నీలగిరి, జూలై 2 : నల్లగొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున భాస్కర్ టాకీస్, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించి చెత్త తీసుకెళ్లే ట్రాలీలు, ట్రాక్టర్లపై కప్పేందుకు టార్పాలిన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 2వ దశ ఎస్టీపీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం పట్టణ ప్రగతిలో భాగంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఖయ్యూంబేగ్, పున్న గణేశ్, పబ్బు సందీప్, డీఈఈ వెంకన్న, టీఎంసీ శ్రీనివాస్, కొమ్ము ప్రసాద్, నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
పల్లెలు మెరవాలి : జేసీ
నార్కట్పల్లి : పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు మెరవాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గోపలాయపల్లి, ఏనుగులదోరి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి మొక్కలు నాటారు. ఎంపీడీఓ సాంబశివరావు, సర్పంచులు భద్రాచలం, మహేశ్వరం సతీశ్, ఎంపీటీసీలు రాజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో సస్యశ్యామలం: ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి
నల్లగొండ రూరల్ : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అన్నారు. గుండ్లపల్లి గ్రామంలో పల్లెప్రగతి గ్రామస్థాయి బృందంతో కలిసి పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి వేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ మాధవరెడ్డి, సర్పంచ్ సరిత, శ్రీనాథ్, గ్రామ ప్రత్యేకాధికారి అనంతరెడ్డి ఉన్నారు.
ఎస్ఐ చొరవతో చెట్ల తొలగింపు
కనగల్ : మండలంలోని తేలకంటిగూడెంలో పల్లె ప్రగతిలో భాగంగా మండల ప్రత్యేకాధికారి సల్మా, ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. చండూరు-కనగల్ ప్రధాన రహదారిపై బచ్చన్నగూడెం స్టేజీ వద్ద రోడ్డుకు ఇరువైపులా భారీగా పెరిగిన ముళ్లపొదలను ఎస్ఐ చొరవ తీసుకుని శుభ్రం చేయించారు. కురంపల్లిలో రోడ్ల వెంట పెరిగిన చెట్లను తొలగించారు.
శాలిగౌరారం : మండలంలోని రామాంజపురం గ్రామంలో సర్పంచ్ జటంగి శంకర్ డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఉప సర్పంచ్ అమరేందర్రెడ్డి, కార్యదర్శి విజయ్కుమార్ ఉన్నారు.
చండూరు : పట్టణ ప్రగతి పనులు చండూరు మున్సిపాలిటీలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకటో వార్డులో కౌన్సిలర్ కోడి వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. రెండో వార్డులో కౌన్సిలర్ మంచుకొండ కీర్తి సంజయ్ జేసీబీతో కంపచెట్లను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టారు. కమిషనర్ వెంకట్రామ్, కౌన్సిలర్లు కొన్రెడ్డి యాదయ్య, చిలుకూరి రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.
మర్రిగూడ : మర్రిగూడ, వట్టిపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాల్లో అధికారులు ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో విద్యుత్ వైర్లు లూజ్గా ఉన్నచోట స్తంభాలు వేశారు. ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి గంగయ్య, ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, ఎంపీఓ ఝాన్సీరెడ్డి, సర్పంచ్ యాదయ్య పాల్గొన్నారు.
మునుగోడు : మండలలోని సింగారం, రత్తిపల్లి, గంగోరిగూడెం, పులిపలుపుల, గూడపూర్ గ్రామాలను మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబు సందర్శించారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, అధికారులు పారిశుధ్య పనులు చేపట్టారు. ఎంపీడీఓ యాకూబ్నాయక్, ఎంపీఓ సుమలత, ఏపీఓ శ్రీనయ్య, సర్పంచులు పరమేశ్, నర్సింహారెడ్డి, పారిజాత, మారయ్య, జ్యోతి పాల్గొన్నారు.
కేతేపల్లి : గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను సమర్థవంతంగా చేపట్టాలని జడ్పీ డిప్యూటీ సీఈఓ, మండల ప్రత్యేకాధికారి కాంతమ్మ సూచించారు. ఉప్పలపహాడ్, కొప్పోలు గ్రామాల్లో పనులను పరిశీలించి హరితహారం లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఆమె వెంట ఎంపీపీ శేఖర్, ఏపీఓ కె.రామ్మోహన్, ట్రాన్స్కో ఏఈ గాబ్రియేల్, సర్పంచులు శశికళ, అశ్విని, కార్యదర్శులు దివ్య, విజయ పాల్గొన్నారు.