Forest Range Officer Tejaswi | ఐటీ కొలువు. పెద్ద జీతం. అందమైన జీవితం. రంగుల ప్రపంచం. కానీ.. ఇవేవీ సంతృప్తిని ఇవ్వవని గ్రహించింది. అడవితో స్నేహాన్ని కోరుకుంది. అమాయక ప్రజల మధ్య జీవించాలని అనుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదనుకుని అరణ్య మార్గం పట్టింది. ప్రస్తుతం, అన్నీ తానై అడవికి ఆయువు పోస్తున్నది.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్వి. ఆ పచ్చని ప్రపంచంతో తన అనుబంధాన్ని వివరిస్తున్నారామె.
మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. హైదరాబాద్లో బీటెక్ చేశాను. ఐటీలో చాలా ఆఫర్లే వచ్చాయి. కానీ ఆ జీవితం వద్దనుకున్నా. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగమే ఉత్తమ మార్గమనిపించింది. అందుకే, హైదరాబాద్లో ఉంటూ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను. తొలి ప్రయత్నంలోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ఉద్యోగం వచ్చింది. అందరూ వద్దని వారించారు. ఫారెస్ట్ ఆఫీసర్ అంటే రాత్రీపగలూ తేడా లేకుండా దట్టమైన అడవుల్లో తిరగాల్సి ఉంటుందని భయపెట్టారు. అమ్మాయిలకు అటువంటి ఉద్యోగం అవసరమా? అంటూ నా మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ, నేను మనసు మార్చుకోలేదు. అమ్మానాన్న సైతం నా అభిప్రాయానికే ఓటేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే పోడు సమస్యలు అధికం. గిరిజనులు ఎక్కువ. పక్కనే ఛత్తీస్గఢ్ ఉంది. నక్సల్స్ ప్రభావమూ ఎంతోకొంత ఉంటుంది. తొలుత ట్రైనింగ్కు భద్రాద్రి జిల్లాకే పంపారు. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని ముందే తెలుసు. కానీ.. ఏడూళ్ల బయ్యారం వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. మొదట్లో అంతా కొత్తగా అనిపించేది. కొద్దిరోజులకే ఆ వాతావరణం అలవాటైంది. ఇక్కడి ప్రజల మంచితనం, ఆదివాసీల అమాయకత్వం.. నాకెంతో నచ్చాయి. ట్రైనింగ్ తర్వాత, ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు.
ఒకసారి కౌలూరు గుట్టపైకి పెద్దపులి వచ్చింది. ఐదు రోజులు అక్కడే మకాం వేసింది. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. తెలిసిన వాళ్లు ఫోన్ చేసి.. అటువైపు వెళ్లొద్దని చెప్పారు. కానీ, అదెలా సాధ్యం? అడవినే కాదు.. అందులోని జంతువులను, అడవిని నమ్ముకుని బతుకుతున్న ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత నాదే? నేను ముందు నిల
బడితేనే కదా.. జనానికి ధైర్యంగా ఉంటుంది. అందుకే, ఏమాత్రం ఆలోచించకుండా నా సిబ్బందిని తీసుకుని అక్కడికి వెళ్లిపోయాను. ప్రజలకు ధైర్యం చెప్పాను. రోజూ అక్కడికి వెళ్లేదాన్ని. పెద్దపులి ఐదు రోజుల తర్వాత వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.
ఏడూళ్ల బయ్యారం రేంజ్లో నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క ఎకరా పోడు కూడా నరకలేదు. అడవుల నరికివేతపై ఇక్కడి ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాం. దీంతో సానుకూల ఫలితం కనిపించింది. అడవుల్లో అక్రమ కలప తరలింపును నేను చాలా సీరియస్గా తీసుకున్నా. పక్కనే ఛత్తీస్గఢ్ ఉండటంతో గోదావరి మార్గంలో కలపను తరలించేవారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించా. సమాచారం వస్తే అర్ధరాత్రి అని కూడా చూడకుండా వెళ్లిపోయేదాన్ని. అలా రాత్రిపూట గోదావరి తీరంలో కాపలా కాసిన రోజులెన్నో! కార్పెంటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించా. ఎవరూ అక్రమ కలప కొనవద్దని అవగాహన కల్పించా. వాళ్లూ అర్థంచేసుకున్నారు. ప్రస్తుతం.. దొడ్డిదారి రవాణా పూర్తిగా తగ్గిపోయింది.
తెలంగాణలో ప్రస్తుతం కోతుల బెడద ఎక్కువ. అడవుల్లో ఉండాల్సిన వానరాలు ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలను నానా తిప్పలు పెడుతున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. అసలు, వాటికి అడవుల్లో ఆహారం దొరికితే నివాసాల్లోకి ఎందుకు వస్తాయి? అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటిని మా రేంజ్లో పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాం. నీటికోసం ప్రత్యేకంగా గుంతలు తవ్వించాం. అడవుల్లో పండ్ల మొక్కలు నాటించాం. ఏడూళ్ల బయ్యారం రేంజ్ పరిధిలో 250 హెక్టార్లలో మొక్కలు పెంచుతున్నాం. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా చెక్డ్యాంలు నిర్మించేలా చూశాను. అడవిలో పుష్కలంగా తాగునీరు, పండ్లు ఉండటంతో కోతులు జనావాసాల్లోకి రావడం లేదు. ఐటీ ఉద్యోగంలో చేరి ఉంటే, ఇంత అందమైన జీవితాన్ని కోల్పోయేదాన్నేమో! సరదాకి కూడా హైదరాబాద్ తిరిగి వెళ్లాలని అనిపించడం లేదు. కాంక్రీట్ జంగిల్కు దూరంగా.. ఓ గుడిసె వేసుకుని జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని ఉంది! అడవితో, ప్రజలతో అంతలా మమేకం అయిపోయాను!
ఆకలితో ఉన్నవాళ్లకు ఓ ముద్ద అన్నం పెట్టడంలోని సంతృప్తి.. ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా పొందలేమని అనేవారు అమ్మానాన్న. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనసుకు నచ్చిన పనే చెయ్యాలని చెప్పేవారు. ఇద్దరూ ఉపాధ్యాయులే. మేం ఇద్దరం సంతానం. నేను, చెల్లి. పాఠాలతోపాటు సమాజాన్ని కూడా చదివించారు మా కన్నవాళ్లు. అడవిలో ఉద్యోగం అంటే మొక్కలను సంరక్షించమే కాదు, అక్కడి అమాయక ప్రజలనూ రక్షించాలి. అందుకే.. నాకు తోచిన సాయం చేస్తుంటా. ఆదివాసీ గూడాల్లో పిల్లలకు యూనిఫాం కుట్టించడం, కష్టాల్లో ఉన్నవాళ్లకు నిత్యావ సరాలు అందించడం.. నా బాధ్యతగా భావిస్తా. ఓసారి ఒక పాప నా దగ్గరికి వచ్చి.. ‘మేడం మీలా ఉండాలంటే ఏం చేయాలి?’ అని అడిగింది అమాయకంగా. మంచిగా చదువుకుంటే చాలని చెప్పాను.
…?సూర్యకిరణ్ తోగటి
ముంబై ఇండియన్స్ క్రికెటర్లు ఏం మాట్లాడాలన్నా డిసైడ్ చేయాల్సింది మన హైదరాబాదీ అమ్మాయే !!”
“ఐసిస్ దాడిలో రెండు కాళ్లు పోయినా.. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు!!”
“Jyoti | ఒకప్పుడు రోడ్లపై భిక్షమెత్తుకుంది.. ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజర్ అయ్యింది”
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”