ఆలేరు టౌన్, మే 16 : పెండ్లిళ్లకు 40 మంది అతిథులకు మించి హాజరు కావొద్దని, దీనికి తహసీల్దార్ అనుమతి తప్పనిసరి చేయడంతో పాటు వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పా టించాలని అధికారులు పేర్కొంటున్నారు. పెండ్లి.. జీవితంలో మధురమైన ఘట్టం. వధూవరులు ఈ వేడుకకు ఎన్నో కలలు కంటారు. గత ఏడాది కరోనా కారణంగా లాక్డౌన్ విధించా రు. అప్పట్లో ఎన్నో పెండ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. శుభకార్యాలు, వివాహాలు చేసుకునే వారు ఆందోళనకు గురవుతున్నారు. వివాహాలకు, ఇతర వేడుకలకు కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అతిథులు 40 మంది కి మించవద్దని అధికారులు పేర్కొంటున్నారు. పెండ్లి చేసుకోవాలంటే కచ్చితంగా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు. వివాహం జరిగే ప్రదేశం, పెండ్లి తేదీ, సమయం తెలియజేస్తూ దరఖాస్తును అందజేయాలి.
పెండ్లి కూతురు, పెండ్లి కొడుకుతోపాటు వారి తల్లిదండ్రులు ప్రమాణ పత్రం (అఫిడవిట్) వారి ఆధార్కార్డుల జిరాక్స్లు, లగ్న పత్రిక సమర్పించాలి. అంతే కాకుండా పెండ్లి చేసుకునే వారు విధిగా నిబంధనలు పాటించాలి. పెండ్లి కూతురు, పెండ్లి కుమారుడు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ వచ్చిన రిపోర్టును చూపించాలి. వివాహ సమయంలో భౌతికదూరం పాటించడంతోపాటు మాస్కులు, శానిటైజర్లు వినియోగించాల్సి ఉం టుంది. వివాహం ముగిసేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫంక్షన్హాళ్లలో కరోనా కేసులు అధికమయ్యే అవకా శం ఉన్నది. అందుకే ఇండ్ల వద్దనే అతికొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్యనే వివాహాలు చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు.
పెండ్లి జరిగే చోట అతిథులంతా భౌతికదూరం పా టించాలి. ప్రవేశ ద్వారం వద్దనే చేతులు శుభ్రం చేసుకునేందు కు వీలుగా శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలి. భోజనాలు చేసే సమయంలో, వధూవరులను ఆశీర్వదించే సమయంలోనూ భౌతికదూరం పాటించాలి. అయితే కరోనా నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో వివాహాలు జరుగుతున్నప్పటికీ మరికొందరు వాయిదా వేసుకుంటున్నారు. అలాగే కొద్దిమంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్న తరువాత చట్టబద్ధం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. అయితే కొన్నిచోట్ల పెండ్లిళ్లకు సిద్ధమయ్యే వారు హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా రూ.లక్ష ల్లో ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఒకటయ్యేందుకు సిద్ధమవుతున్నారు.