ఈ వ్యాధి తత్వమే అంత. లక్షణాలు కనబడవు. నొప్పి బాధించదు. రుగ్మత మాత్రం చాపకింద నీరులా, సరిహద్దు శత్రువులా ఎముకలను ఆక్రమించుకుంటూ ముందుకు సాగుతుంది. ఆస్టియోపొరాసిస్ను అధిగమించాలంటే ఒకటే దారి. బాల్యం నుంచీ ఆరోగ్యకర జీవన శైలిని అనుసరించడం, క్యాల్షియంను కరెన్సీలా పోగేసుకోవడం.
బోన్లాస్ లేదా ఆస్టియోపొరాసిస్… ఈ వ్యాధిని ‘సైలెంట్ ఎపిడమిక్’గా పరిగణిస్తారు. కారణం, రోగిలో రుగ్మత లక్షణాలు అంత సులువుగా బయటపడవు. వ్యాధి వచ్చేంత వరకూ తెలియదు. వచ్చిన తర్వాత చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఆస్టియోపొరాసిస్.. పురుషులతో పోలిస్తే స్త్రీలలో అతి సాధారణ వ్యాధిగా మారిపోయింది. కారణం.. ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ఒత్తిళ్లు.. ఇలా రకరకాల కారణాల వల్ల మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ్ద పెట్టకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, సూర్యరశ్మికి దూరంగా ఉండటం, క్యాల్షియం లోపం. ఈ నిర్లక్ష్యాలన్నీ కలిసి ఆమె ఎముకలను గుల్ల చేస్తున్నాయి.
ఫలితంగా, బోన్లాస్ లేదా బోలు ఎముకల వ్యాధి స్త్రీ ఆరోగ్యాన్ని మింగేస్తున్నది. రుతుస్రావం ఆగిపోయాక హార్మోన్లలో కలిగే మార్పులు కూడా ఒక కారణమే. యాభై ఏండ్ల లోపే కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, అలసట తదితర సమస్యలకు గురవుతున్నారు. సాధారణంగా 55-60 ఏండ్లు పైబడిన మహిళలు ఆస్టియోపొరాసిస్ బారిన పడటం సహజమే. ఇతర దేశాలతో పోల్చితే, ఓ పదేండ్లు ముందుగానే ఈ వ్యాధి కోరలకు చిక్కుకొంటున్నారు భారతీయ మహిళలు.
..ఎముకలు సాంద్రతను కోల్పోవడం, వాటి పటుత్వం తగ్గిపోవడం. ఓ దశలో ఎముకలు రంధ్రాలమయం అయిపోయి, స్పాంజిలా తయారవుతాయి. అప్పటికే పెళుసుబారిపోవడం వల్ల.. ఇట్టే విరిగిపోతాయి.
వివిధ రకాల జబ్బుల ఫలితంగా వచ్చే బోలు ఎముకల వ్యాధిని ‘సెకెండరీ ఆస్టియోపొరాసిస్’ అంటారు. లుకేమియా, మధుమేహం, ఉదర కుహర వ్యాధి, హైపర్ థైరాయిడిజం, మూత్రపిండ వ్యాధి, అనొరెక్సియా, ఎటియోజెనిసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్.. వంటి వ్యాధులతో బాధపడే వారికి సెకెండరీ ఆస్టియోపొరాసిస్ వచ్చే ఆస్కారాలు ఎక్కువ. ఈ వ్యాధికి పసివాళ్లూ మినహాయింపు కాదు.
రోగికి ఏ ఇతర వ్యాధులు లేకపోయినా వచ్చే ఎముకల రుగ్మత.. ప్రైమరీ ఆస్టియోపొరాసిస్. ఈ వ్యాధిని రెండు రకాలుగా విభజించారు.. ‘పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరాసిస్’, ‘ఫెన్నెల్ ఆస్టియోపొరాసిస్’.
పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరాసిస్
రుతుస్రావం ఆగిపోయిన తర్వాత దశలో సంభవించే హార్మోన్ మార్పుల వల్ల ఎముకలు క్రమంగా శిథిల స్థితికి చేరుకొంటాయి. ఆ సమయంలో ఎముకల్లోని క్యాల్షియం రక్తంలో కలిసిపోతుంది. అలా, ఎముకల్లో క్యాల్షియం నిలువలు తగ్గిపోతాయి. సాధారణంగా మహిళల్లో 50 ఏండ్లు దాటే సమయంలో ఈ మార్పు మొదలవుతుంది.
