చలికాలంలో చాలామందిలో కనిపించే లక్షణాలు.. జలుబు (సర్ది), దగ్గు. అయితే, కరోనా మహమ్మారి ప్రాథమిక లక్షణాల్లో ఇవీ ఉండటంతో తుమ్ములు రాగానే జనం వణికిపోతున్నారు. ఇలాంటప్పుడు, సంప్రదాయ చిట్కాలను పాటిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నది నటి రష్మిక మందన్న. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వ్యాసంలో రష్మిక సర్ది సలహాలు.. ‘చలికాలంలో శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వంటివి సర్వ సాధారణం. కాబట్టి, ఒకట్రెండు లక్షణాలు కనిపించగానే గాబరా పడిపోకండి. మన తాత ముత్తాతల చిట్కాలు ప్రయత్నించండి. నాకు చిన్నప్పటి నుంచీ ప్రయాణం అంటే ఇష్టం. డిసెంబరు మొదలైతే చాలు, మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లిపోయి ప్రకృతిని ఆస్వాదిస్తాను. అటువంటి సమయాల్లో కొన్నిసార్లు సర్ది చేస్తుంది. బాల్యంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు.. అమ్మ కర్పూరం, యూకలిప్టస్ ఆకులతో ఆవిరి పట్టించేది. అంతే, రెండ్రోజులకే ఉపశమనం లభించేది. ఇప్పుడేమో షూటింగ్లలో చాలా బిజీగా ఉన్నాను. అయినా ప్రకృతితో మమేకం కావడం మాత్రం మానలేదు. చల్లని దేశాలకు వెళ్లినప్పుడు సర్ది చేస్తే.. టాబ్లెట్ల జోలికి వెళ్లకుండా పాత పద్ధతులనే పాటిస్తున్నా. కాకపోతే, కర్పూరం, యూకలిప్టస్తో పాటుగా మెంథాల్ ఉన్న ఔషధాలను వాడుతున్నా. ఆవిరి పట్టడం వల్ల ముక్కుకు, గొంతుకు ఉపశమనం దొరుకుతుంది’ అంటున్నది రష్మిక. ఆరోగ్యం కోసం నిత్యం జిమ్, యోగా వంటివి కూడా చేస్తానని చెబుతున్నది.