హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరీ ( Electricity Consumers ) పై పెను భారం పడే పథకానికి ప్రభుత్వం అంగీకరించడం దారుణమని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ( Former Minister Jagadish Reddy) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేబినెట్లో ఆర్డీఎస్ఎస్( RDSS ) పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ కేంద్ర పథకాన్ని తన గొంతులో ప్రాణం ఉండగా ఒప్పుకునేది లేదని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అడ్డుకున్నాడని తెలిపారు. కేంద్రం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చిన అంగీకరించలేదని వెల్లడించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఆర్డీఎస్ఎస్ (Revamped Distribution Sector Scheme) కింద ఇళ్లకు, వ్యవసాయ మోటార్లకు పెట్టిన స్మార్ట్ మీటర్లను అక్కడి ప్రజలు పీకేసి తగలబెడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే స్మార్ట్ మీటర్లను తెచ్చి తెలంగాణ ప్రజల నెత్తిన పెట్టాలని కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆరోపించారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ల వద్దనే స్మార్ట్ మీటర్లు పెడుతామని అంటూనే ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెట్టే అవకాశముందని వివరించారు.
పేదలను ఉద్దరించేందుకు ఆర్డీఎస్ఎస్ కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మంచినీళ్ల నల్లాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతారని తెలిపారు. విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ వల్ల రైతులపై, వినియోగదారులపై పెనుభారం పడుతుందని అన్నారు.
కాంగ్రెస్ ఒత్తిళ్లతో యూపీ ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ను ఉపసంహరించుకోగా అదే కాంగ్రెస్ తెలంగాణలో అమలుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ఎస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రైతులు, వినియోగదారులంతా సంఘటితమై ప్రభుత్వంపై ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.