‘పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరాసిస్’ లక్షణాలు కూడా సరిగ్గా అప్పుడే బహిర్గతం అవుతాయి. అనేకానేక కారణాల వల్ల ఇటీవలి కాలంలో కొంతమంది మహిళలు 50 ఏండ్లలోపే పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరాసిస్కు గురవుతున్నారు. ఎముకలోని సాంద్రత క్షయానికి గురవుతున్నదంటే, బోలు వ్యాధి మొదలైనట్లే. దీన్ని ప్రారంభ దశగా పరిగణిస్తారు.
నిజానికి, ఎముకలు తక్షణమే తమ సాంద్రతను కోల్పోవు. అందుకు కొంత సమయం పడుతుంది. ఈ దశలో రోగిలో ఎలాంటి లక్షణాలూ బయట పడవు. ప్రమాదవశాత్తు కింద పడినప్పుడో మరో సందర్భంలోనో వైద్య పరీక్షలు జరిపితే.. రుగ్మత మూలాలు తెలుస్తాయి.
50 ఏండ్ల లోపు అయితే..
ఈ మధ్య 50 ఏండ్ల లోపు మహిళలు కూడా ఆస్టియోపొరాసిస్కు, కీళ్ల నొప్పులకు గురవుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు. మొదటిది, ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెట్టకపోవడం. రెండోది, 45-50 ఏళ్ల మధ్య వయసులోనే రుతుక్రమం ఆగిపోవడం.
సాధారణంగా ఈ వయసులో స్త్రీత్వానికి ప్రతీక అయిన ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా మెనోపాజ్కు దగ్గరవుతున్న (రుతుక్రమానికి దూరమవుతున్న) మహిళల్లో ఎముకలు పటుత్వం కోల్పోతాయి. క్రమంగా బలహీనపడుతాయి.
ఫెన్నెల్ ఆస్టియోపొరాసిస్
ఫెన్నెల్ ఆస్టియోపొరాసిస్ వయసుతో ముడిపడి ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరికీ వస్తుంది. సాధారణంగా మనిషి జన్మించినప్పటి నుంచీ వయసుతో పాటు ఎముకలూ పెరుగుతాయి. ఈ ఎదుగుదల 30 ఏండ్ల వరకూ ఉంటుంది. ఆ తరువాత తగ్గిపోతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే.. అందుకు సరిపడా విటమిన్-డి, క్యాల్షియం కావాలి. క్యాల్షియం అనేది ఆహారం ద్వారా అందుతుంది. విటమిన్-డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. మనిషిలో 70 ఏండ్ల వయసు వచ్చేసరికి ‘బోన్ ఫార్మేషన్’ తగ్గిపోతుంది. ఫలితంగా, ఎముకలు క్రమంగా బలహీనపడతాయి. అందుకే, ఏడుపదులు దాటిన వారిలో ఆస్టియోపొరాసిస్ అన్నది సహజ పరిణామం.
‘పీక్ బోన్మాస్’తో..
ఫెన్నెల్ ఆస్టియోపొరాసిస్, పోస్ట్ మెనోపాస్ ఆస్టియోపొరాసిస్లను అధిగమించడంలో ‘పీక్ బోన్మాస్’ పాత్ర కీలకం. ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకోవడాన్నే ‘పీక్ బోన్మాస్’గా భావిస్తారు. అంటే, ఆ సమయానికి ఎముకల ఎదుగుదల అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ‘పీక్ బోన్మాస్’ దశ 30 ఏండ్ల వయసులో వస్తుంది.
ఆ సమయానికంతా ఎముకల్లో క్యాల్షియం నిలువలు అధిక మొత్తంలో పోగవుతాయి. అందుకే, ఈ వయసులో ఎముకల ఎదుగుదలను ‘బ్యాంక్ డిపాజిట్’లా భావిస్తారు. ఆ పటుత్వం మహిళల్లో మెనోపాజ్ తరువాత, పురుషుల్లో 70 ఏండ్లు దాటిన తరువాత వచ్చే ఆస్టియోపొరాసిస్ను అధిగమించడానికి సాయపడుతుంది. అంటే, ఫెన్నెల్ దశలో బోన్ ఫార్మేషన్ తగ్గిపోయినప్పుడు ‘పీక్ బోన్మాస్’ రక్షణ కవచంలా నిలుస్తుంది. దీంతో ఆస్టియోపొరాసిస్ నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ‘పీక్ బోన్మాస్’ అనేది నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో..
