భువనగిరి అర్బన్, మే 26: జిల్లాలో రెండో డోసు టీకా పంపిణీ ముమ్మరంగా చేపట్టాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. కొవిడ్ నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జియో మీట్ యాప్ ద్వారా ఆయన బుధవారం జడ్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పీహెచ్సీలల్లో కొవిడ్ టెస్టులు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకునేలా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలన్నారు. కరోనా కట్టడిపై పట్టణ, గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో సాంబశివరావుకు సూచించారు. కరోనా బాధితులు సరైన సమయంలో మందులు వాడుతున్నారా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకునేలా వైద్యసిబ్బందికి సూచించాలన్నారు. రెండోవిడుత జ్వర సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కరోనా బాధితులకు ధైర్యం చెప్పి సరైన సమయంలో మందులు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలన్నారు. జియో మీట్లో కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, సీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాస్రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో-ఆప్షన్ సభ్యులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.