Folk Singer Anjali | పేదరికం పాటను పరిచయం చేసింది. ఆ పాట పరిస్థితిని చక్కబెట్టింది. ఆగిపోయిందనుకున్న చదువును పట్టాలకెక్కించింది. తోబుట్టువులకు తోడుగా నిలిచేట్లు చేసింది. అమ్మ ప్రేమకు అర్థం చెప్పింది. నాయిన త్యాగానికి విలువను తెలిపింది. ఆశలు సన్నగిల్లినా ఆశయం దృఢంగానే ఉంటుందనే నమ్మకాన్ని కలిగించిన పాటమ్మ పల్లెబిడ్డ నెత్తి అంజలి పాటల ముచ్చట..
మాది వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లి. చిన్నప్పుడే పాటల మీద మనసు మళ్లింది. కళా వారసత్వమేదీ లేదు. ఊర్లో ఏదైనా కార్యక్రమం జరిగితే అందరికంటే ముందే ఉరికేదాన్ని. కొత్త పాట నేర్చుకుంటున్నననే హుషారు ఉండేది. పేద కుటుంబంలో పుట్టినా నాకు పెద్దపెద్ద ఆశయాలు ఉండేవి. అమ్మ చెన్నమ్మ, నాయిన అంజిలయ్య కూలీ పనిచేస్తరు. వాళ్లకో పండగ ఉండదు. పబ్బం ఉండదు. పొద్దుగాల్నే పనికివొయ్యి మల్లా పొద్దుమూకినంకనే ఇంటి కొస్తరు. వాళ్ల కష్టం చూసి నాకు బాధైతుండె. ఇద్దరూ చదువు విలువ తెలిసినోళ్లే. కానీ పుస్తకాలు కొనియ్యనీకె కూడా పైసలు లేకుంటుండె. ఎల్లీ ఎల్లని పరిస్థితుల వల్ల నా ఆశలు, ఆశయాలు సన్నగిల్లుతున్నట్లు అనిపించేది. లక్ష్యం గుర్తుకొచ్చినప్పుడల్లా పాటలు పాడుకునేదాన్ని. పాట నాకు ఓదార్పునిచ్చింది.
తెలంగాణ ఉద్యమం తర్వాత ఖాళీగా ఉండాల్సి వచ్చింది. పెద్ద ఆశయం ఉన్నా గానీ పేదరికాన్ని జయించలేకపోయిన. ఏడో తరగతితోనే ఆగిపోయే చదువును కిందామీదా పడి ఇంటర్ వరకు తీసుకొచ్చిన. అమ్మానాన్నల కష్టాన్ని చూడలేక అంతటితో ఆపేసిన. నా అనుభవంలోంచి పాటలు రాయడం మొదలువెట్టిన. ఊరూరా తిరుగుతూ పల్లెపాటలను సేకరించే పనిలో మునిగి పోయిన. ఇది నాకు కొత్త జీవితమసొంటిది. చదువు మానేసి ఇంట్లో కూర్చోలేను కాబట్టి పార్ట్ టైమ్ జాబ్ చేసేదాన్ని. నాకు జరిగిన నష్టం తమ్ముడు, చెల్లెకు జరగొద్దని హైదరాబాద్కు మారిపోయిన. హాస్టల్లో ఉంటూ ఓ ఐస్క్రీమ్ పార్లర్లో పనికి కుదిరిన. తమ్ముడిని, చెల్లెను పెద్ద చదువులు చదివిస్తున్న. నాకు ఇష్టమైన పాటలనూ పాడుతున్న. ఆగిపోయిన నా చదువును పూర్తిచేసిన. పల్లె, పల్లె మనుషులే ఇతివృత్తాలుగా ఎన్నో పాటలు రాసిన. తొలిసారిగా నేను అమ్మ గురించి రాసిన ‘ఓ మాతృమూర్తీ నీకు వందనం.. జగతికే జన్మనిచ్చే తల్లీ వందనం’ పాట ఎంతోమందిని కదిలించింది.
నా గొంతు, పాట నచ్చడంతో ఒక యూట్యూబ్ చానెల్లో అవకాశం దొరికింది. రికార్డింగ్ కోసం అమీర్పేటలోని స్టూడియోకు వెళ్లిన. అక్కడ ‘మా ఊరి జానపదం’ చానెల్ వాళ్లు కూడా వేరే పాట రికార్డింగ్ కోసం వచ్చిండ్రు. ‘చాలా చక్కగా పాడు తున్నవ్రా.. మా చానెల్లో పాడుతవా’ అన్నరు. ఏమాత్రం ఆలోచించకుండా ‘ఓకే అన్నా’ అని చెప్పిన. బతుకమ్మ, బోనాలు, ఉగాది.. ప్రతీ సీజన్లోనూ అచ్చమైన పల్లెపదాలు పాడుతున్న. తాజాగా ‘గుడిసెలున్నా ఓ గుడ్డి ముసలీ.. గడ్డ పారన్నా ఎదురుగ తేవే’ పాట విడుదలైంది. వీటన్నిటిలో ‘గలుకు గులుకు గజ్జెల కటారు చేతులుండాలె..’ పాట నాకు గుర్తింపును, పేరును తీసు కొచ్చింది. ఉప్పుగూడ శివన్న, ఘన్శ్యామ్ మల్లన్న చాలా ఎంకరేజ్ చేసిండ్రు. శ్రీరామనవమి సందర్భంగా పాడిన ‘బిర్జూలింగం కాయ బిల్లాలొడ్డానం ఓనా సీతమ్మా’ పాట జనంలో మార్మోగుతున్నది. 2.5 లక్షల వ్యూస్ దాటి దూసుకెళ్తున్నది. జానపదాన్ని బతికించే స్థాయి దాటిపోయింది. ఇప్పుడు మా అసొంటోళ్లను జానపదమే బతికిస్తున్నది. కాబట్టి జానపదానికి వన్నె తెచ్చే పాటలే పాడాలనుకుంటున్న.
బడిల ఉండంగనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. కిష్టాపూర్ రాజన్న నన్ను ఉద్యమంలోకి తీసుకెళ్లిండు. మల్లేపల్లి నుంచి మొదలువెట్టిన నా పాటల ప్రయాణం రాష్ట్రస్థాయి వరకు కొనసాగింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన అనేక భారీ బహిరంగ సభలలో, ధూమ్ధామ్లలో నా పదం వినిపించింది. విమలక్కతో కలిసి తెలంగాణలో అన్ని జిల్లాలు తిరిగిన. నేను ఏ వేదికపైన గళమెత్తినా ‘ఆడుదాం డప్పుల్లా దరువెయ్రా.. తల్లీ తెలంగాణ పాట పాడరా’ పాట పాడేదాన్ని. జనాలు కూడా నా నుంచి ఈ పాటనే కోరుకునేది.
– దాయి శ్రీశైలం
Mukunda | మంచి ఫోక్ సింగర్ కావాలన్నదే లక్ష్యం.. పెద్ద సినిమాకు పాడటం నా డ్రీమ్”
“Telu Vijaya | రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది”
“Marupaka Sanjana | మల్లెమొగ్గలా తీరు.. రాధమ్మ బంగారు బొమ్మా!”
“Janaki Srinivas | మూడో తరగతిలో పాడిన పాట ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది”
అమెరికాలో సెటిలయ్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ”