Bhagawani devi | పిల్లల పిల్లలకు కథలు చెబుతూ కృష్ణారామా అని కాలం వెళ్లదీసే బామ్మలు ఇంటికొకరు ఉంటారు. కానీ, తొంభై ఏండ్ల వయసులోనూ వరుసపెట్టి పతకాలు సాధిస్తూ, తనకింకా వయసైపోలేదని చాటుతున్నది హరియాణాకు చెందిన భగవానీ దేవి. ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో, చెన్నై నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగు పందెంతోపాటు షాట్పుట్, జావెలిన్ త్రోలో మూడు బంగారు పతకాలను సాధించిన ఈ బామ్మ.. ఫిన్లాండ్లో జరిగిన ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్-2022కూ ఎంపికైంది.
ఇక్కడ కూడా సీనియర్ సిటిజన్స్ విభాగంలో 100 మీటర్ల పరుగును 24.74 సెకెన్లలో పూర్తిచేసి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒక బంగారు పతకం, రెండు కాంస్యాలు తన ఖాతాలో వేసుకున్నది. అలా, టోర్నీలో మొత్తం మూడు పతకాలను సొంతం చేసుకున్నది. ‘స్ప్రింటర్ దీదీ’గా ప్రసిద్ధురాలైన భగవానీదేవి తండ్రి కూడా చేయి తిరిగిన ఆటగాడే. ‘మా నాన్న స్ఫూర్తితోనే ఈ వయసులోనూ క్రీడల్లో పాల్గొంటున్నా’ అని చెబుతున్నది భగవానీ బామ్మ. స్వర్ణ పతకాన్ని మెడలో ధరించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఈ బామ్మ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నది.
“ఏడు పదుల వయసులో పెయింటింగ్ నేర్చుకుని అవార్డులు అందుకుంటున్న బామ్మ”