ్ల సుజాత. మామిళ్లగూడెం సాయిబాబా గుడి సెంటర్ దగ్గర ఆమె నివాసం. నాలుగు ఇండ్లలో పనిచేస్తూ ముగ్గురు పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నది సుజాత. బిడ్డలను ఎంత ప్రేమగా చదివిస్తున్నదో, వీధి కుక్కలకూ అంతే ఆత్మీయంగా అన్నం పెడుతున్నది.
సుజాత ఇంటి నుంచి బయటికి వస్తే చాలు ఆమె చేతిలోని అన్నం గిన్నె వైపు ఆశగా చూస్తాయి మూగజీవాలు. సుజాత దినచర్యలో పెద్దగా మార్పు ఉండదు. ఉదయం పనికి వెళ్లేముందు వీధిలోని కుక్కలకు భోజనం పెడుతుంది. పది నిమిషాలు ముచ్చట్లు చెబుతుంది. అభిమానంగా నిమురుతుంది.
అవి ఏ ప్రమాదంలోనో గాయాలపాలైతే, తన బిడ్డలకే దెబ్బ తగిలినంతగా విలవిల్లాడిపోతుంది. ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందిస్తుంది. గాయం మానేవరకు తానే బాధ్యత తీసుకుంటుంది. తన భోజనాన్ని సైతం వీధికుక్కలకు పెట్టి పస్తులున్న రోజులూ అనేకం. చేతిలో నాలుగు డబ్బులున్న రోజు ఏ మాంసమో, కోడిగుడ్డో తెచ్చి వండి పెడుతుంది కూడా.
సుజాత కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే. ఎమ్మెస్సీ చదువుతున్న కుమార్తె రక్తహీనతతో బాధ పడుతున్నది. అయినా, ఖరీదైన వైద్యం చేయించలేని దుస్థితి. మూగజీవాలంటే తనకు మొదటి నుంచీ అభిమానమని, అందుకే తనకు ఉన్నదాంట్లో నాలుగు మెతుకులు కుక్కలకూ పెడుతున్నానని చెబుతున్నది సుజాత.
…మాటేటి వేణుగోపాల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఖమ్మం
ఇవి కూడా చదవండి: