ఆత్మ, పరమాత్మ రెండు ఒకటేనా లేక వేర్వేరా? ఈ కన్ఫ్యూషన్ ఎలా ఏర్పడింది?
ఆత్మ, పరమాత్మ ఎప్పటికీ వేర్వేరే. అవి ఏనాడూ ఒకటయ్యే అవకాశం లేదు. ఇది అద్భుతమైన గీతాజ్ఞానం. ‘ముండక’, శ్వేతాశ్వతర’ వంటి ఉపనిషత్తులూ దీనినే బోధించాయి. ‘భగవద్గీత’ 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం, 13వ అధ్యాయంలో పరమాత్మతోపాటు మరికొంత ఆత్మజ్ఞాన విశేషాలు ఉన్నాయి. ఆత్మ వ్యక్తిగతమైంది. అంటే, ఒకే శరీరానికి పరిమితమై ఉండేది. కానీ, పరమాత్మ అన్ని దేహాలలో విలసితమై ఉండేది. అందుకే, ‘ఆత్మను క్షేత్రజ్ఞుడని, పరమాత్ముని పరమ క్షేత్రజ్ఞుడని’ భగవద్గీత పలికింది.
‘ఆత్మ- పరమాత్మ రెండు ఒకే దేహంలో ఎందుకు ఉన్నాయి?’ అంటే, ఆత్మ శాశ్వతంగా ఒకే దేహంలో ఉండదు. కర్మఫలం తీరగానే (కర్మానుసారం) వేరొక దేహంలోకి వెళ్ళిపోతుంది. అలా, వెళ్ళాల్సిన దేహంలోకి దానిని చేర్చే కార్యాన్ని చేసేది పరమాత్మయే. ‘పిల్లవాడిని తండ్రి ఎక్కడకు కోరితే అక్కడికి సురక్షితంగా తీసికొని వెళ్లినట్లు’. ఆధ్యాత్మికులను మూడు (జ్ఞానులు, యోగులు, భక్తులు) రకాలుగా విభజిస్తే, ‘జ్ఞానుల’ది సర్వవ్యాప్తమైన ‘నిరాకార బ్రహ్మతత్తం. ఇదే ‘అద్వైతం’. వీళ్లే ‘ఆత్మ, పరమాత్మ ఏకమని (ఒకటేనని)’ అంటారు. ‘ఆత్మే పరమాత్మ’ అనికూడా వారంటారు. కానీ, యోగులు తమ హృదయంలో స్థిరమై ఉండే ‘పరమాత్మ’ ధ్యానంలోనే ఉంటారు. వారు ‘ఆత్మ’ను ఏ లోకానికైనా చేర్చే సామర్థ్యాన్నీ కలిగి ఉంటారు. సంపూర్ణ శాస్ర్తావగాహన కలిగిన భక్తులు షడ్విభూతి పూర్ణుడైన భగవంతుని సేవలో ఉంటారు. నిరాకార బ్రహ్మతత్త్వం రహస్య జ్ఞానంగాను, పరమాత్మ తత్త్వం రహస్యతర జ్ఞానంగాను, భగవత్తత్త్వం రహస్యతమ జ్ఞానంగాను ‘భగవద్గీత’ అంతిమంగా ప్రబోధించింది.
డా॥ వైష్ణవాంఘ్రి
సేవకదాస్
98219 14642