ఎముకల్లో క్యాల్షియం నిలువలు అధికంగా ఉండాలంటే బాల్యం నుంచే పౌష్టికాహారం తీసుకోవాలి. క్యాల్షియం సమృద్ధిగా లభించే పదార్థాలను భోజనంలో భాగం చేసుకోవాలి. చర్మానికి సూర్యరశ్మి తగిలేలా పిల్లలను రోజూ కనీసం 20 నిమిషాలు ఎండలో గడపనివ్వాలి. దీనివల్ల విటమిన్-డి లభిస్తుంది. వీటితో పాటు శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చే ఆటలు ఆడిపించాలి.
ఫలితంగా, 30 ఏండ్లు వచ్చేసరికి ‘పీక్ బోన్మాస్’ ఏర్పడుతుంది. పురుషులతో పోలిస్తే.. మహిళల్లో ‘పీక్ బోన్మాస్’ అనేది కొంత తక్కువగానే ఉంటుంది. అందుకే చిన్నతనం నుంచే సమతుల ఆహారంపై దృష్టి పెట్టాలి. వెన్నెముక వంగిపోవడం, ఎత్తు తగ్గిపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
నిర్ధారణ పరీక్షలు
ఆస్టియోపొరాసిస్ను గుర్తించాలంటే.. రోగి ఆరోగ్య స్థితిని లోతుగా అధ్యయనం చేయాలి. కుటుంబ నేపథ్యం గురించి వాకబు చేయాలి. అంటే, రక్త సంబంధీకుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉందా అన్నది తెలుసుకోవాలి. అనంతరం ‘డెక్సా స్కాన్’ ద్వారా అది ఏ రకమైన ఆస్టియోపొరాసిస్ అన్నది నిర్ధారించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధిని టి-స్కోర్ ద్వారా ధ్రువీకరిస్తారు.
ప్లస్ 1 నుంచి మైనస్ 1 మధ్యలో ఉంటే, అది సర్వసాధారణం. వ్యాధి లేనట్టే.
మైనస్ 1 నుంచి మైనస్ 2.5 మధ్యలో ఉంటే, ఆస్టియోఫీనియాగా పరిగణిస్తారు. ఈ దశలోని రోగులకు సులభంగా చికిత్స చేయవచ్చు.
మైనస్ 2.5 కంటే తక్కువగా ఉంటే, ఆస్టియోపొరాసిస్ ఉన్నట్టు. టి-స్కోర్ మైనస్ 2.5 కంటే తక్కువగా ఉండి, రోగిలో బోన్ ఫ్రాక్చర్ కూడా ఉంటే… దాన్ని తీవ్ర స్థాయి ఆస్టియోపొరాసిస్గా పరిగణిస్తారు. అంటే, వ్యాధి తీవ్ర దశకు చేరినట్లు భావించవచ్చు. ఇక వెనువెంటనే చికిత్స ప్రారంభించాలి, జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాలి. ఈ రుగ్మతకు అవగాహనే అతిపెద్ద వైద్యం.
చికిత్సా విధానం
పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరాసిస్ రోగులకు హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపి (హెచ్ఆర్టీ) ద్వారా చికిత్స అందిస్తారు. పారా థైరాయిడ్ హార్మోన్తోనూ వైద్యం చేయవచ్చు. ఈ చికిత్స పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరాసిస్తో పాటు ఫెన్నెల్ ఆస్టియోపొరాసిస్ రోగులకు సైతం ఇవ్వవచ్చు. ఈ చికిత్సలో అందించే హార్మోన్ల వల్ల ఎముక నుంచి క్యాల్షియం బయటకు పోకుండా అడ్డుకోవచ్చు. ఫలితంగా ఆస్టియోపొరాసిస్ను నియంత్రించవచ్చు. ఇదో నిశ్శబ్ద శత్రువు కాబట్టి, వ్యాధి పట్ల అవగాహనతో జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. నలభై దాటిన ప్రతి మహిళా ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
… మహేశ్వర్రావు బండారి
డాక్టర్ సాగి రాధాకృష్ణారావు
ఆర్థోహెగ్సగాన్ విభాగాధిపతి,
జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్,
ప్రతిమ హాస్పిటల్