నవరాత్రి వేడుకల్లో జగన్మాత అలంకరణలపైనే అందరి దృష్టీ. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని, రోజుకో రంగు వస్త్రంలో ముస్తాబై దర్శించుకునే సంప్రదాయమూ ఉంది.
మొదటి రోజు: పసుపు వర్ణం
నవరాత్రుల్లో మొదటిరోజు శైలపుత్రిగా కొలుస్తారు. ప్రకృతి శక్తికి ప్రతిరూపమైన శైలపుత్రి అందరికీ సంతోషాన్ని, ఉల్లాసాన్ని అందిస్తుంది. అమ్మవారిని పచ్చని పూలతో అర్చించడమే కాదు, ఆ రోజు హరిత వర్ణ వస్ర్తాలూ ధరించాలని చెబుతారు.
రెండో రోజు : హరిత శోభితం
దుర్గ్గాదేవి రెండో రోజు అవతారం బ్రహ్మచారిణి. ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే తల్లి భక్తుల కష్టాలను దూరం చేస్తుంది. ప్రకృతి మాతగా భావించే బ్రహ్మచారిణికి ఇష్టమైన వర్ణం హరితం. అందుకే, ఈ రోజు ఆకుపచ్చ దుస్తులు ధరించాలన్నారు.
మూడో రోజు: బూడిద రంగు
నేడు అమ్మవారు చంద్రఘంటగా అనుగ్రహిస్తుంది. ధర్మ పరిరక్షణ కోసం దశ హస్తాలతో ఆవిర్భవించి, దుష్టులను రూపు
మాపింది చంద్రఘంట. ఆ తల్లి శక్తియుక్తులకు ప్రతీకగా మూడోనాడు బూడిద రంగు దుస్తులు వేసుకోవాలని సూచించారు.
నాలుగో రోజు : నారింజ వర్ణం
చతుర్థి రోజున దుర్గాదేవి కూష్మాండ అవతారంలో దర్శనమిస్తుంది. దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ తల్లి విశ్వంలోని చీకటినంతా పారదోలిందట. అగ్నిని పోలిన నారింజ రంగు అంటే అమ్మవారికి ఇష్టం. చతుర్థి రోజు ఆ రంగు దుస్తులు ధరించడం మేలు.
ఐదో రోజు: ధవళ కాంతులు
దుర్గామాతను స్కందమాతగా పూజిస్తారు. సింహవాహనంపై స్వారీ చేస్తూ, తన ఒడిలో కార్తికేయుణ్ని పెట్టుకొని బిడ్డలను అనుగ్రహిస్తుంది. తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైంది విశ్వంలోనే లేదు. ఆ స్వచ్ఛతకు ప్రతీకగా తెలుపు రంగు దుస్తులు ధరించాలి.
ఆరో రోజు: ఎరుపు మెరుపులు
ఈ రోజు కాత్యాయనిగా కనువిందు చేస్తుంది. అసురులను సంహరిస్తూ ఉగ్రమూర్తిగా చెలరేగిపోతున్న తల్లి ఆవేశానికి ప్రతీకగా ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలని చెబుతారు.
ఏడో రోజు : నీలం రంగు
జగన్మాత కాళరాత్రిగా అవతరించిన ఏడో రోజుకు ఎన్నో ప్రత్యేకతలు. నిశిరాత్రి వేళ.. గార్ధ్దభ వాహనంపై భయానక రూపంతో వచ్చి రాక్షసులను సంహరించింది కాళరాత్రి. నీలం రంగు రాత్రికి సూచన. అపారమైన శక్తికి ప్రతీక. అందుకే, అమ్మ కాళ
రాత్రిగా ఆవిర్భవించిన రోజున.. నీలం రంగు దుస్తులు ధరించాలని చెబుతారు.
ఎనిమిదో రోజు: గులాబి రంగు
దుర్గాష్టమి రోజు గౌరీదేవిగా కొలుస్తారు. ప్రేమకు ప్రతీకగా దర్శనమిచ్చే తల్లి భక్తులను నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది. కాబట్టే, గులాబి రంగు దుస్తులు ధరిస్తారు భక్తులు.
తొమ్మిదో రోజు : ఊదా రంగు
మహర్నవమి నాడు అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. భక్తుల లక్ష్యాలను తీర్చేందుకు ఆమె సిద్ధంగా ఉంటుంది. అందుకే లక్ష్యాన్ని సూచించే ఊదారంగు బట్టలు వేసుకుంటే సిద్ధిధాత్రి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.