మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. రోజురోజుకూ ఎముకలు క్షయమవుతూ, మళ్లీ భర్తీ అవుతూ ఉంటాయి. ముప్పై ఏండ్లు వచ్చే వరకు ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఎముకల్లో సాంద్రత తగ్గుతూ వస్తుంది. అది కాస్తా ‘ఆస్టియో పొరోసిస్’కు దారితీయవచ్చు. జీవన శైలి మార్పులతో ఈ సమస్యను అధిగమించడం సాధ్యమే.
వ్యాయామం
మెనోపాజ్ దశ దాటిన స్త్రీలు శరీరానికి పెద్దగా ఒత్తిడి కలిగించని వ్యాయామాలు చేయాలి. ఏరోబిక్స్, వాకింగ్, జాగింగ్ లాంటివి వారానికి రెండుమూడు సార్లు చేసినా ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
డ్యాన్స్
నృత్యం.. ఎముకల సాంద్రతను పెంచే వ్యాయామం. కండరాలను బలోపేతం చేయడం ద్వారా ఎముకల పటుత్వానికి దోహద పడుతుంది. కాబట్టి, ఇష్టమైన ఏదో ఒక నృత్యాన్ని సాధన చేయండి.
రన్నింగ్.. స్కిపింగ్
ఎముకల బలానికి పరుగు ఎంతో ఉపయోగకరం. రోజూ కొద్ది నిమిషాలు పరుగెత్తినా శరీరానికి చాలా మేలు జరుగుతుంది. రోజుకు రెండు పూటల 10 నుంచి 20 సార్లు స్కిపింగ్ చేసినా తుంటి ఎముకలు శక్తిమంతం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
చేపలు
భోజనంలో వివిధ రకాల చేపలను.. ప్రత్యేకించి విటమిన్-డి ఎక్కువగా ఉన్నవి చేర్చు కోవాలి. సాల్మన్, సార్డిన్, ట్యునా తదితర మత్స్యాలు విటమిన్-డి గనులు.
విటమిన్-డి
ఎముకల సాంద్రత పెరగడంలో విటమిన్-డి కీలకపాత్ర పోషిస్తుంది. ఇది తగినంత అందితేనే శరీరం క్యాల్షియంను శోషించుకుంటుంది. ఒకవేళ విటమిన్-డి సమృద్ధంగా ఉన్న ఆహారం అందుబాటులో లేకపోతే,
సప్లిమెంట్లు తీసుకోవాలి.
మొక్కల ప్రొటీన్లు
ఆహారంలో జంతు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా శరీరం క్యాల్షియంను కోల్పోతుంది. దీంతో ఎముకలు క్షయం చెందుతాయి. కాబట్టి, పళ్లెంలో జంతు ప్రొటీన్లకు బదులుగా మొక్కల నుంచి వచ్చే ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని వడ్డించుకోవాలి.
సమతులాహారం
పండ్లు, కూరగాయలు, ముడిధాన్యాలు, గింజలు, పాలు-పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, సముద్ర ఆహారం తీసుకోవాలి. వీటిలో.. కె, బి6, బి- 12 లాంటి అనేక విటమిన్లు; మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ ఉంటాయి. అవి ఎముకల సాంద్రతను పెంపొందిస్తాయి.