Narsetti Mukunda | పొద్దున్నే అమ్మమ్మ టేప్ రికార్డర్ ఆన్ చేసేది. అందరి ఇండ్లలో సుప్రభాతం వినిపిస్తే ఆ ఇంట్లో జానపదం మారుమోగేది. ఆ ఇష్టమే ఆమెను పల్లెపాటల వైపు మళ్లించింది. జానపద గాయనిని చేసింది. పట్నంలో పుట్టినా పల్లె సంస్కృతిని ఇష్టపడేలా మార్చింది. జానపద పాటల సవ్వడిలో తనదైన ప్రత్యేకతను చాటుతున్న నర్సెట్టి ముకుంద పాటల ముచ్చట..
మా తాతలు ఒగ్గుకథలో ప్రవీణులు. ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే మా తాతవాళ్లే కథ చెప్తుండె. అట్లనే మా నాన్న ఆంజనేయులుకు కూడా కళలపై అవగాహన ఉంది. వీళ్లంతా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి బయటికి రాలేదుగానీ, ప్రయత్నించి ఉంటే మంచి గుర్తింపు పొందేటోళ్లు. మా అమ్మపేరు యాదమ్మ. నా పాటకు తొలి శ్రోత. మాది సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్.
ఊళ్లో ఉపాధి లేక నాన్న ఇరవై ఏండ్ల కిందట సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లి కారు డ్రైవర్గా సెటిలైండు. నేను పుట్టినంక సూడనీకె వచ్చుడు పోవుడు ఇబ్బందైతుందని మమ్మల్ని సిటీకి తీస్కపోయిండు. మేం పార్సీగుట్టలో ఉండేటోల్లం. నేను ఎక్కువగా అమ్మమ్మ దగ్గర పెరిగినా. అక్కడ ప్రతీ ఇంట్లో టేప్రికార్డర్ ఉండేది. అందరూ సుప్రభాత గీతాల క్యాసెట్లేసి వింటుంటే, మావోళ్లు మాత్రం జానపద పాటలు పెడ్తుండె. అట్లా చిన్నతనంలనే సినిమా పాటలు కాకుండా, పల్లె పాటలు వినుడు మొదలైంది. నాకంటూ ఇష్టమైన కొన్ని స్పెషల్ ఫోక్ సాంగ్స్ ఉండేవి. ‘పున్నాపు వెన్నేలా వలలో పూసీ కాయంగా వలలో.. అమాస వెన్నేలా వలలో ఆగికాయంగా’ వంటి పాటలు నా మనసులో మెదులుతుండె. దినాం ఒక కొత్తపాట ప్రాక్టీస్ చేసేదాన్ని.
నేనప్పుడు పద్మారావు నగర్లోని స్కూల్లో చదువుతున్న. రిపబ్లిక్డే అనుకుంట. స్టేజీ మీద పాడటం అదే మొదటిసారి. ‘వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా’ పాట పాడిన. ప్రిన్సిపల్ సార్ నా పాటను మెచ్చుకున్నరు. అమ్మానాన్న కూడా ఆ కార్యక్రమానికి వచ్చిండ్రు. ‘నువ్వు పెద్ద సింగర్ కావాలె బిడ్డా’ అన్నది అమ్మ. నాన్నయితే నేను ఏ పాట ఎంచుకోవాల్నో, దేన్ని ఏ సందర్భంలో పాడాల్నో చెప్తుండె. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించిండ్రు. మా స్కూల్ నుంచి నన్ను పంపిండ్రు. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ స్మితా సబర్వాల్ మేడమ్. వందలమంది ఉన్నరు. నా పాట ద్వారా మహిళలందర్నీ మెప్పించాలె అనుకున్న. ఎలాంటి బెరుకూ లేకుండా ‘కమ్మనైన అమ్మపాట వింటే ఎంత మధురమో.. మనసుకు కాదు మరువ తరమో’ పాట పాడిన. స్మితా సబర్వాల్ మేడం నా పాటకు ఫిదా అయ్యింది. ‘మీ అమ్మ ఏం చేస్తది’ అని అడిగింది. ‘ఇప్పుడు నాతో వచ్చింది మేడమ్’ అని చెప్పిన. ‘యాదమ్మ ఎక్కడున్నా స్టేజీమీదికి రావాలె’ అని స్మితా మేడమ్ అనౌన్స్ చేసి అమ్మ చేతుల మీదుగా నాకు మెమెంటో ఇప్పించింది. శాలువాతో సన్మానించింది. నాలో పాడాలనే తపనను రెట్టింపు చేసిన సన్నివేశం అది.
ఇంటర్లో ప్రిన్సిపల్ మేడమ్ నా పాటలు నచ్చి ఒక టర్మ్ మొత్తం ఫీజు తానే చెల్లించింది. ఇక యూ ట్యూబ్లో పాడటం నా ముందున్న లక్ష్యం. స్టూడియోస్లో, చానెళ్లలో డెమో వినిపించిన. అందరూ అవకాశం ఇస్తమనే చెప్పిండ్రు. ఆర్నెల్లు దాటింది. ఎవరూ పిలవలేదు. ‘తెలంగాణ టాలెంట్’ దినేశన్నను కలిసిన. అన్న ఒక ఇంటర్వ్యూ తీసుకున్నడు. మాట్ల తిరుపతి సార్ను కలిసిన. ఒక పాట పాడి వినిపించిన. బాగుందన్నడు. టీ-ట్యూన్స్ చానెల్లో ‘మక్కాల రాసి మీద లేడేమె యెజమాను’ పాట పాడటమే కాదు యాక్టింగ్ చేసేందుకూ అవకాశం ఇచ్చిండు. ఆ పాట ఊహించిన దానికంటే ఎక్కువ రీచ్ అయ్యింది. దీంతో అవకాశాలు పెరిగినయి. ఇప్పటివరకు 15 పాటల దాకా పాడిన. అన్నీ బాగొచ్చినయి.
‘ఉరుముల రమ్మంటినే.. మెరుపుల రమ్మంటినే’ పాట ప్రోమో నన్ను ఇంకో మెట్టుకు తీస్కపోయింది. త్వరలో సైటీవీలో పూర్తి పాట వస్తది. రీసెంట్గా పాడిన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలిపరమానంద రామ గోవిందా’ జనాల్లోకి బాగా వెళ్లింది. ట్రెండింగ్లో టాప్ప్లేస్లో ఉంది. నక్క శ్రీకాంతన్న రాసిన ఈ పాట ‘పండుకో మాతల్లీ పరుపుల్ల మీదా జోజో’ అంటూ సాగుతుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా. మంచి ఫోక్ సింగర్ కావాలన్నదే లక్ష్యం. ఏదైనా పెద్ద సినిమాకు పాడటం నా డ్రీమ్. సిటీలో పెరిగినా పల్లెకల్చర్నే ఇష్టపడత. అంతా పాప్ వెంట పరుగులు తీస్తుంటే, నేను మాత్రం ఫోక్సాంగ్స్నే లక్ష్యంగా పెట్టుకున్న. కొవిడ్ వల్ల సిటీకి టాటా చెప్పి ఊరికొచ్చేసినం.
..? దాయి శ్రీశైలం
Telu Vijaya | రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది”
Marupaka Sanjana | మల్లెమొగ్గలా తీరు.. రాధమ్మ బంగారు బొమ్మా!”
Janaki Srinivas | మూడో తరగతిలో పాడిన పాట ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది”
అమెరికాలో సెటిలయ్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ”