పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులు
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
రూ. 70లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం
చెత్త సేకరణతో మెరుగుపడిన పారిశుధ్యం
అన్నివసతులతో వైకుంఠధామం
గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా
బొమ్మలరామారం, మే 9 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి ద్వారా మండలంలోని మర్యాల అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మండలంలోని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేకశ్రద్ధతో పల్లెప్రగతి పనులు త్వరగా పూర్తిచేయించారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుఠధామం, వర్మీకంపోస్ట్ షెడ్, డంపింగ్యార్డు పనులు పూర్తి చేశారు.గ్రామంలో జనాభా 2750 మంది, ఓటర్లు 1900 మంది ఉన్నారు. మూడు మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. 300 పాత ఇండ్లను కూల్చివేసి రెండు పాత బావులను పూడ్చివేశారు. గ్రామంలోని వీధుల్లో సీసీరోడ్లు నిర్మించారు. అండర్ గ్రౌండ్ డైనేజీ పనులు పూర్తి చేశారు. గ్రామంలోని వీధులను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేస్తూ చెత్తను డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు.
రూ. కోటి 50లక్షలతో అభివృద్ధి పనులు
రెండు సంవత్సరాల కాలంలో మర్యాల గ్రామ పంచాయతీకి ప్రభుత్వం రూకోటి 50 లక్షలు మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ 8లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ 31లక్షలతో రైతువేదిక, రూ. 22లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. రూ.లక్షతో నర్సరీని ఏర్పాటు చేశారు. రూ2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ15లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. రూ 10లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు.గ్రామంలో రూ.10 లక్షలతో185 ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మె ల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో హెచ్ఎండీఏ నిధులు రూ40లక్షలు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సహకారంతో రూ.10లక్షలు, 20లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లను నిర్మించారు. శామీర్పేట వాగు నుంచి మాచన్పల్లి మీదుగా మర్యాలకు వచ్చే రాచకాల్వ ను రూ5లక్షల ఆర్అండ్బీ నిధులతో పునరుద్ధరించారు.
ఆకట్టుకొంటున్న పల్లె ప్రకృతి వనం
గ్రామంలోఎకరం 20గుంటల విస్తీర్ణంలో ఆరు వేల మొక్కలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకొంటున్నది. గ్రామస్తులు ఉదయం వాకింగ్ చేయడం కోసం వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయడంతో పాటు మొక్కల సంరక్షణకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పూలమొక్కలు,పండ్ల మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రజల సహకారంతోనే అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు నిర్వహిస్తాం. వైకుంఠధామం,పల్లె ప్రకృతి వనం నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. కరోనా కట్టడికి గ్రామంలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి బారిన పడివారికి ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం.
-కుర్మిండ్ల దామోదర్గౌడ్, సర్పంచ్, మర్యాల
డంపింగ్యార్డుకు చెత్త తరలింపు
గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు.పచ్చదనం, పరిశుభ్రత విషయంలో మార్పు కనిపిస్తున్నది. డంపింగ్యార్డుకు చెత్త తరలిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నది.రైతు వేదిక ఏర్పాటు చేశారు.
-ఈదులకంటి రాజిరెడ్డి, గ్రామస్తుడు
తీరిన వైకుంఠధామం సమస్య
గ్రామంలో వైకుంఠధామం సమస్య తీరింది. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామం నిర్మిండంతో పాటు అన్ని సౌకర్యాలతో స్నానపు గదులు నిర్మించారు.వైకుంఠధామం నిర్మాణంతో సమస్య సమసిపోయింది.