ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్య
చిన్నారులను ఆదుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు పిలుపు
పిల్లల చదువు బాధ్యతలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ
ఇల్లెందు, జూన్ 10: అభాగ్యుల కష్టాలను ట్విట్టర్ ద్వారా తెలుసుకుని యువనేత, మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఇల్లెందులో ఓ దంపతుల జంట చనిపోవడంతో అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారుల గురించి గురువారం ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే వారిని ఆదుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియను కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. చిన్నారులు ఉంటున్న ఇంటికి వెళ్లి వారికి భరోసా కల్పించారు.
ఇల్లెందు 17 వార్డులో నివసిస్తున్న బట్టు గణేశ్ (32), బట్టు స్రవంతి (30)లది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు కృశన్కు ఏడేళ్లు. కుమార్తె హేమతేజకు ఐదేళ్లు. చిన్న ప్రైవేటు సంస్థల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గణేశ్ మూడేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. గతేడాది మృతిచెందాడు. ఆ తర్వాత భార్య స్రవంతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తున్నది. కరోనా సెకండ్ వేవ్లో ఆమెకి పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. మృత్యువుతో పోరాడుతూ మంగళవారం (ఈ నెల 8న) తుదిశ్వాస విడిచింది. దీంతో పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయాన్ని గణేశ్ స్నేహితుల్లో ఒకరు మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి పిల్లలను ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ను కోరారు. వెంటనే స్పందించిన హరిప్రియ దంపతులు ఇల్లెందులో నివసిస్తున్న పిల్లల అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అరకొర వసతులతో నాలుగు రేకులతో ఉన్న ఇంటిని చూసి చలించిపోయారు. ఇల్లెందు పట్టణానికి మంజూరైన 240 డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఒక ఇంటిని పిల్లలకు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్తో చర్చించి పిల్లలకు అందాల్సిన సాయంపై చర్చిస్తామన్నారు. పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తామని ఎమ్మెల్యే దంపతులు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని వారు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు తెలియజేశారు. కాగా టీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల హరికృష్ణ పిల్లల సహాయార్థం రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ హరిసింగ్నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ ఎస్డీ జానీ తదితరులు పాల్గొన్నారు.